ఇటీవల సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్.వి.రమణ హైదరాబాద్లో ‘ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్, మీడియేషన్ సెంటర్’ను ప్రారంభించారు. అంతర్జాతీయ ఆర్థిక వివాదాల పరిష్కారానికి ఆర్బిట్రేషన్ సెంటర్ కృషిచేస్తుంది. ఈ ఆర్బిట్రేషన్ కేంద్రం వివాదాల పరిష్కారానికి మధ్యవర్తిత్వం నెరపుతూ, కోర్టు వెలుపల వివాదాలను పరిష్కరిస్తుంది. అంతేగాక అంతర్జాతీయ ఆర్థిక వివాదాలను కోర్టుల వెలుపల పరిష్కరించుకునే విధానాన్ని ప్రచారం చేస్తూ ఆమోదనీయత తెస్తుంది. దీనిద్వారా సత్వర న్యాయం పొందే మార్గాన్ని చూపినట్లవుతుంది. ఇంతవరకు బాగానే ఉన్నది, కానీ.. సివిల్, క్రిమినల్ కేసుల విషయంలో సత్వర న్యాయం..?
భారత అత్యున్నత న్యాయస్థానం (సుప్రీంకోర్టు)లో 70 వేల కేసులు ఏండ్ల తరబడిగా పెండింగ్లో ఉన్నాయి. అవి ఎలాంటి స్వీకరణకు, విచారణకు నోచుకోవటం లేదు. ఫుల్ బెంచ్ న్యాయమూర్తులున్నా.. దశాబ్దాలుగా విచారణకు రావటం లేదు. దీనికి కారణం దేశంలో ప్రజలు, న్యాయమూర్తుల నిష్పత్తిలో తీవ్ర అంతరం ఉన్నది. పది లక్షల జనాభాకు 20 మంది న్యాయమూర్తులే ఉన్నారు. మన ‘లా కమిషన్’ సిఫార్సుల ప్రకారం.. పది లక్షల మందికి 50 మంది న్యాయమూర్తులు ఉండాలి.
లా కమిషన్ సిఫార్సుల ప్రకారం.. రాజ్యాంగబద్ధంగా సుప్రీంకోర్టు విభజన జరగాలి. 1984లో 10వ లా కమిషన్- 95వ రిపోర్టు ప్రకారం.. సుప్రీంకోర్టు రెండుగా విభజన జరగాలి. కాన్స్టిట్యూషనల్ కోర్టు ఢిల్లీలో, రాజ్యాంగ అప్పీళ్ల కోర్టులు ఉత్తర, దక్షిణ, తూర్పు, పశ్చిమ భారత ప్రాంతాల్లో ఏర్పాటుచేయాలి. దీంతో రాజ్యాంగ విషయక అప్పీలు కేసుల తాకిడి నుంచి బయటపడవచ్చు. ఈ క్రమంలోనే 10వ లా కమిషన్ 95వ రిపోర్టులో చెప్పిన విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని 11వ లా కమిషన్ వక్కాణించింది. దీనిప్రకారం.. కక్షిదారులు న్యాయం కోసం సుదూర ప్రాంతా ల నుంచి ప్రయాణం చేయాల్సిన అగత్యాన్ని నివారించాలని సూచించింది. అలాగే.. 2009లో 18వ లా కమిషన్- 229 రిపోర్టు ప్రకారం కూడా రాజ్యంగపరమైన విషయాల విచారణకు ప్రత్యేక బెంచ్ అవసరమని తెలిపింది. ఆ క్రమంలోనే.. ఢిల్లీతో పాటు దేశంలోని నాలుగు ప్రాంతాల్లో నాలుగు ప్రాంతీయ సుప్రీంకోర్టు బెంచ్లను ఏర్పాటుచేయాలని తెలిపింది. అందులో భాగంగా.. ఢిల్లీలో సుప్రీంకోర్టు ఉత్తరాది బెంచ్, దక్షిణాది బెంచ్ హైదరాబాద్లోగానీ, మద్రాసులో గానీ ఏర్పాటుచేయాలని సూచించింది. అలాగే.. తూర్పుభాగపు బెంచ్ కలకత్తాలో, పశ్చిమ భారతదేశపు బెంచ్ ముంబైలో ఏర్పాటుచేయాలని చెప్తూ.. ప్రతి కోర్టులో నలుగురు నుంచి ఆరుగురు న్యాయమూర్తులు ఉండాలని తెలిపింది.
