‘దైవం, పరమాత్మ, భగవంతుడు, పరబ్రహ్మం, నిరాకార బ్రహ్మం..’ అంటూ పలు పదాలను జనులు సర్వసాధారణంగా ప్రయోగిస్తున్నా వాటి సంపూర్ణ అవగాహన అందరికీ ఉంటుందని చెప్పలేం. అందరికీ సంపూర్ణమైన జ్ఞానం ఇవ్వడానికి ‘భగవద్గీత’ సిద్ధంగా ఉంది. ‘గీతాజ్ఞానాన్ని’ యథాతథంగా తీసుకొన్నవారికి జీవితంలో విజయభేరులే సర్వదా వినిపిస్తాయి. ఆధ్యాత్మిక వాదులు పైన తెలిపిన విభిన్న పదాలను ప్రయోగిస్తున్నా జీవితంలో నానా రకాల కష్టనష్టాలకు గురికావడం చూస్తే వారికి తత్త్వం సంపూర్ణంగా అర్థం కాలేదనే అనుకోవలసి వస్తుంది. ‘గీతాజ్ఞానం’ ప్రకారం సర్వత్రా వ్యాపితమైనట్టి నిరాకార తత్త్వమే ‘నిరాకార బ్రహ్మతత్త్వం’. అది రహస్య జ్ఞానంగా చెప్పబడింది. ప్రతీ జీవి హృదయంలో నెలకొన్నదే ‘పరమాత్మ తత్త్వం’. ఇక ‘షడ్విభూతి’ సంపన్నుడైన సచ్చిదానంద విగ్రహుడే ‘భగవంతుడు’. ‘సత్’ అంటే ‘నిత్యత్వం’, ‘చిత్’ అంటే ‘జ్ఞానం’, ‘ఆనందం’ అంటే ‘ఆనందానుభూతి’. ఈ మూడు కలిసిన దివ్యస్వరూపుడే భగవంతుడు. నిరాకార బ్రహ్మంలో ‘సత్’ మాత్రమే ఉంటుంది, ‘పరమాత్మ తత్త్వం’లో సత్, చిత్ రెండూ ఉంటాయి. ‘భగవత్తత్త్వం’లో సత్ , చిత్, ఆనందం ఉంటాయి. ఈ మూడు తత్త్వాలకు వేర్వేరు ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టే, అవి నెలకొన్నాయి.
ఆత్మ ఏదో ఒక దేహాన్ని ఆశ్రయించి ఉంటుంది. దాని ప్రభావం శరీరమంతా వ్యాపించి ఉంటుంది. శరీరంలోని ఏ మూల ఏది జరిగినా ఆత్మ ఉనికి కారణంగానే అది వెంటనే అనుభూతమవుతుంది. అయితే, వేరే శరీరంలో జరిగే విషయాలు ఈ ఆత్మకు తెలిసే అవకాశం లేదు. ఎందుకంటే, ఆత్మ, ఆత్మప్రభావం కేవలం ఒకే శరీరానికి పరిమితమై ఉం టాయి. అయితే, ఆత్మతోపాటుగా పరమాత్ముడుకూడ శరీరంలో ఉంటాడనేది దివ్యమైన ‘గీతాజ్ఞానం’. ఇది రహస్యతరమైన జ్ఞానంగా శ్రీకృష్ణభగవానునిచే వర్ణితమైంది. ‘శరీరంలోనే ఉండి పరమాత్ముడు చేసే కార్యం ఏమిటి?’ అన్న ప్రశ్నకు సమాధానంగా ‘భగవద్గీత’ ఇలా పలికింది:
ఈశ్వరః సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్ఠతి
భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా॥
-భగవద్గీత (18.61)
‘ఓ అర్జునా! పరమ పురుషుడు అందరి హృదయాలలో నెలకొన్నవాడై ప్రకృతినుండి తయారైన యంత్రంపై ఆసీనులైన సకల జీవుల గతులను నిర్దేశిస్తున్నాడు’. ఈ గీతాసందేశం ప్రకారం పరమాత్ముడు జీవుల సకలగతులను నిర్దేశిస్తున్నాడు. రంగులరాట్నంపై కూర్చున్న వ్యక్తులు పైకి, కిందకు తిరుగుతుంటారు. అందరినీ తిప్పేది ఒకే ఒక వ్యక్తి అయి ఉంటాడు. అలాగే, సకల జీవుల గతులను నిర్దేశించేదికూడా పరమాత్ముడే. పిల్లవాడు కోరిన కోరికలను తండ్రి తీర్చినట్లుగా జీవుని కోరికలను పరమాత్ముడు తీరుస్తాడు. అందుకే, పరమాత్ముని జ్ఞానంతోనే ‘పరమోన్నతి’ కలుగుతుందని చెప్పబడుతున్నది.
ఆత్మతోపాటుగా జీవుని హృదయంలో ఉండే పరమాత్ముడే సాక్షిగా, అనుమతించేవానిగా, ప్రభువుగా, పరమభోక్తగా, సర్వాధిపతిగా (మహేశ్వరుడు) నెలకొని ఉంటాడు. జీవుని ఆలోచనలకు, ఆచరణలకు, కోరికలకు సాక్షిగా ఉండేవాడు పరమాత్ముడే. జీవుడు ఏది తీవ్రంగా కోరుకుంటే దానిని అనుమతించే వాడుకూడ పరమాత్ముడే. జీవుడు ముల్లోకాలలో కోరుకునే దేనినైనా ఇవ్వగలిగిన మహేశ్వరుడుకూడ పరమాత్ముడే. ఇదే ‘పరమాత్మ జ్ఞానం’. ఇదే ‘గీత’లో చెప్పబడిన ‘రహస్యతరమైన జ్ఞానం’. మనిషి సాధారణంగా తనకు లభించని దానిగురించి ఏడుస్తూ ఉంటాడు. దానికి పరమాత్ముడు చేసే ప్రతిక్రియ ఏదీ ఉండదు. మనిషి తనకు కావలసింది తీవ్రంగా కోరుకుంటే దానిని తీర్చడానికి పరమాత్ముడు సిద్ధంగా ఉంటాడు. ‘నీ కోరికలు తీరేలా పరమాత్ముడు ఏర్పాట్లు చేస్తాడు. కానీ, నీ దుఃఖాలు తీరే విధంగా కాదు. దీనిని మనిషి అర్థం చేసుకొంటే పూర్ణసుఖ భాగ్యుడయ్యే అవకాశం ఉంటుంది.
డాక్టర్ వైష్ణవాంఘ్రి సేవక దాస్
98219 14642