‘దొంగలందరికీ మోదీ అనే ఇంటిపేరు ఎందుకుంటోంది?’ అంటూ నాలుగేండ్ల కింద రాహుల్గాంధీ ఓ సభలో వ్యాఖ్యానించారు. దీనిపై నేరపూరిత పరువునష్టం కింద గుజరాత్లో ఒక జడ్జి రాహుల్కు రెండేండ్ల జైలు శిక్ష విధించారు. కానీ, భారత్లో పరువునష్టం చట్టం ఈ విధంగా పని చేయజాలదు. రాహుల్ వ్యాఖ్య వల్ల తన వ్యక్తిత్వానికి భంగం వాటిల్లిందని, తనకు నష్టం జరిగిందని మోదీ పేరున్న ఎవరైనా నిరూపించినప్పుడు మాత్రమే ఈ కేసు నిలుస్తుంది. కానీ, సదరు జడ్జి ఈ విషయాన్ని పట్టించుకోలేదు. ఇటువంటి మౌలికమైన న్యాయసూత్రం గురించి ఒక జడ్జికి తెలియకపోవటం విచిత్రం అంటూ రాజ్యాంగ అంశాల్లో నిపుణుడైన న్యాయవాది గౌతమ్ భాటియా ట్వీట్ చేశారు. భారతదేశంలో మారుతున్న వాతావరణంలో చివరికి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కూడా తరచూ ప్రభుత్వ డిమాండ్లకు తలూపుతున్న పరిస్థితి ఉంది.
భారతదేశంలో నేడు రాజ్యాంగ విరచిత ప్రజాస్వామ్యం ఉనికిని కోల్పోయింది. ఇప్పుడు బీజేపీ ఏం చెబితే అదే జరుగుతున్నది. ఇదే విశ్వగురు ప్రజాస్వామ్యం.
నిర్దేశిత చట్టాలకు పూర్తి వ్యతిరేకంగా ఉన్నా సరే ఇది జరుగుతున్నది. ఇటీవలే బెంగళూరులో కన్నడ నటుడు చేతన్ కుమార్ అహింసను ఒక ట్వీట్ చేసిన నేరంపై అరెస్టు చేశారు. అతడికి కోర్టు రెండు వారాల రిమాండ్ విధించింది. ‘బీజేపీ ప్రవచించే హిందుత్వ భావజాలం అబద్ధాలే పునాదిగా రూపుదిద్దుకున్నది. దానిని సత్యంతో ఓడించవచ్చు’ అని ఆయన ట్వీట్ చేశారు. దీని మీద భజరంగ్దళ్ సభ్యుడు ఒకరు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు చేతన్ను అరెస్టు చేశారు. నేరం చేశారని వచ్చిన ఫిర్యాదులపై ఎఫ్ఐఆర్ దాఖలు చేయటం పోలీసుల బాధ్యత. అవసరమైతే సొంతంగాగానీ, కోర్టు అనుమతితోగానీ నిందితుడిని అరెస్టు కూడా చేయవచ్చు. అయితే, ప్రతి ఫిర్యాదుపై అరెస్టు తప్పనిసరి కాదు. కానీ, బీజేపీకి సంబంధించిన వాళ్లు ఫిర్యాదు చేస్తే ఆగమేఘాల మీద స్పందించి పోలీసులు చర్యలు తీసుకుంటారు. కానీ ఇతరులు రేప్, మర్డర్ వంటి తీవ్రమైన నేరాల మీద ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయటానికి సైతం పోలీసులు అంగీకరించని ఘటనలు ఎన్నో ఉన్నాయి.
చేతన్పై ఐపీసీ 505(2) కింద కేసు పెట్టారు. ‘ప్రజల మధ్య శత్రుత్వాన్ని, విద్వేషాన్ని రెచ్చగొట్టేలా మాట్లాడటం. ఒక మతాన్ని, మత విశ్వాసాల్ని కించపరిచేలా మాట్లాడటం’ ఈ సెక్షన్ల కింద వస్తుంది. దీని ప్రకారం ఎటువంటి వ్యాఖ్యలపైన అయినా కేసులు పెట్టొచ్చు. పోలీసులు చేసే ప్రతీ అరెస్టును న్యాయవ్యవస్థ సమీక్షిస్తుంది. చేతన్ను జడ్జి ముందు పోలీసులు హాజరుపరిచినప్పుడు ఆయనకు 14 రోజుల కస్టడీ విధించారు. రెండు రోజుల తర్వాత ఆయనకు బెయిల్ ఇచ్చినప్పటికీ, కేసు మాత్రం కొనసాగుతున్నది. చేతన్ను బెంగళూరు పోలీసులు అరెస్టు చేస్తున్న సమయంలోనే, ఢిల్లీలో పోలీసులు ఆగమేఘాల మీద ఆరుగురిని అరెస్టు చేశారు. వారిలో ప్రింటింగ్ ప్రెస్సుల యజమానులు కూడా ఉన్నారు. 100 ఎఫ్ఐఆర్లు దాఖలు చేశారు. వీరు చేసిన నేరం ఏమిటంటే.. ‘మోదీ హటావో.. దేశ్ బచావో’ (మోదీని గద్దె దించి దేశాన్ని కాపాడండి) అని రాసి ఉన్న పోస్టర్లను వేయటం.
