కాంగ్రెస్ నాయకులకు బీహార్ ఫోబియా పట్టుకున్నది. తెలంగాణ ప్రభుత్వంలో బీహార్ బ్యాచ్దే హవా నడుస్తుందంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి విమర్శలు గుప్పించారు. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ను ఉద్దేశించి గతంలో కూడా బీహార్కు చెందిన పీకే లాంటి వాళ్లు వెయ్యి మంది వచ్చినా వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ విజయాన్ని అడ్డుకోలేరని ఈయన తన అక్కసు వెళ్లగక్కారు. ఒక్క రేవంత్ రెడ్డికే కాదు కాంగ్రెస్లో నేతలందరికీ బీహార్ భయం పట్టుకున్నట్టున్నది. పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్జిత్ సింగ్ కూడా ఎన్నికల ప్రచారంలో పంజాబ్లోకి బీహారీలను అడుగు పెట్టనీయవద్దంటూ పిలుపునిచ్చారు. అది రచ్చ రచ్చ కావడంతో ఆ తర్వాత లెంపలేసుకున్న విషయం తెలిసిందే.
‘అంత పలుకుబడి ఉంటే నేనేందుకు ఓడిపోతానయ్యా… అదే ఉంటే గెలిచేవాడిని కదా? ఈ లాజిక్ కూడా అర్థం చేసుకోకుండా ప్రతిదాన్ని నాకే అంటగట్టి నిందలేస్తున్నారు’ అని ఏపీ మాజీ సీఎం చంద్రబాబు వాపోయారు. తనపై విమర్శలకు బుసలు కొట్టే బాబుగారేంటీ? కోరలు తీసిన పాములా ఇలా మాట్లాడుతున్నారని పార్టీ నేతలు ఆశ్చర్యంతో ఒకరి ముఖాలు ఒకరు చూసుకోవడం వారి వంతయింది. పార్టీ సర్పంచ్లతో చంద్రబాబు మాట్లాడుతూ.. ‘అమరావతి ఉద్యమం వెనుక నాదే హస్తం ఉందంటున్నారు. ఎన్జీవోల సమ్మె వెనుకా ఉన్నానంటున్నారు… సీబీఐలోనూ నా మనషులే ఉన్నారని అంటారు. చివరికి వాళ్ల ఇళ్లలో మొగుడు, పెళ్లానికి పడకపోయినా నేనే కారణమంటున్నారు’ అని వాపోయారు. పార్టీ ప్రస్తుత పరిస్థితిని అర్థం చేసుకోకుండా ప్రతిదీ రాద్ధాంతం చేసే బాబుగారికి ఇన్నాళ్లకైనా జ్ఞానోదయం అయిందని ఆ పార్టీ నేతలు సంబురపడుతున్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ను, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించడానికే షర్మిల వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని పెట్టారా? అన్నట్టుగా ఉంది ఆమె వైఖరి. కేంద్ర బడ్జెట్లో తెలుగు రాష్ర్టాలకు అన్యాయం జరిగిందని, కనీసం విభజన హామీలనైనా నెరవేర్చడం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్తో సహా అన్ని పార్టీలు తప్పుబట్టగా, షర్మిల ఒక్కరే కేంద్రంపై కాకుండా ఇందుకు సీఎం కేసీఆరే కారణమన్నట్టు విమర్శించారు. తెలంగాణ ప్రజల కష్టాలు తీర్చడానికే పార్టీ పెట్టానని చెప్తున్నారు ఆమె. అన్నతో ఆస్తి తగాదనే పరిష్కరించుకోలేని షర్మిల.. ఇక తమ సమస్యలనెలా పరిష్కరించగలరని తెలంగాణవాదులు ఆమె ఎక్కడికి వెళ్లినా నిలదీస్తున్నారట!
– వెల్జాల