కొన్ని దశాబ్దాలుగా వ్యోమగాములకు, శాస్త్రవేత్తలకు మాత్రమే పరిమితమైన అంతరిక్షం ఇకపై పర్యాటకులకూ స్వాగతం పలుకనుంది. అమెరికాకు చెందిన ప్రైవేటు కంపెనీ ‘వర్జిన్ గెలాక్టిక్’ ఆదివారం నిర్వహించిన రోదసియాత్ర ఈ దిశగా ఒక మైలురాయి. స్వయంగా ఆ సంస్థ అధిపతి రిచర్డ్ బ్రాన్సన్తోపాటు ఆరుగురు ‘వీఎస్ఎస్ యూనిటీ-22’ అనే వ్యోమనౌక ద్వారా వినువీధుల్లో విహరించి సురక్షితంగా భూమి మీదకు తిరిగివచ్చారు. అమెరికాలో స్థిరపడిన తెలుగు యువతి, బండ్ల శిరీష ఈ పర్యటనలో పాల్గొని, రోదసిలోకి వెళ్లిన నాలుగో భారతీయ వ్యక్తిగా నిలిచారు. 65 నిమిషాలపాటు సాగిన వీరి యాత్ర అంతరిక్ష పర్యాటకానికి ద్వారాలు తెరిచింది. ఆన్లైన్ దిగ్గజ సంస్థ అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ సైతం ఈ నెల 20న సొంత వ్యోమనౌకలో రోదసి యాత్ర చేపట్టటానికి సర్వం సిద్ధం చేసుకున్నారు. ఆయన నెలకొల్పిన కంపెనీ ‘బ్లూ ఆరిజిన్’ ఈ యాత్రను నిర్వహించనుంది.
అంతరిక్ష పర్యాటకం అందరిలోనూ ఆసక్తి రేపుతున్నప్పటికీ, రానున్న కొన్నేండ్లపాటు కోటీశ్వరులకు మాత్రమే అందుబాటులో ఉండనుంది. ప్రస్తుతం ఈ రంగంలో ఉన్న కంపెనీలు నిర్ణయించిన ధరలు సామాన్యులు భరించలేరు. ‘వర్జిన్ గెలాక్టిక్’ కంపెనీ విక్రయిస్తున్న అంతరిక్ష టికెట్ ఒక్కోటి 2.5 లక్షల డాలర్లు (దాదాపు రూ.1.86 కోట్లు). ఇప్పటికే 600 టికెట్లను ఈ కంపెనీ విక్రయించింది. వీటిని కొనుగోలు చేసిన వారిలో లియోనార్డో డికాప్రియో, లేడీ గాగా, టామ్హాంక్స్, బ్రాడ్ పిట్, ఏంజెలీనా జోలీ వంటి హాలీవుడ్ సెలబ్రిటీలున్నారు. వచ్చే ఏడాది నుంచి పర్యాటకులను రోదసిలోకి తీసుకెళ్లాలని ‘వర్జిన్ గెలాక్టిక్’ సన్నాహాలు చేస్తున్నది. ‘బ్లూ ఆరిజిన్’ కంపెనీ తమ టికెట్ ధర ఎంతో ప్రకటించనప్పటికీ, అది కూడా కోట్లలోనే ఉండటం ఖాయం. రానున్నరోజుల్లో మరిన్ని ప్రైవేటు కంపెనీలు ఈ రంగంలోకి అడుగుపెట్టవచ్చు. దీనివల్ల పోటీ పెరిగి ధరలు తగ్గి అంతరిక్ష యానం సాధారణ వ్యక్తులకూ అందుబాటులోకి రావచ్చు.
భూమి పైనుంచి 80-90 కిలోమీటర్ల ఎత్తు వరకూ వెళ్లి తిరిగి రావటాన్ని అంతరిక్షంలోకి వెళ్లిరావటంగా ప్రస్తుతం భావిస్తున్నారు. రోదసిలో ప్రయోగాలకు వేదికగా ఉన్న ‘అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం’ 409 కిలోమీటర్ల ఎత్తులో ఉంది. ఈ లెక్కన 80-90 కిలోమీటర్ల ఎత్తనేది రోదసి ముఖద్వారం లాంటిదనుకోవాలి. అయినప్పటికీ, అక్కడికి వెళ్లి రావటం, భారరహిత స్థితిని అనుభవించటం, అంతరిక్ష అందాలను చూడటం గొప్ప అనుభవం. మొత్తమ్మీద నాసా, ఇస్రో వంటి ప్రభుత్వ పరిశోధన సంస్థలే కార్యకలాపాలు నిర్వహించే అంతరిక్ష రంగంలోకి ప్రైవేటు కంపెనీలు అడుగిడటమే కాదు, పోటాపోటీగా దూసుకెళ్తున్నాయి. ప్రైవేటురంగం సర్వవ్యాప్తమవుతున్న స్థితిని ఇది సూచిస్తున్నది.