ఇది జరగటానికి కొంత సమయం ముందు.. ఈశాన్య భారతంలో ఒక టీనేజీ అమ్మాయికి కోర్టు నుంచి రక్షణ లభించింది. ‘అకోమ్ కొరిమ్ రాష్ట్ర ద్రోహ్’ (నేను మళ్లీ దేశద్రోహానికి పాల్పడ్డాను) అనే కవిత రాసినందుకు అస్సాంలో 19 ఏండ్ల బర్షశ్రీ బురగోహెయిన్ మీద ఉగ్రవాదం కేసులు మోపారు. రెండు నెలల జైలు తర్వాత ఆమెకు కోర్టు నుంచి ఉపశమనం లభించింది. ప్రసంగం, ట్వీట్, కవిత, పోస్టర్ల మీద కూడా క్రిమినల్ కేసులు, అరెస్టులు, జైలు శిక్షలు దేశంలో పెరిగిపోతున్నాయి. మోదీ బీజేపీ పాలనలో దేశంలో నిరంకుశత్వం పాదుకుంటున్నది. పార్లమెంటులోగానీ, వీధుల్లోగానీ ప్రభుత్వంపై విమర్శను, అసంతృప్తిని సహించలేని వాతావరణం నెలకొన్నదంటే రాజ్యాంగంలో పేర్కొన్న ప్రజాస్వామ్యం నేడు భారతదేశంలో ఉనికిని కోల్పోయిందని అర్థం. బీజేపీ ఏం చెబితే అదే జరుగుతున్నది.
నేడు భారతదేశంలో ఉన్న ఈ కొత్త తరహా ప్రజాస్వామ్యాన్ని విశ్వగురు మాడల్గా అభివర్ణించవచ్చు. ఆధునిక భారతదేశ నిర్మాతలు ఎవరూ దీనిని కోరుకోలేదు. భారత్ను హిందూదేశంగా మలిచే ఈ మాడల్ను వారు తిరస్కరించారు కూడా. కానీ, నేడు అది దేశమంతటా వ్యాపించిపోయింది. కేవలం ఇండియా/భారత్ అనే పేరు మాత్రమే మిగిలింది. మోదీ తరచూ విశ్వగురు అనే పదాన్ని వాడుతుంటారు. భారత్ను ప్రజాస్వామ్యానికి మాతృమూర్తిగా అభివర్ణిస్తుంటారు. ప్రజాస్వామ్య ఆదర్శాలకు సంబంధించి ప్రపంచానికే భారత్ నాయకత్వం వహిస్తుందని విశ్వగురు ప్రజాస్వామ్య మాడల్ ఘనంగా ప్రకటిస్తున్నది. అయితే, ప్రశ్నించటాన్ని తాము అనుమతించబోమనే విషయాన్ని మాత్రం ఈ మాడల్ ఎక్కడా ప్రకటించుకోదు. అంటే అది చెప్పేది ఒకటి చేసేది మరొకటి. నిజానికి ప్రజాస్వామ్య ఆదర్శాలను, సిద్ధాంతాలను బలోపేతం చేయటం గురించి కాదు.. వాటిని ఎలా నాశనం చేయాలో ఈ విశ్వగురు ప్రజాస్వామ్య నమూనా ప్రపంచానికి బోధిస్తుంది. విశ్వగురు ప్రజాస్వామ్యం ప్రకారం.. ప్రధానమంత్రి, కేంద్రప్రభుత్వం అంటేనే భారతదేశం. వాటిపై ఎటువంటి విమర్శ అయినా దేశద్రోహం, దారుణమైన నేరం. కేంద్ర న్యాయశాఖ మంత్రే స్వయంగా వాకృచ్చారు. ‘ఎవరూ తప్పించుకోలేరు. దేశానికి వ్యతిరేకంగా పని చేసే వారందరూ మూల్యం చెల్లించుకోకతప్పదు’ అంటూ. భారత్లో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉన్నదని వ్యాఖ్యానించిన రాహుల్గాంధీకి, ఇదే విషయంపై ఆవేదన వ్యక్తం చేసిన కొందరు సుప్రీంకోర్టు, హైకోర్టు మాజీ న్యాయమూర్తులకు కిరెణ్ రిజిజు జారీ చేసిన బహిరంగ హెచ్చరిక ఇది. తన ప్రవర్తన వాళ్ల విమర్శను రుజువు చేస్తున్నదన్న సోయి కూడా న్యాయమంత్రికి ఉన్నట్టు లేదు.
