మోదీ ప్రభుత్వం దేశ వ్యవసాయ రంగాన్ని కోలుకోలేని సంక్షోభంలోకి నెట్టివేస్తున్నది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు, విధానాలు చూస్తుంటే రైతులకు అవి ఆదాయం పెంపునకు బదులుగా, రెండింతలు నష్టాలు చేసేవిగా ఉంటున్నాయి. కేంద్రం చర్యలన్నీ రైతు వ్యతిరేక విధానాలే!
ఆహార భద్రతకు పంటల దిగుబడి, ముమ్మర పంటల సాగే శరణ్యం. భూముల్లో సారం నింపడానికి ఏకైక మార్గంగా రసాయన ఎరువులు వాడుతున్నాం. కాంప్లెక్స్ ఎరువుల ధరలు పెంచుతున్నట్లు ఎరువుల కంపెనీలు ప్రకటించాయి. పెంచిన ధరల ప్రకారం 50కిలోల కాంప్లెక్స్ ఎరువుల బస్తాకు రూ.75 నుంచి రూ.660 వరకు పెరిగాయి. ప్రస్తుతం రాష్ర్టానికి కాంప్లెక్స్ ఎరువులు 8.10 లక్షల టన్ను లు, పొటాష్ ఎరువులు లక్షా 60 వేల టన్నులు అవసరం. దీని ప్రకారం ఒక్క పొటాష్ ఎరువులపైనే తెలంగాణ రైతులు అదనంగా రూ.10.56 కోట్లు భరించాల్సి వస్తుంది. కేంద్ర నిర్ణయంతో 30- 40% ఎరువులకు ఎక్కువ ఖర్చవుతుంది.
నేషనల్ శాంపుల్ సర్వే ఆఫీస్ ‘ఎన్ఎస్ఎస్ఓ’ అధ్యయ నం ప్రకారం- వ్యవసాయంతో ఉపాధి పొందుతున్న గ్రామీణుల్లో 20 శాతం మంది దారిద్య్ర రేఖకు దిగువకు నెట్టబడ్డారు. వ్యవసాయేతర రంగాలతో పోలిస్తే రైతుల ఆదాయం తక్కువ. ఇతర రంగాలతో పోల్చిచూస్తే 80వ దశకంలో రైతు ఆదాయం 34 శాతం తక్కువగా ఉంటే, 90వ దశకం నాటికి అది నాలుగింతలకు పడిపోయింది. ఈ స్థితి కొనసాగి ఆత్మహత్యలకు దారి తీస్తున్నది. ఈ దుస్థితి పోవాలంటే రైతుల ఆదాయం గణనీయంగా పెరుగాలి.
ఎన్ఎస్ఎస్ఓ 70వ రౌండ్ సర్వే ప్రకారం రైతు కుటుంబానికి సాలీనా వ్యవసాయ, వ్యవసాయేతర ఆదాయం కలిపి రూ.77,112లు. అందులో 60 శాతం సాగు, పశుపోషణ ద్వారా అందితే, 40 శాతం వ్యవసాయేతర మార్గాలైన కూలీ, సాగేతర పనుల వల్ల ఆర్జించినది. 2022 నాటికి రైతు ఆదాయం రెట్టింపు కావాలంటే సాలీనా వ్యవసాయ వృద్ధి రేటు 14.86 శాతం ఉండాలి! చరిత్రలో ఇంత భారీ వృద్ధి రేటు ఎప్పుడూ నమోదు కాలేదు. ప్రస్తుతం వృద్ధి రేటు నాలుగు శాతానికి మించటం లేదు.
