జీఎస్టీ కౌన్సిల్ సమావేశమైంది. స భ్యులు ఎవరూ హాజ రు కాలేదు. ఎందుకు రాలేదో కనుక్కోమని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ తన పీఏను ఆదేశించారు. కాసేపటికి పీఏ వచ్చి, కొత్తగా దేని మీద వేస్తారో మాకు తెలుసు..ఆ మాత్రానికే రావాలా? అని అంటున్నారని చెప్పాడు. దేని మీద వేసేది వారికెలా తెలుస్తుంది? అని మంత్రి ప్రశ్నించారు. కొత్తగా దేని మీద వేసేది వాళ్లు జాబితా కూడా చదివి వినిపించారని పీఏ అన్నాడు. వాళ్లు చెప్పిందేమిటో ఒకసారి చదవండని నిర్మల ఆదేశించారు. స్మశానాల మీద ఇప్పటికే పన్ను వేసారు కాబట్టి ఇక వేయబోయేది పెళ్లిళ్లకు, సీమంతాలకు, బారసాల, బర్త్డే, మ్యారేజీడేలకని చెప్పారని అన్నాడు. ‘ఇంత పక్కగా వాళ్లు ఎలా చెప్పా రు.. ఎవరో లీక్ చేసినట్టున్నారు.. అన్నీ కరక్టే కానీ ఒకటి మాత్రం వాళ్లకు తెలియనట్టుందని నిర్మల అన్నారు. ఏమిటది మేడమ్? అని పీఏ ఆసక్తిగా అడిగాడు. ‘ఫస్ట్ నైట్పై’ అనడంతో పీఏ కళ్లు తిరిగి కింద పడబోయాడు.
బీజేపీ జాతీయ సమావేశాలు హైదరాబాద్లో జరిగిన తర్వాత కాంగ్రెస్లో కలవరం మొదలైంది. టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం తామేనని బీజేపీ చెప్పుకొంటుండటంతో, ఈ ప్రచారాన్ని ఏ విధంగా తిప్పికొడుదామని టీపీసీసీ నేతలు ఏఐసీసీ ఇంచార్జీలతో సమాలోచనలు జరిపారు. కాంగ్రెస్ను గెలిపించినా, వారు వెళ్లి కలిసేది టీఆర్ఎస్లోనే అని ప్రజల్లో బలంగా నాటుకుపోయినట్టు సర్వేలో తేలిందని ఈ సమావేశానికి హాజరైన ఎన్నికల వ్యూహకర్త సునీల్ బయటపెట్టారు. ఈ మచ్చను ఎలా పోగొట్టుకుందామనేది చర్చకు వచ్చింది. పార్టీలో కొత్తగా చేరేవారైనా, ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు అయినా భవిష్యత్తులో పార్టీ మారబోమని ఒట్టు వేయించుకుంటే సరిపోతుందన్న ప్రతిపాదన వచ్చింది. హైదరాబాద్ నగర నాయకుడు ఒకరు భాగ్యలక్ష్మి అమ్మవారి ముందు ప్రమాణం చేయిద్దామన్నారు. ఆ అమ్మవారిని బీజేపీ వాళ్లు ఓన్ చేసుకున్నారని ఒక నాయకుడు అభ్యంతరం చెప్పారు. జోగులాంబ అమ్మవారి వద్ద అయితే బాగుంటుందని ఒక నేత సూచించారు. బండి పాదయాత్ర అక్కడి నుంచే ప్రారంభించారు కదా? అని మరొక నాయకుడు గుర్తు చేశారు. యాదగిరిగుట్టపై ఒట్టు వేయిద్దామంటే దానికేమో కేసీఆర్ కట్టించారనే పేరు వచ్చిందని ఇంకో నాయకుడు వాపోయారు. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో ఓట్లే కాదు.. చివరికి దేవుళ్లు కూడా దూరం అయ్యారా? అని ఏఐసీసీ ఇంచార్జి ఒకరు ప్రశ్నించడంతో… అక్కడున్న వారికి ఏం చెప్పాలో తెలియక నోరెళ్లబెట్టారట.