పేదల కోసం ఉచిత పథకాలను తమ ఎన్నికల ప్రణాళికలో ఏదైనా పార్టీ ప్రకటించినా లేదా ఏదైనా ప్రభుత్వం అమలు చేసినా సాధారణంగా వినిపించే మాట ‘ఈ పథకాలతో బద్ధకస్తులను తయారు చేస్తున్నారు’ అని. నిజంగా ఉచిత పథకాలు బద్ధకస్తులను తయారు చేస్తాయా? అని ప్రశ్నించుకుంటే..‘ఉచిత పథకాలు బద్ధకస్తులను తయారు చేయవు, కుటుంబాల ఆదాయాన్ని పెంచుతాయి తద్వారా రాష్ట్ర ఆదాయాన్ని పెంచుతాయి.’ అని సమాధానం వస్తుంది. అదెలాగో చూద్దాం.
ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి పేదలకు ఉపయోగపడే ఉచిత పథకాలు ఎన్నో ప్రవేశ పెట్టింది. దేశంలో పలు రాష్ర్టాలు ఈ పథకాలను అనుసరిస్తున్నాయి కూడా. చివరకు కేంద్రం కూడా రైతు బంధు, ఇంటింటికీ తాగునీరు (మిషన్ భగీరథ) పథకాలను కాపీ కొట్టి దేశమంతా అమలు చేస్తోంది. రైతు బంధు పథకంతో రైతులు బద్ధకంగా తయారయ్యారా? లేదే! ప్రస్తుతం దేశంలో అత్యధికంగా వరి పండిస్తున్న రాష్ట్రం తెలంగాణ. ఉచిత పథకాలు బద్ధకస్తులను తయారు చేస్తే దేశానికి అన్నం పెట్టే స్థాయిలో ధాన్యం ఎలా ఉత్పత్తి అవుతుంది? తెలంగాణలో దేశంలోనే అత్యధిక తలసరి ఆదాయం నమోదు అయింది. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు ఉచిత పథకాలు అమలు చేస్తున్నారు. ఈ పథకాల వల్ల బద్ధకస్తులు తయారయితే దేశంలోనే అత్యధిక తలసరి ఆదాయం తెలంగాణలో ఎలా వస్తుంది? రాష్ట్ర ఆదాయం ఏటేటా పెరుగుతూనే ఉంది కానీ తగ్గడం లేదు కదా? కరోనాను సైతం తట్టుకొని రాష్ట్రం నిలబడింది. ఆదాయం పెరుగుతూ ఉంది. ఉచిత పథకాలపై విమర్శలు చేసేవారి ఆలోచనలు తప్పు అని రుజువు అయినట్టే కదా.
దళిత బంధు ద్వారా బాగుపడ్డ ఓ కుటుంబాన్ని ఓ రైతు మిత్రుడు యూట్యూబ్లో పరిచయం చేశాడు. ఆ వీడియోలో చూస్తే.. దళిత బంధు ద్వారా ప్రభుత్వం ఇచ్చిన పది లక్షలతో ఏడు బర్రెలు కొని పాల వ్యాపారం చేస్తూ, ఏడాదిలో వచ్చిన ఆదాయంతో మరిన్ని ఆవులు కొన్నదా కుటుంబం. కుటుంబం మొత్తం పనిలో ఉంది. దళిత బంధు ద్వారా ఆ కుటుంబం బద్ధకస్తులుగా మారలేదు. మొత్తం కుటుంబం ఉపాధి పొందడమే కాదు తాము సంపాదించిన డబ్బుతో ఇంటి అవసరాలకు వస్తువులు కొన్నప్పుడు ఆటోమేటిక్గా ప్రభుత్వానికి పన్నుల రూపంలో ఆదాయం వస్తుంది.