రైతు ఆదాయం పెంచడానికి రెండు మార్గాలున్నాయి. ఒకటి- వ్యవసాయ ఆదాయం, రెండోది- వ్యవసాయేతర ఆదాయం పెంచటం. ఉత్పాదకత పెంచటం ద్వారా వ్యవసాయంలో ఆదాయం పెరుగుతుంది. అందుకు ఆధునిక పరిజ్ఞానం, అధిక దిగుబడినిచ్చే వంగడాల అందుబాటు పెరగాలి. ఉత్పత్తి కారకాలైన విత్తనాలు, ఎరువులు, సాగునీరు, వ్యవసాయ రసాయనాల నాణ్యత, అందుబాటు, వినియోగసామర్థ్యం పెరగాలి. సాగు నీటి పారుదల కింద స్థూల సాగు విస్తీర్ణం 53 శాతానికి చేరాలి. దేశంలోని సాగులో ప్రస్తుతం పండ్లు, కూరగాయలు 1.675 కోట్ల హెక్టార్లలో సాగవుతున్నాయి. పంటల్లో వీటిది 8.6 శాతం వాటా మాత్ర మే. ఇది సాగు విస్తీర్ణంలో (12.7 శాతం) 2.638 కోట్ల హెక్టార్లకు పెరగాలి. హరిత విప్లవం తర్వాత 50 ఏండ్లు దాటినా వరి, గోధుమలో అధిక దిగుబడినిచ్చే రకాల వాడ కం 69 శాతం మించలేదు. 100 శాతం నూతన రకాలు సాగులోకి తెస్తే దిగుబడులు పెరుగుతాయి. ఉత్పత్తి కారకాలు కొనడానికి, పెట్టుబడికి సంస్థాగత పరపతి అవసరం. అలాగే పశుగణాల ఉత్పాదకత దేశంలో తక్కువ. గేదె లు సరాసరిన 4.90 కిలోలు, ఆవులు 3.1 కిలోల పాలిస్తున్నాయి. దీన్ని 37 శాతానికి పెంచితేనే పాడితో లాభాలుంటాయి.
శాస్త్ర, సాంకేతికతను రైతుకు అందుబాటులోకి తేవాలి. ప్రస్తుతం వాడుతున్న పద్ధతులు, రకాలు, పరిజ్ఞానంలో సాలీనా 3 శాతం పెరుగుదల ఉండాలి. ఇప్పటికే సత్ఫలితాలిస్తున్న ప్రెసిషన్ ఫామింగ్, ఆధునిక యంత్రాల వాడకం పెరగాలి. అలాగే గిడ్డంగులు, మెరుగైన రవాణా, నిల్వ సౌకర్యాల వంటి వసతులు, నాణ్యతలపై దృష్టి సారించాలి. చిన్న కమతాలతో రైతులు నష్టపోతున్నారు. సంఘటితశక్తిగా, గ్రూప్ మార్కెటింగ్, విలువల జోడింపు వంటి వాటితో అదనపు లాభాలు సముపార్జించాలంటే ‘సహకార సాగు’కు మరలాలి.
రైతుల ఆదాయం పెంచటంలో ప్రధాన అవరోధం- వ్యవసాయ వృద్ధితో ముడిపడి ఉన్న లాభాలు రైతుకు అందకపోవడం. వినియోగదారులకు సరసమైన ధరలకు అందుతూ నే, రైతులకు గిట్టుబాటు ధర వచ్చేలా వ్యవసాయ విపణి సామర్థ్యం పెంచటం అవసరం. పెట్టిన పెట్టుబడులు తిరిగి వచ్చేలా కనీస మద్దతు ధరలు అమలు చేయాలి.
ప్రొఫెసర్ స్వామినాథన్ ఫార్ములా ప్రకారం ఈ ధరలు నిర్ణయించాలి. సేకరణద్వారా నేరుగా ధరలు అమలు చేస్తూ, మద్దతు ధర కన్నా తక్కువకు రైతు అమ్ముకోవలసి వచ్చినప్పుడు నష్టాన్ని ప్రభుత్వమే భరించాలి. ప్రపంచవ్యాప్తంగా ‘ప్రాసెస్డ్’ ఆహార పదార్థాలు వినియోగంలోకి వచ్చాయి. భారత్ మాత్రం ఇంకా తొలి దశలోనే ఉన్నది. ప్రస్తుతం ఈ తరహా ఉత్పత్తులు సాలీనా 3.6 శాతం పెరుగుతున్నాయి. దీన్ని మరింత పెంచుకోవాలి.
ఈ క్రమంలోంచే వ్యవసాయేతర రంగం లో ఉన్న ఆదాయాలతో సమానంగా రైతుల వ్యవసాయ ఆదాయం పెరగాలి. సమ్మిళిత వృద్ధి జరగాలి. రైతుకు గౌరవం పెరిగి యువ త సైతం స్వచ్ఛందంగా సాగులోకి రావాలి. అప్పుడే దేశంలో రైతు ఆదాయ భద్రత, దేశ ఆహార భద్రత సుసాధ్యం.
(వ్యాసకర్త: అసోసియేట్ ప్రొఫెసర్, తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం)
డాక్టర్ పిడిగెం సైదయ్య
7780509322