‘ప్రభుత్వాలు ఊర్లల్లో ఫ్యాక్టరీ పెట్టలేదు, బడి కట్టలేదు, దవాఖానా పెట్టలేదు. ఏం క్యాంపు పెట్టారు? పోలీసు క్యాంపు పెట్టారు. పల్లెకు కావాల్సింది పోలీసు క్యాంపులా? కాదు, పల్లెకు కావాల్సింది బడి, దవాఖాన, భూమి, బతుకు. ఇవేవి ఇవ్వకుండా పల్లెల్లో పోలీసులను దించారు. ఓ పోలీసులారా.. నా ప్రియమైన కానిస్టేబుల్లారా. పొట్టకూటి కోసం పోలీసులైన మీరు రైతాంగం బిడ్డలే. మీ తుపాకీని మీ ఊరి మీద, మీ తమ్ముని మీద, మీ చెల్లెలి మీద ఎక్కు పెడుతున్నారు. ఆలోచించండి’ 1980 దశకంలో ప్రజాయుద్ధ నౌక గద్దర్ నక్సలైట్గా ఇచ్చిన ఈ సందేశం వీడియో అప్పటి తెలంగాణ దుస్థితికి అద్దం పడుతున్నది.
‘రాజ్యహింస పెరుగుతున్నాదో.. పేదోళ్ల నెత్తురు ఏరులయ్యి పారుతున్నాదో.. తెలంగాణ గడ్డ నెత్తుటేరులు పారుతున్నాదో..’, ఎట్లా బతుకుడు ఎలా బతుకుడు తెలంగాణ జిల్లాలోన.. లాఠీతూటల రాజ్యమాయె తెలంగాణ పల్లేలోన..’ నిజంగా తెలంగాణది ఎంత వేదన? ఎంత రోదన? ఎక్కడిదీ సాహిత్యం? ఎక్కడినుంచి పుట్టింది? కరువు, కన్నీళ్లు, హింస, వివక్ష, ఆకలి నుంచి వచ్చిన పోరాటం మూలంగానే కదా? ఏ రాజ్యం మీద అయితే గద్దర్ పోరాటం చేశారో, ఏ తుపాకులకు వ్యతిరేకంగా అయితే గద్దర్ పోరాటం చేశారో అదే రాజ్యం అధికారిక లాంఛనాలతో గద్దర్ అం త్యక్రియలు నిర్వహించటం.. అదే పోలీసులు గాల్లోకి తుపాకులు కాల్చి గౌరవ వందనం చేయడం గమనించాల్సిన గొప్ప విషయం.
ప్రజలు కోరుతున్న అవసరాలు, పల్లెకు కావాల్సిన వసతుల గురించి, పల్లెల్లో నెలకొనాల్సిన శాంతి గురించి నాడు గద్దర్ చెప్పిన మాటలు నేటి తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులకు అన్వయించుకోవాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ దేనికోసమైతే కొట్లాడిందో? దేనికోసమైతే తండ్లాడిందో? తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన దశాబ్దంలోనే తన కలలు నెరవేర్చుకుంటూ ముందుకు సాగుతున్నది. కేసీఆర్ పాలనలో తెలంగాణ పల్లె నేడు స్థిరంగా నిలబడింది. సాగునీరు, తాగునీరు, సంక్షేమం, అభివృద్ధిలో దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నది. తెలంగాణ ఏర్పడిన వెంటనే ముఖ్యమంత్రి కేసీఆర్ మొదట సాగు నీరు, కరెంటు మీద దృష్టిపెట్టారు. యుద్ధ ప్రాతిపదికన పెండింగు ప్రాజెక్టులు పూర్తిచేశారు. కేవలం మూడేండ్లలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి వినియోగంలోకి తీసుకువచ్చారు. నేడు ఆదిలాబాద్ నుంచి కోదాడ దాకా కాళేశ్వరం జలాలు కనువిందు చేస్తున్నాయి. సాగునీటితో పాటు కరెంటును అందుబాటులోకి తీసుకువచ్చి వ్యవసాయ రంగానికి 24 గంటల కరెంటు గత ఐదేండ్లుగా విజయవంతంగా అమలుచేస్తున్నారు. విద్యుత్తు రంగాన్ని పటిష్ఠం చేసి అవసరమైన కరెంటు అందుబాటులో ఉంచడం మూలంగా నేడు తెలంగాణలో చిన్న, పెద్ద, కుటీర పరిశ్రమలు, ఐటీ సంస్థలు, కార్పొరేట్ కార్యాలయాలు నిర్విఘ్నంగా తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి.
