సర్కారు చదువులంటేనే చీదరించుకునే పరిస్థితుల నుంచి.. గురుకులాల్లో సీట్ల కోసం తల్లిదండ్రులు కిలోమీటర్ల కొద్ది నిలబడే పరిస్థితి వచ్చింది. స్వాతంత్య్ర భారత చరిత్రలో ఎక్కడా, ఎప్పుడూ ఇలాంటి పరిస్థితులు కనిపించలేదు. అంటే.. భావి పౌరుల భవిష్యత్పై రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని దీనినిబట్టి అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రంలో ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూళ్లు 847 వరకున్నాయి. ఈ స్కూళ్లలో 6 లక్షల మందికి పైగా విద్యార్థులు చదువుకుంటున్నారు. పదో తరగతి వరకు విద్యనందిస్తున్న రెసిడెన్షియల్ స్కూళ్లలోనే ఇంటర్మీడియట్ విద్య కూడా అందించాలని రాష్ట్ర సర్కారు నిర్ణయం తీసుకోవడం ముదావహం.
రాష్ట్రంలో విద్యావ్యవస్థ బలపడుతున్నదనడానికి మరో నిదర్శనం జూనియర్ కళాశాలలు. బాలురకు 351, బాలికలకు 396, 23 కో-ఎడ్యుకేషన్ జూనియర్ కళాశాలలున్నాయి. ఇవికాకుండా ఇంటర్మీడియట్ బోర్డు పరిధిలో మరో 13 బాలురకు, 45 బాలికలకు, 347 కో ఎడ్యుకేషన్ జూనియర్ కళాశాలలున్నాయి. రాష్ట్రంలో మొత్తం 1,175 ఇంటర్మీడియట్ రెసిడెన్షియల్ కళాశాలలున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో 200 డిగ్రీ కళాశాలలున్నాయి. ఇందులో పలు సంక్షేమశాఖల పరిధిలో బాలురకు 7, బాలికలకు 46 రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలున్నాయి. కళాశాల ఎడ్యుకేషన్ శాఖ పరిధిలో అమ్మాయిలకు మరో 14 డిగ్రీ కాలేజీలు, 133 కో-ఎడ్యుకేషన్ కళాశాలలున్నాయి. కొత్తగా మరో 33 బీసీ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలల ఏర్పాటుకు సర్కారు నిర్ణయం తీసుకున్నది. అంటే ఒక్కో జిల్లాకు ఒక్కో డిగ్రీ కళాశాల అన్నమాట. 15 మహాత్మా జ్యోతిబా ఫూలే గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలను ఈయేడు నుంచే ఏర్పాటుచేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. రాబోయే విద్యా సంవత్సరంలో వీటిని 17కు పెంచి మిగతా అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేయాలన్నారు.
విద్యావ్యవస్థలో మార్పులు తీసుకురావాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగానే ఢిల్లీ వెళ్లి, అక్కడి ప్రభుత్వ స్కూళ్లను పరిశీలించారు. కఠిన విషయాలను కూడా పిల్లలు సులువుగా నేర్చుకునేలా, పిల్లల్లో కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచేలా, స్కూల్ వయసులోనే ఆవిష్కర్తలుగా మారేలా అందుతున్న విద్యావిధానం గురించి తెలుసుకున్నారు. రాష్ట్రంలోనూ అలాంటి మార్పులు తీసుకొచ్చే ప్రయత్నాల్లో ప్రభుత్వం ఉన్నది. ప్రభుత్వం ఇటీవలే ఉద్యోగ నోటిఫికేషన్లు కూడా జారీచేసింది. పేద విద్యార్థులకు అందుబాటులో ఉండేలా గ్రామీణ ప్రాంతాల్లోనూ స్టడీసర్కిళ్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించడం హర్షనీయం.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు ప్రతి జిల్లాలో ఒక్కో వర్గానికి ఒకటి చొప్పున 33 జిల్లాల్లో 132 స్టడీ సర్కిళ్లు ప్రభుత్వం ఏర్పాటుచేయనున్నది. పోటీ పరీక్షలకు సిద్ధం చేసే శిక్షణ కేంద్రాలుగానే కాకుండా, దేశవ్యాప్తంగా ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ల వివరాలు అందించేలా, చదువుకు తగ్గ ఉపాధి సమాచారాన్ని, గైడెన్స్ను అందించే కేంద్రాలుగా స్టడీ సరిళ్లు సిద్ధం కానున్నాయి. ఈ కేంద్రాల్లో మధ్యాహ్న భోజనం కూడా ప్రభుత్వమే అందించనున్నది. విద్యా వికాసంలోనే కాదు, ఉద్యోగ కల్పనలోనూ తెలంగాణ నంబర్-1గా నిలుస్తున్నది. మోదీ పాలనలో దేశంలోని కంపెనీలు విదేశాలకు వెళ్లిపోతుంటే.. రాష్ట్ర మంత్రి కేటీఆర్ కృషితో విదేశీ కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులకు ముందుకొస్తున్నాయి. ఈ కంపెనీలు యువతకు ఉపాధి కల్పిస్తున్నాయి. ఇప్పటివరకు రాష్ర్టానికి రూ.2.2 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. దీని ద్వారా 16 లక్షలకు పైగా యువతకు ఉద్యోగాలు దొరికాయి. కొత్తగా రాబోతున్న కంపెనీలతో మరింత మందికి ఉపాధికి అవకాశాలు లభించనున్నాయి.
విద్య నిగూఢ గుప్తమగు విత్తము; రూపము పూరుషాళికిన్
విద్య యశస్సు భోగకరి, విద్య గురుండు, విదేశ బంధుడున్
విద్య విశిష్ట దైవతము, విద్యకు సాటి ధనంబు లేదిలన్
విద్యనృపాల పూజితము, విద్య నెఱుంగని వాడు మర్త్యుడే?!
విద్య ఎవ్వరికీ కనిపించని ఐశ్వర్యం. జ్ఞానం కలిగి ఉన్నవాళ్ల ముఖం ప్రకాశవంతంగా వెలిగిపోతూ ఉంటుంది. విద్య వల్ల తేజస్సు వస్తుంది. మంచి కీర్తి లభిస్తుంది. విద్యావంతులు భోగాలు అనుభవిస్తారు. విద్యే గురువు! విదేశాలు వెళ్లినా విద్యే బంధువు. విద్యను అందరూ దైవంగా భావిస్తారు. ‘విద్యకు సమానమైన ధనం లేద’ని భర్తృహరి ఏనాడో చెప్పారు. మంచిని ఆచరించే మన ప్రభు త్వం.. విద్యార్థులు విద్య అనే ఐశ్వర్యంతో తులతూగేలా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నది. వారికి ఉపాధి మార్గాలు చూపి స్తూ తోడుగా ఉంటున్నది.
(వ్యాసకర్త: చైర్మన్, రాష్ట్ర పునరుత్పాదక శక్తి అభివృద్ధి సంస్థ)
– వై.సతీష్ రెడ్డి
96414 66666