‘ఆగస్టు 15 నేడేనోయ్ అందరికీ స్వరాజ్యం ఇదిగోనోయ్..’ అని చిన్నప్పుడు మూడు రంగుల జెండా చేతపట్టి ఊరంతా తిరిగిన జులూస్ గుర్తుకు వస్తున్నది. సరిగ్గా అలాంటి స్వాతంత్రం తెలంగాణకు 2014 జూన్ 2న వచ్చింది. నిజంగా పిల్లలంతా పెద్దలంతా ఊర్లకు ఊర్లు మొత్తం తెలంగాణ సంబురాల్లో మునిగి భవిష్యత్ నిర్మాణం దీక్ష తీసుకోవలసినరోజు. కానీ గత రెండేండ్లుగా కరోనా వైరస్ మానవాళిని అతలాకుతలం చేస్తున్నది. తెలంగాణ రాష్ర్టం అవతరించి ఏడేండ్లు గడిచిపోయిన జూన్ 2 ను చూస్తే చేసిన పోరాటాలు, త్యాగాలకు ప్రతిఫలం దక్కిందన్న సంతృప్తి కలుగుతున్నది.
గడచిన ఏడేండ్లలో సాధించిన అభివృద్ధిని జూన్ 2న విజయోత్సవంగా జరుపుకోవాలి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ జూన్ 2 ను ప్రజలకు జీవన భద్రత కల్పించే రోజుగా మార్చుకుంటూ తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతున్నది. ఏడేండ్ల ప్రగతిని, భవిష్యత్ దర్శనాన్ని మననం చేసుకోవాల్సిన సమయం ఇది.
ప్రజలకు ఈ సందర్భంలో ధైర్యమనే వ్యాక్సిన్ ఇవ్వాలి. ప్రపంచమే ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్న సందిగ్ధ కాలమిది. ప్రాణాలను హరించే ఈ సమయం నుంచి తెలంగాణ సమాజాన్ని బయట పడేసి నిలపాలి. ప్రజలకు భరోసా ధైర్యం కలిగిస్తూ ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలకు కృషి చేయాలి. బస్తీ దవాఖానాల్లో నుంచి పల్లె దవాఖానాల వరకు ఇంటింటికి వైద్యాన్ని అందించి మొత్తం తెలంగాణ సమాజాన్ని ప్రాణ నష్టం నుంచి బయటకు తీసుకురావటం కోసం ఒక యుద్ధంలాగే పనిచేస్తూ తెలంగాణ ప్రభుత్వం స్ఫూర్తి కలిగిస్తున్నది.
రాష్ర్ట పాలనా పగ్గాలు చేపట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ గడిచిన ఏడేండ్ల కాలంలో దేశమే ఆశ్చర్యపోయేలా కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గర్నుంచి మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రైతుబంధు నుంచి రైతు రుణ విముక్తి వరకు, బస్తీ దావఖానాల దగ్గర్నుంచి పల్లె ప్రగతి వరకు ఎన్నెన్నో విజయాలను సాధించింది. ఏడేండ్ల నిర్మిత తెలంగాణ పునర్నిర్మాణధారిగా కేసీఆర్ చేసిన కృషి దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నది. తెలంగాణ నమూనాలో ముందుకు సాగటానికి చాలా రాష్ట్రాలు ముందుకు వస్తున్నాయి. తెలంగాణ విజయాలకు కితాబునిస్తూ అనేక అంశాలను ఆచరిస్తూ కేంద్రం కూడా అనేక అడుగులు వేస్తున్నది. గడచిన ఏడేండ్లలో సాధించిన అభివృద్ధిని జూన్ 2న విజయోత్సవంగా జరుపుకోవాలి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ జూన్ 2 ను ప్రజలకు జీవన భద్రత కల్పించే రోజుగా మార్చుకుంటూ తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతున్నది. ఏడేండ్ల ప్రగతిని, భవిష్యత్ దర్శనాన్ని మననం చేసుకోవాల్సిన సమయం ఇది. ఈ విపత్కర సందర్భంలో కోట్లాదిమంది ప్రజల్లో ప్రతి ఒక్కరికి కేసీఆర్ ధైర్యం అనే వ్యాక్సిన్ను అందిస్తున్నారు. ఇంటింటికి నేరుగా వైద్యాన్ని అందించే వైద్యునిగా కేసీఆర్ నిలిచారు. ఇదే సమయంలో వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు తెస్తూ ఆరోగ్య తెలంగాణను నిర్మిస్తున్నారు. బస్తీ దవాఖాన నుంచి పల్లె ఆస్పత్రుల దాకా దేశంలో ఎక్కడా లేని విధంగా గ్రామస్థాయి గడపల దాకా వైద్య రంగాన్ని తీసుకుపోతున్నారు. హాట్సాఫ్ కేసీఆర్.
