Telangana | ఆదిలాబాద్ జిల్లా నుంచి మంత్రివర్గంలో స్థానం కోసం గడ్డం సోదరులు (వినోద్, వివేక్ వెంకట్స్వామి), ప్రేమ్ సాగర్రావు ఢిల్లీలో లాబీయింగ్ చేయిస్తున్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గేను వివేక్ వెంకటస్వామి కలవగా.. ‘డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, స్పీకర్ ప్రసాద్ కుమార్కు మీ సామాజిక వర్గం నుంచి ఇప్పటికే పదవులు ఇచ్చేశాం. ఇక ఆ కోటాలో ఎవరికీ ఇచ్చేది లేదు’ అని స్పష్టం చేసినట్టు వినికిడి. ‘నాకు పదవి ఇవ్వకపోయినా ఫర్వాలేదు. నా కుమారుడికి ఎంపీ టికెట్ ఇవ్వాలి’ అని విన్నవించి ఆయన హైదరాబాద్కు తిరిగి వచ్చేశారు. ఆ తర్వాత గడ్డం వినోద్ వెళ్లి ఉపకులాల గురించి ప్రస్తావించగా.. సబ్ పతా హై అని ఖర్గే అన్నట్టు సమాచారం.
మంత్రివర్గంలో బెర్తు కోమటిరెడ్డి బ్రదర్స్ మధ్య చిచ్చు రేపింది. బీజేపీ నుంచి కాంగ్రెస్లో చేరిన సందర్భంగా పార్టీ అధికారంలోకి వస్తే.. ‘మంత్రి పదవి గ్యారెంటీ’ అని కాంగ్రెస్ పెద్దలు రాజగోపాల్రెడ్డికి హామీ ఇచ్చారట. అయితే పార్టీకి విధేయుడిగా ఉన్నారనే కారణంతో మంత్రి పదవి కోమటిరెడ్డి వెంకట్రెడ్డికి దక్కింది. అప్పటి నుంచి తనకు దక్కాల్సిన మంత్రి పదవిని అన్న ఎగరేసుకుపోయాడని రాజగోపాల్రెడ్డి మండిపడుతున్నారట. దీంతో ‘ఆ ఇంటి మీది కాకి.. ఈ ఇంటి మీద వాలొద్దు.. ఈ ఇంటి మీద కాకి ఆ ఇంటి మీద వాలొద్దు’ అని తమను కలిసే వారికి బ్రదర్స్ వార్నింగ్ ఇస్తున్నట్టు వినికిడి.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకే గడ్డం తీస్తానని ఐదేండ్ల కిందట పీసీసీ అధ్యక్షుడి హోదాలో ఉత్తమ్ కుమార్రెడ్డి అప్పట్లో శపథం చేశారు. అయితే అప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రాకపోవడంతో గడ్డం తీయలేదు. ఎట్టకేలకు ఇటీవల ఆ పార్టీ అధికారంలోకి రావడంతో ఉత్తమ్కుమార్రెడ్డిని ఎవరు కలిసినా ‘గడ్డం ఎప్పుడు తీస్తారు’ అని అడుగుతున్నారట. గడ్డం తీయాలని ఆయనకు అనిపించకపోగా.. జగ్గన్న (జగ్గారెడ్డి) మాదిరిగా పెంచాలని ఉందని ఉత్తమ్ చెబుతున్నారట. దీంతో రాష్ట్రంలో కాంగ్రెస్ గెలవడం ఒక్కటే కాదు, ఉత్తమ్ మనసులో ఇంకా ఏదో ఉందని పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డికి జుబ్బా, పైజామా మీద వెయిస్ట్ కోటు ధరించడం అలవాటు. ‘అలా ఏం బాగుంటుంది.. గంగిరెద్దులోల్లలాగా ఆ కోటు ఏంటి?’ అని అప్పుడెప్పుడో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి వ్యాఖ్యానించారు. అయితే మంత్రి అయ్యాక కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కూడా ఉత్తమ్కుమార్రెడ్డి ైస్టెల్లో వెయిస్ట్ కోటు ధరిస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో రాజగోపాల్రెడ్డి వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. వెంకట్రెడ్డిని ట్రోల్ చేస్తున్నారు. అసలే అన్నదమ్ములిద్దరికీ పడటం లేదని గుసగుసలు వినిపిస్తున్న క్రమంలో ఈ ట్రోలింగ్ మరింత గ్యాప్ పెంచేలా ఉందని వారి అనుచరులు వాపోతున్నారు.
– వెల్జాల చంద్రశేఖర్