పేదరికం వల్ల ఆరవ తరగతి నుంచే చదువు మానేసిన నా బాల్యమిత్రుడు గౌడ్. తాను కల్లు దుకాణంలో పని చేసినా చదువు విలువ తెలుసుకొని ముగ్గురు ఆడపిల్లలను ఇంజనీరింగ్ చదివించాడు. ఆరేళ్ళ క్రితం బీసీలకు కూడా విదేశీ విద్యా పథకం వస్తే వానికి చెప్పాను. ఏదో చూద్దాంలే అని దరఖాస్తు చేశాడు కానీ వస్తుంది అని నమ్మకం ఏమాత్రం లేదు. రూ.20 లక్షలు మంజూరు అయ్యాయి. అంత పెద్ద మొత్తం తన ఖాతాలో చూడడం అతనికి అదే మొదటి సారి. ‘ఇంతేసి డబ్బు ప్రభుత్వం నాకెందుకు ఇచ్చింది? ప్రభుత్వానికి ఏం లాభం?’ అంటూ ఆ మిత్రుడు ఆశ్చర్య పోయి చాలా సేపు చర్చించాడు.
‘ఇలాంటి పథకాల వల్ల వ్యక్తిగతంగా మీ కుటుంబం ప్రయోజనం పొందడమే కాదు, రాష్ర్టానికి కూడా ప్రయోజనం. ఒక కుటుంబం బాగు పడాలి అని తల్లి తండ్రులు చాలా కష్టపడి పిల్లలను చదివిస్తారు, దీని వల్ల ఆ పిల్లలకు మంచి ఉపాధి లభిస్తే ఆ కుటుంబం బాగుపడుతుంది. మొత్తం రాష్ర్టాన్ని ఓ కుటుంబంగా భావిస్తే, మీ అమ్మాయి చదువు కోసం ప్రభుత్వం 20 లక్షలు ఖర్చు చేసింది. రెండేళ్ల తరువాత మీ అమ్మాయి అమెరికాలో డాలర్లు సంపాదించి పంపిస్తే, ఆ డబ్బుతో నువ్వు మంచి జీవితం గడపడం, ఇల్లు కట్టడం లాంటివి చేస్తావు. నువ్వు ఇల్లు కట్టినా, కొన్నా ప్రభుత్వానికి పన్నుల రూపంలో ఆదాయం లభిస్తుంది. ఇలాంటి పథకాల వల్ల రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది తప్ప తగ్గదు’ అని వివరించాను. ఆరేళ్ళ క్రితం ప్రభుత్వ పథకంతో ఒక అమ్మాయి విదేశాలకు వెళితే, ఆ అమ్మాయి సహకారంతో మిగిలిన ఇద్దరు చెల్లెళ్లు కూడా విదేశాలకు వెళ్లారు. ఇలా విదేశాలకు వెళ్లిన ఎన్నో కుటుంబాలు ఉన్నాయి.
రాష్ట్ర వ్యాప్తంగా వేలాది చెరువుల్లో చేప పిల్లలు వదిలారు. వీటి వల్ల చెరువులపై ఆధారపడిన వారి ఆర్థిక పరిస్థితి మెరుగు పడింది. అదే విధంగా బర్రెలు, గొర్రెలు పంచారు. వాటి వల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఎంత బలపడిందో గ్రామాలకు వెళితే తెలుస్తుంది. తెలంగాణ ఏర్పడక ముందు గ్రామీణ ప్రాంతాల్లో నైరాశ్యం కనిపించేది. రైతుల ఆత్మహత్యలు సర్వసాధారణం. కానీ ఇప్పుడు హైదరాబాద్కు వంద కిలో మీటర్ల వరకు ఎకరం కోటి చెబుతున్నారు. ఏ మూలకు వెళ్లినా ఎకరం అరకోటి పలుకుతుంది. ఒక వైపు రైతు బంధు మరో వైపు పొలం విలువ పెరగడంతో రైతుల జీవితాల్లో గొప్ప మార్పు కనిపిస్తోంది.