నాటి ఉద్యమ కాలంలో, గడచిన ఏడేండ్ల పునర్నిర్మాణ కాలంలో, ఇప్పుడు కరోనా పై యుద్ధం చేస్తూ ప్రజలను రక్షించే విషయంలో కేసీఆర్ తీసుకునే నిర్ణయాలు, చేపట్టిన పథకాలు, చేసే ఆలోచనలు చారిత్రాత్మకం. కేసీఆర్ ఏది చేసినా, ఏ దారిని నిర్మించుకుంటూ పోయినా అదొక కొత్త చరిత్రకు తలుపులు తెరిచి తెలంగాణ భవిష్యత్ నిర్మాణమవుతుంది. ఈ సమయంలో ప్రజల ప్రాణాలను కాపాడటం, అభివృద్ధి కుంటుపడకుండా చూస్తూ కేసీఆర్ తనదైన విజన్తో ముందుకు పోతున్నారు.
కరోనా ఆపత్కాలంలో కేసీఆర్ తెలంగాణ ఈసీజీ. కేసీఆర్ ఆరోగ్య తెలంగాణ రూపకర్త. కేసీఆర్ ప్రజల జీవన భద్రతకు కేరాఫ్ అడ్రస్. ఈ ఏడేండ్లలో తెలంగాణలో ఏమైందంటే ఫ్లోరోసిస్తో వంకర్లు తిరిగిన నా నల్లగొండ ధాన్యపు కుండైంది. తెలంగాణ దేశానికి ధాన్యాగారం అయింది. పల్లె ప్రగతితో గ్రామీణ తెలంగాణ, సామాజిక,ఆర్థిక జీవన ముఖచిత్రం మారింది. విద్యుత్ వెలుగులు లేని గ్రామం లేదనే దశకు తెలంగాణ ఎదిగింది.
పల్లెకు పట్టణాలకు మధ్యనున్న సౌకర్యాల సౌలభ్యాల తేడాల గీతలను చెరిపేస్తూ, ప్రతి పంచాయతీకి ఐటీ ద్వారా ఆడిట్ చేస్తున్నాయి. కరువులను, వలసలను తరిమేసి ప్రతి పల్లె పచ్చగా విలసిల్లుతున్నది. తెలంగాణలో వ్యవసాయ హరిత, నీటి, నీలివిప్లవాలు జరుగుతున్నాయి. సబ్బండ వర్ణాల వర్గాలు, సకల జనుల సౌఖ్యం అన్న స్ఫూర్తితో ఈ జూన్ 2 ను మన మనసుల్లోనే, ఇండ్లలోనే ఘనంగా జరుపుకొందాం.
పాడి పంటలు స్వయంసమృద్ధి, ఆత్మగౌరవ తెలంగాణ నిర్మాణం చేస్తూ ముందుకు సాగుతున్న కేసీఆర్కు మనందరి తోడ్పాటు అందిద్దాం. మనందరం కలసికట్టుగా ఉండి అభివృద్ధి, ఆరోగ్య తెలంగాణను నిర్మించుకునే దీక్షలో పాలు పంచుకుందాం.
(వ్యాసకర్త: తెలంగాణ రాష్ర్ట తొలి బీసీ కమిషన్ మాజీ సభ్యులు)
జూలూరు గౌరీశంకర్