‘దేశానికి స్వాతంత్య్రం 1947లో రాలేదనీ, అసలైన స్వాతంత్య్రం 2014లో వచ్చిందని’ అంటే… మన సమాజంలోని మెజారిటీ వర్గం మౌనంగా ఉండి చోద్యం చూస్తున్నది. ఇంతటి మహాభాగ్యం ప్రపంచంలో ఏ దేశానికి కూడా దక్కి ఉండదు. ట్రంప్ జాత్యహంకార వ్యాఖ్యలు చేసి, నల్లజాతీయులపై జరుగుతున్న అరాచకాలపై మౌనంగా ఉన్న కారణంగా నల్లజాతీయులతో పాటు అక్కడి స్థానిక అమెరికన్లు తెల్లజాతీయులు సైతం ఏకమై అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్కు గుణపాఠం చెప్పారు. ఇది అమెరికా చైతన్యానికి నిదర్శనం.
కానీ, కొందరు మన భారతీయులు ఈ ఛాందసవాదాన్ని ఎందుకు సమర్థిస్తున్నారో అర్థం కావడం లేదు. మనతో నివసిస్తూ ఈ దేశాన్ని తమ మాతృ ప్రదేశంగా భావిస్తున్న కొన్ని మైనారిటీ వర్గాలకు ‘ఛాందసవాదం’ ఎలాంటి చేటుచేస్తున్నదో ఏనాడైనా ఆలోచించామా? స్వాతంత్య్ర సమరాన్ని ముందుండి నడిపిన మహాత్ముడిని హత్యచేసిన గాడ్సేను పొగుడుతుంటే మనం మౌనంగా ఉండటం మన పొరపాటే కాదా? ముస్లిం వర్గాలను లక్ష్యంగా చేస్తూ గోలీమార్ అంటే మౌనంగా ఉంటున్నది మనం కాదా? అయోధ్య భూమి పూజను స్వాతంత్య్ర దినోత్సవంతో పోల్చినప్పుడు ఇదేమిటని ఎవరైనా అడిగారా? చదువుల నిలయాలైన విశ్వవిద్యాలయాలపై పడి తమతో సైద్ధాంతిక, భావసారూప్యత లేని విద్యార్థులను ఇనుపరాడ్లతో కొడుతుంటే మనం ఎదురుతిరిగామా? సొంతదేశంలో ఓ వర్గాన్ని చట్టబద్ధంగా శరణార్థులను చేస్తుంటే నోరు విప్పామా? గాంధేయమార్గంలో సమ్మె చేస్తున్న రైతన్నల తలల మీద రాజ్యం లాఠీలు గాయాలు చేస్తుంటే, వాహనాలతో తొక్కించి చంపుతుంటే మనమేం చేశాం? ఇదంతా జరగడానికి నూటికి నూరు శాతం మన నిద్రాణవ్యవస్థే కారణం.
ప్రజల సమస్యలు, కోరికలు వినడం, తర్కించడం, సమస్యను చర్చలతో పరిష్కరించడం ప్రజాస్వామ్య ప్రాథమిక సూత్రాలు. ప్రధాని ఏడేండ్లుగా ‘మన్ కీ బాత్’లో తాను మాట్లాడటమే కానీ ఇతరులు మాట్లాడింది వినడం ఏనాడూ లేదు. ఇకనైనా మోదీజీ ఇతరులు మాట్లాడేది… ముఖ్యంగా ప్రజలు, రైతులు, మేధావివర్గాలు మాట్లాడేది వినాలని ఆశిస్తున్నా…
మనలోని ‘మనకెందుకులే..’ అనే స్వభావమే కారణం. ఎక్కడైనా పాలించే వ్యవస్థను ప్రశ్నించే సమూహ శక్తి లేకుంటే ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రాథమిక ఉద్దేశం దెబ్బతింటుంది. ఆ ప్రశ్నించే వ్యవస్థలో ప్రతిపక్షం, పత్రికారంగం, మేధోవర్గం, రచయితలు.. ఇలా ఆయా వర్గాలవారు వారి పాత్రలను అర్థవంతమైన రీతిలో పోషించడంతోనే వ్యవస్థలు ప్రజాస్వామికంగా ఉంటాయి. అప్పుడే పాలక వ్యవస్థలు ప్రజలకు జవాబుదారీగా, కొత్త సమాజాలకు ఆదర్శంగా నిలుస్తాయి. ఏ సమాజంలో అయినా గొప్ప పనులు చేస్తే