చివరకు ఇంటికే పరిమితం అయ్యే వృద్ధులకు ఇచ్చే వృద్ధాప్య పెన్షన్ కూడాగ్రామీణ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. నెల నెలా రూ.2,016 రావడంతో వారు ఆత్మ విశ్వాసంతో బతుకుతున్నారు. ఆ రెండు వేలతో కిరాణా షాప్ లో ఏమైనా కొంటారు, మెడికల్ షాప్లో మందులు కొంటారు. పెన్షన్లు వచ్చినప్పుడు గ్రామాల్లో ఆ మేరకు అమ్మకాలు, కొనుగోళ్లు పెరుగుతున్నాయి. దాంతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మరింత మెరుగు పడుతుంది. రైతు బంధు అమలు తరువాత రైతులు పొలం అమ్మడానికి ఇష్టపడడం లేదు. రైతుల ఆత్మహత్యలు మాయం అయ్యాయి. తెలంగాణలో పదేళ్ల క్రితం గ్రామాలూ ఎలా ఉండేవి, ఇప్పుడు ఎలా ఉన్నాయో చూస్తే ఈ పథకాలు బద్ధకస్తులను తయారు చేస్తున్నాయా? గ్రామాలు, కుటుంబాలు కళకళలాడేట్టు చేస్తున్నాయా? అందరికీ అర్థం అవుతుంది.
గతంలో సిరిసిల్ల ప్రాంతంలో చేనేత కార్మికుల ఆత్మహత్యలు బాధ కలిగించేవి. బతుకమ్మ చీరలు వారి జీవితాలను మార్చేశాయి. బతుకమ్మ చీరల్లో రాజకీయం చూసే వారు చీరలను తగలబెట్టి మురిసిపోవచ్చు కానీ చేనేత కార్మికుల్లో, పేదల్లో ఆ చీరలు కలిగించే ఆనందం చూసే వారికి తెలుస్తుంది.
పెద్ద పెద్ద పారిశ్రామిక కుటుంబాలకు వేల కోట్ల రూపాయల రుణాలను రైట్ ఆఫ్ చేసిన దేశ పాలకులు సైతం ఉచిత పథకాలను విమర్శిస్తున్నారు. తమకు అందని ఉచిత పథకం ఏదైనా వృథానే అనిపించడం మాములే కానీ ఉచిత పథకాలు తెలంగాణ గ్రామీణ స్వరూపాన్ని మార్చేశాయి. దళిత బంధు, రైతు బంధు, పెన్షన్లు, చేపలు, బర్లు, గొర్రెలు వంటి ఈ పథకాలన్నీ కూడా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేశాయి.
ఉమ్మడి రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లాలోని ఓ గ్రామంలో అప్పటి కలెక్టర్ ఇంటింటికీ సురక్షితమైన తాగునీటిని అందించి, కొంత కాలం తరువాత ఆ గ్రామంలో మార్పులపై అధ్యయనం చేయించారు. సురక్షితమైన నీటి వల్ల ఆ గ్రామంలోని కుటుంబాల ఆర్థిక పరిస్థితి మెరుగు పడింది. ఎలా అంటే అంతకు ముందు తాగునీళ్లు బాగా లేక తరుచుగా రోగాల పాలు అయ్యేవారు. రోగం వచ్చినప్పుడు వైద్యానికి ఖర్చు, దీనికి తోడు కూలీ పనికి డుమ్మా. దానితో ఆదాయం పడిపోయేది. సురక్షితమైన నీటి వల్ల ఆరోగ్యంతో పాటు ఆదాయమూ పెరిగింది. తెలంగాణ వచ్చిన తరువాత రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికీ మంచినీరు సరఫరా ప్రభావం.. గ్రామీణ ప్రాంతాల్లో ఆదాయం పెరుగుదలపై ఉంది. మేధావుల విమర్శలు, సన్నాయి నొక్కులు ఎలా ఉన్నా, తెలంగాణ ఆదాయం పెరుగుతూనే ఉంటుంది. మరిన్ని ఉచిత పథకాలు వస్తాయి. మరింత ఆదాయం పెరుగుతుంది. ఇది ఖాయం.
గతంలో సిరిసిల్ల ప్రాంతంలో చేనేత కార్మికుల ఆత్మహత్యలు బాధ కలిగించేవి. బతుకమ్మ చీరలు వారి జీవితాలను మార్చేశాయి. బతుకమ్మ చీరల్లో రాజకీయం చూసే వారు చీరలను తగలబెట్టి మురిసిపోవచ్చు కానీ చేనేత కార్మికుల్లో, పేదల్లో ఆ చీరలు కలిగించే ఆనందం చూసే వారికి తెలుస్తుంది.