‘సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్’ రిపోర్టు ప్రకారం.. దేశంలోని వివిధ హైకోర్టుల నుంచి అప్పీళ్లు సుప్రీం కోర్టుదాకా వెళ్లటం లేదు. సుప్రీంకోర్టులో నమోదవుతున్న కేసుల్లో 19 శాతం పంజాబ్, హర్యానా నుంచే ఉంటున్నాయి. ఢిల్లీ నుంచి 11 శాతం, మిగతా రాష్ర్టాల హై కోర్టుల నుంచి నామ మాత్రంగానే ఉంటున్నాయి. కొన్ని రాష్ర్టాల నుంచి తక్కువ కేసులు నమోదవుతున్నాయంటే.. ఆ రాష్ర్టాలకు తగు సమన్యాయం అందుతున్నదని భావించలేం. దూరభారం, అందుబాటులో లేకపోవడమనే కారణంతో దక్షిణ భారతదేశం నుంచి సుప్రీంలో ఒక్క శాతమే కేసులుంటున్నాయి. అదే సుప్రీంకోర్టుకు సమీప రాష్ర్టాలైన ఢిల్లీ నుంచి 9.3 శాతం, పంజాబ్ నుంచి, ఉత్తరాఖండ్ నుంచి 5 శాతం చొప్పున, హిమాచల్ప్రదేశ్ నుంచి 3 శాతం కేసులుంటున్నాయి. సుప్రీంకోర్టు దాకా కక్షిదారులు వెళ్లకపోవటానికి మరో కారణం.. దూరభారం. కేవలం సుదూర ప్రాంతంలో ఉండటం కారణంగానే న్యాయం కోసం వెళ్లలేని స్థితి ఉంటే.. అది అతని రాజ్యంగబద్ధమైన ప్రాథమిక హక్కుల నిరాకరణే అవుతుంది. కాబట్టి ఈ సమస్యలను అధిగమించాలంటే.. ప్రాంతీయంగా సుప్రీం బెంచ్లను ఏర్పాటుచేయాల్సిన అవసరం ఉన్నది.
ప్రాంతీయ బెంచ్ల ఏర్పాటు సమస్య 2010 ఫిబ్రవరిలోనే ఫుల్ బెంచ్ ముందుకు పోయింది. కానీ ఢిల్లీకి బయట సుప్రీంకోర్టు బెంచ్ల ఏర్పాటుకు విధాన నిర్ణయం తీసుకోవటంలో జరుగుతున్న జాప్యంతో న్యాయం దక్కటం లేదు. ఆ తర్వాతికాలంలో ప్రాంతీయ బెంచ్ల ఏర్పాటుగురించి అనేక విన్నపాలు వచ్చినా అవేవీ కొలిక్కి రాలేదు. దశాబ్దాలు గడుస్తున్నా ప్రాంతీయ బెంచ్ల ఏర్పాటు విషయం తార్కికమైన ఏ నిర్ణయం లేకుండా పెండింగ్లో ఉంటున్నది. దీనిపై నేను స్వయంగా లోక్సభ స్పీకర్ దృష్టికి ప్రైవేట్ మెంబర్ బిల్గా తీసుకెళ్లాను. దీనిపై ఒక సానుకూలమైన నిర్ణయం తీసుకొని సుప్రీంకోర్టుకు తగు చర్యలకు సిఫార్సు చేస్తుందని ఆశిస్తున్నాను.
వివిధ న్యాయ కమిషన్లు, రాజ్యాంగ ప్రకరణల ప్రకా రం.. దేశంలో ప్రాంతీయ సుప్రీం బెంచ్ల ఏర్పాటుచేయా లి. హైదరాబాద్ దేశంలోనే అతివేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం. అన్నిరకాల మౌలిక వసతులు, వనరులు, రైలు, విమానయాన సౌకర్యం ఉన్న ప్రాంతం హైదరాబా ద్. దక్షిణ భారతంలోని అన్ని ప్రాంతాలకు అనువైన ప్రాం తం. సాఫ్ట్వేర్ హబ్గా హైదరాబాద్ దేశంలోనే అగ్రస్థానం లో ఉన్నది. ఈ పరిస్థితుల్లో హైదరాబాద్ ప్రాంతీయ సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటుకు అన్నివిధాలా అనువైన, అర్హమైన నగరం. కాబట్టి హైదరాబాద్లో దక్షిణభారత సుప్రీం బెంచ్ ఏర్పాటుచేయాలి. అంతేకాకుండా హైదరాబాద్లో సుప్రీం బెంచ్ ఏర్పాటుచేస్తే అన్నివిధాలా సహకరిస్తామనీ, కావాల్సిన వనరులను కల్పిస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ కేంద్రానికి తెలపటం గమనార్హం.
ఇప్పటికైనా ప్రాంతీయ సుప్రీం కోర్టు బెంచ్ల ఏర్పాటుకు కేంద్రం తగువిధంగా కృషిచేయాలి. దేశంలో ప్రాంతీయ సుప్రీం బెంచ్లు ఏర్పాటుచేసే సమయం ఆసన్నమైంది. సత్వరన్యాయం అందకపోతే.., న్యాయం దక్కనట్లుగానే మన న్యాయవ్యవస్థ, ధర్మం చెప్తున్నది. అందరికీ, అన్ని ప్రాంతాలకు సమన్యాయం అందే దిశగా అడుగులు పడాలి. అదే మన రాజ్యాం గం, న్యాయవ్యవస్థ స్ఫూర్తి.
(వ్యాసకర్త: పార్లమెంట్ సభ్యుడు, చేవెళ్ల)
డాక్టర్ రంజిత్రెడ్డి