‘మోదీ సర్కార్ విధానాలను ప్రశ్నించినంత మాత్రాన విద్యార్థులు, సామాజిక కార్యకర్తలపై ఏకంగా దేశద్రోహం కేసులను నమోదు చేస్తున్నారు. కానీ, విద్వేషపూరిత ప్రసంగాలు చేస్తున్నవారి మీద మాత్రం కేసులు పెట్టటానికి అధికారులు ముందుకురావటం లేదు. ఈ ప్రసంగాలకు పాలకపక్ష పెద్దలే మద్దతిస్తున్న పరిస్థితి దేశంలో నెలకొని ఉండటం ఏమిటి?’ అని ప్రఖ్యాత న్యాయకోవిదుడు, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రోహిన్టన్ నారీమన్ ప్రశ్నిస్తున్నారు. ‘రాజ్యాంగ విలువల ఆధారంగా చట్టబద్ధ పాలన’ అనే అంశంపై ఇటీవల నారీమన్ ఉపన్యసించారు. వివరాలు ఆయన మాటల్లోనే…
‘విద్వేషపూరిత ప్రసంగం అనేది రాజ్యాంగ వ్యతిరేకమైన పని మాత్రమే కాదు.. ఐపీసీ 153 ఏ, 505 (సీ) ప్రకారం నేరం కూడా. ఈ నేరానికి పాల్పడిన వ్యక్తికి మూడేండ్ల వరకూ జైలుశిక్ష విధించవచ్చు. కానీ, ఇది అమలుకావటం లేదు. ఎందుకంటే, ఈ విషయంలో కచ్చితంగా విధించే కనీస శిక్ష ఎంతనేది చట్టంలో లేదు. కాబట్టి, దేశంలో చట్టబద్ధ పాలనను బలోపేతం చేయాలనుకుంటే.. ఈ చట్టాలను మార్చాలి. విద్వేషపూరిత ప్రసంగాలు చేసేవారికి కచ్చితంగా నిర్ణీత కాలవ్యవధి వరకు జైలుశిక్ష విధించేలా చట్టాలను సవరించాలి. అప్పు డే ఈ రకమైన వ్యాఖ్యలు, ప్రసంగాలు చేసేవారు తమనుతాము నియంత్రించుకునే పరిస్థితి వస్తుంది.
విచిత్రమేమంటే.. దేశాన్ని పాలిస్తున్న పార్టీకి చెందిన పెద్దలు ఈ తరహా ప్రసంగాలు, వ్యాఖ్యలపై నిశ్శబ్దంగా ఉండటమే కాదు.. దాదాపుగా తమ మద్దతును తెలియజేస్తున్నారు. ఓ వైపు మన దేశంలో.. ప్రభుత్వాన్ని విమర్శించినంత మాత్రాన విద్యార్థులు, స్టాండప్ కమెడియన్లు, యువతీ యువకులపై దేశద్రోహం కేసులు పెడుతున్నారు. మరోవైపు, నరమేధం సృష్టించాలంటూ విద్వేషపూరిత వ్యాఖ్యలు, ప్రసంగాలు చేస్తున్న వారిమీద కేసులు నమో దు చేయటానికి మాత్రం అధికారులకు చేతులు రావటం లేదు. దేశంలో వాక్స్వాతంత్య్రం వర్థిల్లాలంటే దేశద్రోహం చట్టాన్ని పూర్తిగా రద్దుచేయాల్సిన అవసరం ఉన్నది.
అధికార పార్టీ నేతే ఇటీవల మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు, మరాఠా చక్రవర్తి శివాజీ పేర్లను ప్రస్తావిస్తూ, వారి మధ్య వైరం గురించి మాట్లాడారు. సహోదరత్వం అనేది దేశ రాజ్యాంగంలో ఉన్న ఒక సమున్నత విలువ. మీకు నిజంగానే దేశంలో ప్రజల మధ్య సహోదరభావాన్ని పెంపొందించాలనుకుంటే.. మత విద్వేషకుడిగా పేరుగాంచిన ఔరంగజేబు గురించి కాదు, మొఘల్ రాజ్య వ్యవస్థాపకుడు బాబర్ గురించి గానీ, లేదా ఆయన మనుమడు అక్బర్ చక్రవర్తి గురించి గానీ మాట్లాడాలి. నిజానికి అక్బర్ గురించి చెప్పాలంటే.. ఏ దేశంలోగానీ, ఏ కాలంలోగానీ ఆయనలాగా అన్ని మతాలను సమానరీతిలో ఆదరించిన సెక్యులర్ పాలకులు చాలా చాలా అరుదు. అక్బర్ తాత బాబర్ కూడా ఇటువంటి విలువలు కలిగిన పాలకుడు. తన మరణానికి ముందు తన కొడుకు (అక్బర్ తండ్రి) హుమాయూన్కు బాబర్ రాసిన లేఖను ఒకసారి చదివి చూడండి. భారతదేశంలో ఉన్న వైవిధ్యం గురించి హుమాయూన్కు ఆ లేఖ బోధిస్తుంది. ఎన్నో మతాలు, కులాలతో కూడిన ఈ దేశాన్ని పాలించాలంటే.. ఆ గొప్ప వైవిధ్యాన్ని గౌరవిస్తూ ముందుకుసాగాలని కొడుక్కి హితబోధ చేశారు.
కేరళలోని శబరిమల ఆలయంలోకి మహిళలకు కూడా అనుమతి కల్పించాలంటూ ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పునిచ్చినప్పటికీ.. అది అమలుకాలేదు. తీర్పును అధికారులు అమలుచేయలేదు. ఈ తీర్పును సమీక్షించాలంటూ 9 మంది సభ్యుల ధర్మాసనానికి సుప్రీంకోర్టు సిఫారసు చేయటం, ఈ అంశంపై నేటికీ అస్పష్టత నెలకొనటం అత్యంత దురదృష్టకరమైన విషయం. స్వేచ్ఛ అమలవుతుందా లేదా అన్నదాని మీద మాత్రమే కాదు.. కోర్టుల ద్వారా ప్రకటితమయ్యే స్వేచ్ఛ అమలవుతుందా? లేదా? అన్నదానిపైనా నిరంతరం జాగరూకత అవసరం. ఎందుకంటే, చట్టబద్ధమైన పాలన అంటే అదే’.
(ముంబైలో ఈ నెల 14న ‘డీఎం హరీశ్ స్కూల్ ఆఫ్ లా’ ప్రారంభోత్సవం సందర్భంగా చేసిన కీలక ఉపన్యాసంలోని ముఖ్యాంశాలు..)
జస్టిస్ రోహిన్టన్ నారీమన్