భారతదేశం అనేక రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ ముందుకు సాగుతున్నది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా రూపుదిద్దుకుంటున్నది. దేశ జాతీయ స్థూల ఉత్పత్తి (జీడీపీ) రోజురోజుకు పెరుగుతూ, జీఎస్టీ రాబడి నెలకు దాదాపు లక్షా యాభై వేల కోట్లకు చేరింది. ఇన్కంటాక్స్ రిటర్న్స్ పెరుగుతూ సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తున్నది. మరోవైపు సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు పెరుగుతున్నాయి. అయినా పేదరికం, ఆకలికేకలు, నిరుద్యోగం, అనారోగ్యం దేశాన్ని వెంటాడుతూనే ఉన్నాయి.
దేశంలో నేటికీ ప్రజలకు కనీస సౌకర్యాలు లేవు. ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం (యూఎన్డీపీ) నిర్వహించే మానవాభివృద్ధి సూచికలో 2021-22లో భారత్ 132 స్థానంలో నిలిసింది. దీనికి కారణాలను నేటి ప్రభుత్వాలు విశ్లేషించుకోవాలి. అంకెలు/సంఖ్యలు చూసి అభివృద్ధి సాధించామని ప్రభుత్వాలు భావిస్తే, బోర్లాపడ్డట్టే. ఇకనైనా ప్రజల వాస్తవ జీవితాల్లో మార్పులు వచ్చే విధంగా ప్రభుత్వాలు కంకణం కట్టుకోవాలి. మాన వాభివృద్ధి సూచికలో ఫిన్లాండ్, స్వీడన్, నార్వే వం టి నార్డిక్ దేశాలు ముందంజలో ఎలా ఉంటున్నా యో, ఏయే రంగాలకు ప్రాధాన్యం ఇస్తున్నాయో గ్రహించాలి. ఒక దేశాభివృద్ధి విద్య, వైద్యరంగాలపై ఆధారపడి ఉంటుందనే విషయం మరువరాదు.
గత రెండేండ్లుగా వివిధ అంశాల్లో భారత్, ప్రపంచదేశాలతో పోలిస్తే చాలా వెనుకబడి ఉన్నట్లు నివేదికలు చెప్తున్నాయి. పేదరికంలో 66వ స్థానం, ఆకలి సూచీలో 107, మహిళా భద్రతలో 133, నిరుద్యోగ రేటులో 23.01 శాతం, అవినీతిలో 85, సంతోషంలో 139, లింగ వివక్షలో 140వ స్థానంలో ఉండటం గమనార్హం. మనిషి గౌరవంగా జీవించడానికి కనీస అవసరాలైన కూడు, గూడు, గుడ్డ ఉండాలని అంతర్జాతీయ చట్టాలు చెప్తున్నాయి. ఆ మాటకొస్తే భారత రాజ్యాంగం కూడా ప్రతి పౌరుడు సమానంగా జీవించే హక్కునిచ్చింది. అయినా ఈ డబ్బు ఐదేండ్లుగా దేశాన్ని పాలించిన ప్రభుత్వాలు, పార్టీలు, నాయకులు ఆ అవసరాలు తీర్చలేక పోయారు. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు అనేక వాగ్దానాలు చేస్తూ ప్రజలను ప్రలోభాలకు గురి చేస్తూ ఓట్లు దండుకుంటున్నాయి. ఓట్ల కోసం ప్రజల మధ్య కుల, మత, జాతి, లింగ, ప్రాంతీయ, భాషా విభేదాలు సృష్టిస్తూ పబ్బం గడుపుకోవటం పరిపాటిగా మారింది. అంతేగానీ దేశ ప్రజలందరూ సమానంగా జీవించేందుకు కావలసిన మౌలిక సదుపాయాలు కల్పించటంలో మాత్రం విఫలమవుతున్నాయి. దేశ ప్రజలకు కనీసం మంచినీటి సౌకర్యం కూడా అందించలేకపోవడం బాధాకరం. ఇకపోగా నాణ్యమైన విద్య, వైద్యం అందించేందుకు కృషి కూడా జరగటం లేదు. పైగా విద్య, వైద్య రంగాలను ప్రైవేటీకరించడానికి అనేక మార్గాల ను అన్వేషిస్తున్నారు. అందులో భాగంగా బడ్జెట్లో అరకొర నిధులు కేటాయించటం గమనార్హం.
దీనంతటికీ కారణం దేశంలోని సంపద కొంతమంది చేతుల్లో కేంద్రీకృతమై ఉండటం. 77 శాతం సంపద కేవలం 10 శాతం మంది బడా వ్యాపారుల వద్ద ఉండటం గమనార్హం. పబ్లిక్ బ్యాంకులు, ప్రభుత్వాలు రకరకాల నిధులు పేర్లతో కార్పొరేట్లకు దోచిపెడుతున్నాయి. ధనికులు, భూస్వాములు తీసుకున్న రుణాలు మాఫీ, వైండప్, రైటాఫ్ చేయడం ద్వారా ప్రజల సొమ్మును కార్పొరేట్లకు ధారాదత్తం చేస్తున్నారు. అందరికీ విద్య అందని ద్రాక్షగా మారటంతో పేదలు అనేకరంగాల్లో వెనుకబాటుకు గురవుతున్నారు. బడుగు, బలహీనవర్గాల ప్రజలు, గిరిజనులు నేటికీ అభివృద్ధికి ఆమడదూరంలోనే ఉన్నారు. వారికి నాణ్యమైన విద్య, వైద్యం అందించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయి.
హెల్త్కేర్, శానిటేషన్, క్లీన్ వాటర్, ఎనర్జీ, క్వాలిటీ ఎడ్యుకేషన్, పర్యావరణం, మహిళాభద్రత, అవినీతి రహిత సమాజం, ఉద్యోగ ఉపాధి అవకాశాలు, లింగ వివక్ష లేని సమాజం ఏర్పాటు చేసేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఇకనైన చొరవ చూపాలి. ప్రభుత్వరంగ సంస్థల ఏర్పాటు, ప్రజల కనీస అవసరాలు తీర్చే అంశాలపై ప్రభుత్వాలు దృష్టిసారించాలి. బడ్జెట్లో నిధుల కేటాయింపులు పెంచాలి. తద్వారా మానవాభివృద్ధి సూచికలో దేశ ప్రజలందరూ ముందు వరుసలో ఉండాలని కోరుకుందాం. ప్రస్తుతం అనేక అంతర్జాతీయ సంస్థలకు నాయకత్వం వహిస్తున్న మన భారతదేశం భవిష్యత్తులో వివక్షలు, అసమానతలు లేని దేశంగా నిలవాలని ఆశిద్దాం.
ఐ.ప్రసాదరావు