హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ): సోషల్మీడియాలో వేధిస్తున్నారు.. బ్లాక్మెయిల్ చేస్తున్నారు.. సైబర్ మోసగాళ్లు రూ.10 వేలు కొట్టేశారు వంటి ఫిర్యాదులను ఇకపై నేరుగా స్థానిక పోలీస్స్టేషన్లలోనే చేసుకోవచ్చు. మొన్నటివరకు ఇలాంటి ఫిర్యాదులను సీసీఎస్ ఆధీనంలోని సైబర్ క్రైం ఠాణాల్లోనే స్వీకరించేవారు. అన్ని ఠాణాల్లో సైబర్ విభాగాలు పనిచేస్తుండటం, దీనిపై సిబ్బందికి శిక్షణ ఇవ్వడం, సైబర్ నేరాల దర్యాప్తుపై వారికి పట్టురావడంతో ఉన్నతాధికారులు ఈ నిర్ణయం తీసుకున్నా రు. సీసీఎస్ ఆధీనంలో ఉన్న సైబర్ఠాణాపై ఒత్తిడిని తగ్గించేందుకు సైబర్ నేరాలకు సంబంధించి రూ.లక్ష లోపు నష్టం వాటిల్లే ఫిర్యాదులపై అన్ని శాంతిభద్రతల పోలీస్స్టేషన్లలోనే కేసులు నమోదుచేయాలని ఈ ఏడాది ఏప్రిల్లో సీపీ ఆదేశాలు జారీచేశారు. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి రూ.లక్ష కంటే ఎక్కువగా నష్టపోయే బాధితులు మాత్రం సీసీఎస్ ఆధీనంలోని సైబర్ఠాణాలో ఫిర్యా దు చేయాలని పోలీసులు సూచించారు. ఠాణాకు వచ్చే ఫిర్యాదుల సంఖ్య తగ్గితే.. దర్యాప్తులో వేగం పుంజుకొంటుందని, నేరస్థులను త్వరగా అరెస్ట్ చేసేందుకు వీలవుతుందని చెప్తున్నారు.
ఇదివరకు సోషల్మీడియాకు సంబంధించిన వేధింపులు, బ్లాక్మెయిలింగ్ తదితర కేసులు సైబర్ఠాణాలో తీసుకునేవాళ్లం. సైబర్ కేసుల దర్యాప్తు కోసం శాంతిభద్రతల పోలీస్స్టేషన్లలో శిక్షణ పొందిన ప్రత్యేక సిబ్బంది ఉండటంతో ఇప్పుడు అన్ని ఠాణాలను సైబర్క్రైమ్ పోలీస్స్టేషన్లే అనుకోవచ్చు. ఉన్నతాధికారుల ఆదేశాలతో సోషల్మీడియా ఫిర్యాదులను లోకల్ పోలీస్స్టేషన్లకు పంపిస్తున్నాం. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలి.
–ఏవీఎం ప్రసాద్, ఏసీపీ, సైబర్క్రైమ్స్