కరోనా విపత్తులో కూడా రైతుబంధు ఇచ్చి రైతుల పంటలు వంద శాతం కొనుగోలు చేసిన ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. సాగునీరు రాకతో పాటు వ్యవసాయ అనుకూల విధానాలతో తెలంగాణ వ్యవసాయరంగ స్వరూపం సంపూర్ణంగా మారిపోయింది. నాడు బతుకుదెరువు కోసం వలసపోయిన తెలంగాణ జిల్లాలకు నేడు దేశంలోని 14 రాష్ర్టాల నుంచి ఉపాధి కోసం కూలీలు వలస వస్తున్నారు.
తెలంగాణ తలసరి ఆదాయం ఏకంగా రూ.3,17,115కి ఎగబాకింది. పల్లెప్రగతి, పట్టణ ప్రగతి, హరితహారం, పల్లె ప్రకృతి వనాలతో తెలంగాణ పల్లెలు, పట్టణాలు మౌలిక సదుపాయాల కల్పనలో దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నది. ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంలో భాగంగా 26,065 ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 19,84,167 మంది విద్యార్థులకు నాణ్యమైన విద్య కొనసాగుతున్నది. దశలవారీగా డిజిటల్ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టి, విద్యార్థుల అభ్యసనా సామర్థ్యాన్ని మెరుగుపర్చేందుకు మౌలిక వసతుల ఏర్పాటుకు ఈ పథకం రూపొందించబడింది.
వైద్యరంగాన్ని బలోపేతం చేసేందుకు అనేకరకాల చర్యలు తీసుకున్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 29 మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేసింది. ఇందులో 21 ఇదివరకే ప్రారంభం కాగా.. మరో 8 వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభం కానున్నాయి. రాష్ట్రంలోని అన్ని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు బలోపేతం చేసి, నూతన వైద్యశాలలు ఏర్పాటుచేసి నూతనంగా 50 వేల పడకలను తెలంగాణలో అందుబాటులోకి తీసుకువచ్చారు. దాదాపు ప్రతి నియోజకవర్గంలో డయాలసిస్ సెంటర్లను ఏర్పాటుచేశారు. జిల్లాకో డయాగ్నోస్టిక్ హబ్ను ఏర్పాటుచేశారు. ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలు పెంచేందుకు కేసీఆర్ కిట్ పథకాన్ని అమలు చేస్తున్నారు. గర్భిణుల కోసం అమ్మఒడి వాహనాలు ఏర్పాటుచేశారు. గర్భిణులను ప్రభుత్వమే దవాఖానకు తీసుకువెళ్లి ప్రసవం అనంతరం తిరిగి 102 అమ్మఒడి వాహనంలో ఇంటి వద్ద విడిచిపెడుతున్నారు. ప్రస్తుతం ప్రజల అవసరాలు ప్రాతిపదికగా, భవిష్యత్తు తరాల అవసరాలు అంచనాగా తెలంగాణ ప్రభుత్వం అన్నిరంగాల్లో అభ్యున్నతికి పాటుపడుతున్నది.
తెలంగాణ పల్లెలు నేడు కోడికూతలు, కోడెగిత్తల సప్పుళ్లతో తెల్లారుతున్నాయి. ఒకనాడు రక్తమోడిన ఈ నేలన నేడు సాగునీళ్లు పారుతున్నాయి. నాడు కన్నబిడ్డలను కోల్పోయిన ఈ నేల నేడు పసిడి పంటలతో పురుడు పోసుకుంటున్నది. యుద్ధం తర్వాత సాధించుకున్న స్వరాష్ట్రంలో తెలంగాణ అన్నిరంగాల్లో ఉద్యమంలా అభివృద్ధి సాధిస్తున్నది. రేపటి భారతదేశానికి దిక్సూచిగా నిలుస్తున్నది.
-సందీప్రెడ్డి కొత్తపల్లి
70139 72603