విమర్శకులపై ప్రభుత్వ పెద్దలే ఈ విధమైన బెదిరింపులకు దిగుతున్నారు కాబట్టి వారికి తగినట్లుగా.. యథేచ్ఛగా, చట్టాలను, నిబంధనలను పట్టించుకోకుండా అధికార యంత్రాంగం పని చేసే వాతావరణం నెలకొన్నది. పాలకపార్టీ భావజాలానికి వ్యతిరేకంగా మాట్లాడితే చాలు.. వారి మీద కేసులు, అరెస్టులు, జైలు శిక్షలు. బీజేపీ పాలనలో ఉన్న మహారాష్ట్రలో గత నాలుగు నెలల్లో మతవిద్వేష సభలు 50కిపైగా జరిగాయి.
ముస్లింలకు వ్యతిరేకంగా ప్రకటనలు, బెదిరింపులే ఈ సభల్లో పాల్గొన్న వక్తల ప్రసంగాలు. ఇటువంటి వాటిని ఆపాలని, పోలీసులు చట్టబద్ధంగా పని చేయాలని సుప్రీంకోర్టు కొన్ని నెలల కింద స్పష్టంగా చెప్పినప్పటికీ ఈ తరహా సభలు జరుగుతూనే ఉన్నాయి. భారత్లోని కొత్త ప్రజాస్వామ్యంలో ద్వేషాన్ని ప్రచారం చేసే వాళ్లకు పోలీసులు భావవ్యక్తీరణ స్వేచ్ఛను, రక్షణను కల్పిస్తుంటారు. కానీ ఒక టీనేజీ కవయిత్రి, ఒక నటుడు, రాజకీయ ప్రత్యర్థులు మాత్రం తమ అభిప్రాయాల్ని చెప్పినందుకు క్రిమినల్ కేసుల్ని ఎదుర్కొంటారు. ఇదే విశ్వగురు భారత్ ప్రజాస్వామ్య నమూనా.
ఈ నమూనా నేడు భారత్ను పూర్తిగా తన నియంత్రణలోకి తీసుకున్నది. ఒకప్పుడు విద్వేషపూరిత వ్యాఖ్యల్ని కొట్టిపారేసిన ప్రధాన స్రవంతి మీడియా నేడు వాటిని హెడ్లైన్లుగా ప్రచురిస్తున్నది. వాట్సాప్లో చక్కర్లు కొట్టే మాటలు ఇప్పుడు నిజాలుగా భావించబడుతున్నాయి. దీని ప్రభావం బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో కూడా కనిపిస్తున్నది. కమ్యూనిస్టు కేరళలో ఒక ఆలయానికి ఇటీవల ఆకుపచ్చ రంగు వేశారు.
కానీ, బీజేపీ, దాని అనుబంధ సంఘాల హెచ్చరికతో ఆ రంగును మార్చి నిర్వాహకులు వేరే రంగు వేశారు. కాంగ్రెస్ పాలిత ఛత్తీస్గఢ్లో ఒక మహిళ అంత్యక్రియల్ని హిందువులు అడ్డుకున్నారు. కారణం, ఆమె క్రైస్తవంలోకి మారటం. అదే పార్టీ అధికారంలో ఉన్న హిమాచల్ ప్రదేశ్లో క్రైస్తవుల ప్రార్థనా సమావేశాలను హిందుత్వవాదులు పోలీసులను తీసుకెళ్లి మరీ అడ్డుకుంటున్నారు.
నిజానికి ప్రజాస్వామ్య ఆదర్శాలను, సిద్ధాంతాలను బలోపేతం చేయటం గురించి కాదు.. వాటిని ఎలా నాశనం చేయాలో ఈ విశ్వగురు ప్రజాస్వామ్య నమూనా ప్రపంచానికి బోధిస్తుంది. విశ్వగురు ప్రజాస్వామ్యం ప్రకారం.. ప్రధానమంత్రి, కేంద్రప్రభుత్వం అంటేనే భారతదేశం. వాటిపై ఎటువంటి విమర్శ అయినా దేశద్రోహం, దారుణమైన నేరం.
గుజరాత్ హత్యాకాండలో మోదీ పాత్రను వివరిస్తూ వచ్చిన బీబీసీ డాక్యుమెంటరీ చూసినందుకు ఢిల్లీలో ఇద్దరు యూనివర్సిటీ విద్యార్థులను ఏడాదిపాటు పరీక్షలు రాయకుండా అధికారులు నిషేధం విధించారు. మహారాష్ట్రలో ప్రభుత్వం మారగానే పోలీసుల వైఖరి మారిపోయింది. ఔరంగాబాద్ అనే పేరున్న బోర్డులు, ఇతర సూచికలపై మతోన్మాదులు దాడి చేస్తూ, ధ్వంసం చేస్తున్నా వారు ఎటువంటి చర్యలు తీసుకోవటం లేదు. ఔరంగజేబు మంచివాడే అని వాట్సాప్లో ఒక పోస్టు పెట్టినందుకు ఒక ముస్లిం యువకుడిపై క్రిమినల్ కేసు పెట్టారు. ఇదీ విశ్వగురు భారత్.
(వ్యాసకర్త: ఆర్టికల్15.కామ్ ఎడిటర్) (స్క్రోల్ సౌజన్యంతో..)
సమర్ హలార్న్కర్