సన్మానాలు, సత్కారాలుంటాయి. కానీ ఆధునిక భారతంలో శంకరగిరి మాన్యాలే మంచికి బహుమతి. లక్షలాది మంది పిల్లలకు వైద్యం చేసి, ఎన్నో కుటుంబాల్లో వెలుగులు నింపిన డాక్టర్ కఫీల్ ఖాన్ జీవితాన్ని జైలుపాలు చేసి ఆయన కుటుంబాన్ని చిత్రవధ చేసిన పాలకవ్యవస్థ మనది కావడం తల దించుకోవాల్సిన విషయం. పిల్లల వైద్యానికి ఆక్సిజన్ సిలిండర్లు లేవని ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే ఆయన చేసిన నేరం! వేదికల మీద ప్రజాస్వామ్యం గురించి ఊకదంపుడు ఉపన్యాసాలిచ్చే ఈ ప్రభుత్వం కఫీల్ ఖాన్ రాజకీయ భావజాలాన్ని, రాజ్యాంగబద్ధమైన రాజకీయ హక్కులను ఎలా హరిస్తుంది? మైనింగ్ మూలంగా నిరాశ్రయులుగా మారనున్న అడవిబిడ్డల హక్కుల కోసం గొంతెత్తిన ప్రముఖ న్యాయవాది సుధా భరధ్వాజ్ను వామపక్ష తీవ్రవాద సంస్థతో సంబంధాలున్నాయనే నకిలీ పత్రాలతో జైలుకు పంపించిన బలహీనవ్యవస్థ మనది. ‘వ్యక్తులు వివిధ సైద్ధాంతిక అంశాలకు ప్రభావితమై ఉండటం నేరం కాదని, అది వారి వ్యక్తిగత స్వేచ్ఛ’ అని భారత సర్వోన్నత న్యాయస్థానం ఎన్నోసార్లు ఉటంకించింది.
దేశంలోకి కరోనా ప్రవేశించినప్పుడు ‘తబ్లిగీ’లను దేశద్రోహులుగా చిత్రించిన రాజ్యం, కుంభమేళా పేరుతో వేలాదిగా కూడి కరోనా రెండోసారి విజృంభించడానికి కారణమైన నాగసాధువులను ఈ రాజ్యం దేశద్రోహులుగా ఎందుకు అంగీకరించదు? ఒకే వ్యవస్థలో రెండు న్యాయాలా? అంతర్జాతీయ వేదిక మీద ప్రజాస్వామ్య లౌకిక విషయాలపై మాట్లాడే మన నాయకులకు మరెవరూ సాటిరారేమో! ప్రపంచంలో కొన్ని దేశాలు కరోనా రెండు డోసులు పూర్తిచేసి బూస్టర్ డోస్ కోసం సిద్ధమవుతుంటే, ఆత్మనిర్భర భారత్ ఆక్సిజన్ కోసం అల్లాడిపోతున్నది. వేలాది మంది ప్రాణాలు వదులుతున్న వేళ రాజకీయ క్రీడలో, మతం మత్తులో తూలుతున్నది.
దేశ వ్యవసాయరంగాన్ని దెబ్బతీసి, రైతు ఆత్మాభిమానాన్ని అంబానీ, ఆదానీలకు తాకట్టుపెట్టే వ్యవసాయ చట్టాలు తెచ్చారు. ‘మంచి ఉద్దేశంతో మేం వ్యవసాయ చట్టాలు తెస్తే రైతులు అర్థం చేసుకోలేద’ని ప్రధాని మోదీ ప్రకటించడం తన తప్పును ఒప్పుకోలేని అహంకార దృక్పథానికి నిలువెత్తు నిదర్శనం. ప్రజల సమస్యలు, కోరికలు వినడం, తర్కించడం, సమస్యను చర్చలతో పరిష్కరించడం ప్రజాస్వామ్య ప్రాథమిక సూత్రాలు. ప్రధాని ఏడేండ్లుగా ‘మన్ కీ బాత్’లో తాను మాట్లాడటమే కానీ ఇతరులు మాట్లాడింది వినడం ఏనాడూ లేదు. ఇకనైనా మోదీజీ ఇతరులు మాట్లాడేది… ముఖ్యంగా ప్రజలు, రైతులు, మేధావివర్గాలు మాట్లాడేది వినాలని ఆశిస్తున్నా. అప్పుడే ప్రజాస్వామ్య స్ఫూర్తి పరిఢవిల్లుతుంది.
(వ్యాసకర్త: అజీమ్ ప్రేమ్జీ వర్సిటీ, బెంగళూరు)
–పిల్లుట్ల నాగఫణి
80740 22846