ఒకదేశంలో పని చేస్తూ ఆ దేశ నిబంధనలను పాటించే విషయంలో మీనమేషాలు లెక్కించటం ట్విట్టర్కే చెల్లింది. కొత్త ఐటీ రూల్స్ విషయంలో ట్విట్టర్ మొండిధోరణి ఇప్పటికీ మారలేదు. ఢిల్లీ హైకోర్టులో ఈ అంశంపై విచారణ గురువారం కొనసాగింది. కొత్త ఐటీ నిబంధనల ప్రకారం ‘చీఫ్ కంప్లయెన్స్ ఆఫీసర్’ (సీఓఓ)గా భారతీయవాసిని తాత్కాలిక పద్ధతిన సోమవారం లోగా నియమిస్తామని, 8 వారాల్లో పూర్తిస్థాయి నియామకం చేపడుతామని ట్విట్టర్ తన అఫిడవిట్లో తెలిపింది. అయితే ఇక్కడ ఒక మెలిక పెట్టింది. కొత్త ఐటీ నిబంధనలకు కట్టుబడి ఉండటానికి తాము శాయశక్తులా ప్రయత్నిస్తామని, అయినప్పటికీ ఆ నిబంధనల చట్టబద్ధతను, యోగ్యతను కోర్టులో సవాల్ చేసే హక్కు తమకున్నదని పేర్కొంది. దీనినిబట్టి ఈ వివాదాన్ని ఇప్పట్లో సామరస్యపూర్వకంగా పరిష్కరించుకునే యోచనలో ట్విట్టర్ లేనట్లు స్పష్టమవుతున్నది.
కేంద్రప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరి 25న సోషల్ మీడియా చానళ్లు, ఓటీటీ ప్లాట్ఫాంలకు వర్తించే విధంగా కొత్త ఐటీ రూల్స్ను వెలువరించింది. వీటిప్రకారం ఏదైనా వివాదాస్పద పోస్టు లేదా ట్వీట్ చేసిన వ్యక్తి వివరాలను ఇవ్వమని ఏదైనా సోషల్ మీడియా కంపెనీని ప్రభుత్వం అడిగితే ఇవ్వవలసిందే. సోషల్ మీడియా వేదికపై తలెత్తే వివాదాల పరిష్కారానికి ఆయా కంపెనీలు ఒక అధికారిని నియమించాలి. యూజర్ల ఫిర్యాదులు స్వీకరించటానికి 24 గంటలపాటు అందుబాటులో ఉండే వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. మే 26న ఈ నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ట్విట్టర్ తప్ప మిగిలిన సోషల్మీడియా సంస్థలు వాటిని పాటించటానికి అంగీకరించాయి. ట్విట్టర్ మాత్రం యూజర్ల వ్యక్తిగత గోప్యతకు ఈ నిబంధనల వల్ల భంగం వాటిల్లుతుందని అభ్యంతరం వ్యక్తం చేస్తూ వచ్చింది.
జూన్ 5న కేంద్రప్రభుత్వం ట్విట్టర్కు తుది హెచ్చరిక జారీ చేసింది. అయినప్పటికీ ఆ కంపెనీ తలొగ్గకపోవటంతో సోషల్ మీడియా సంస్థలకు ఇస్తున్న ‘మధ్యవర్తిత్వ హోదా’ను ట్విట్టర్కు రద్దు చేసింది. దీంతో ట్విట్టర్ వేదికపై ట్వీట్ చేసే అంశాలపై తలెత్తే వివాదాలకు ఆ ట్వీట్ చేసిన వ్యక్తితోపాటు ట్విట్టర్ కంపెనీ కూడా బాధ్యత వహించే పరిస్థితి తలెత్తింది. ఈ మేరకు భారత్లోని ట్విట్టర్ ఉన్నతాధికారులపై ఇటీవలి కాలంలో పలు రాష్ర్టాల్లో ముఖ్యంగా బీజేపీ పాలిత రాష్ర్టాల్లో క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. జూన్ 25న ట్విట్టర్ అమెరికా చట్టాన్ని ఉటంకిస్తూ అప్పటి ఐటీశాఖమంత్రి రవిశంకర్ప్రసాద్ ట్విట్టర్ ఖాతాను గంటపాటు నిలిపివేయడం ఆశ్చర్యకరం. ట్విట్టర్ మన దేశంలో వ్యవహారాలు నడుపుకోవాలంటే ఇక్కడి చట్టాలను గౌరవించవలసిందే. ట్విట్టర్ మాత్రమే కాదు, ఏ విదేశీ కంపెనీ కైనా ఇదే సూత్రం వర్తిస్తుంది.