‘లేని రోగం నాకొచ్చే ఓ భామా.. నన్ను వట్టుకొని ఏ దేశం బోతవ్ నా భామో.. నిన్నెంత మంది ఎన్ని మాటలంటరో ఓ భామా.. ఎనుక కొంతమంది ఎక్కిరిత్తరు నా భామో.. ముందు కొంతమంది ముచ్చటవెడ్తరు ఓ భామా.. మనకో బిడ్డ వుడితే నా భామో.. మనకో కొడుకు వుడితే ఓ భామా.. వాళ్లెన్ని మాటలంటరో నా భామో.. నన్నిడిసి నువ్వు వోవే ఓ భామా..’ అని కుష్టు రోగమొచ్చి పాడుతున్న నరేంద్ర మారాజుకు…
‘ నాద ప్రాణనాద ఓ నాదా.. నీకు నీ వారు లేరు నా నాదా.. నాకు నా వారు లేరు ఓ నాదో.. కానిరోగం నీకొచ్చే నా నాదా.. ఈ కట్టకాలాన ఏడికివోదాం ఓ నాదో.. అన్నదమ్ముల బలం లేదు నా నాదా.. అక్కచెల్లెండ్ల బలం లేదు నా నాదో.. అవ్వలేని బిడ్డనయ్యా ఓ నాదా, అయ్య లేని బిడ్డనయ్యా నా నాదో.. చిన్ననాడే అవ్వను దాసుకున్న ఓ నాదా.. నాకు అవ్వ గుర్తు తెలువదయ్యో నా నాదో.. నేను అవ్వ ప్రేమ నోసుకోలె ఓ నాదా.. అవ్వ మీద సుఖవడ్లె నా నాదో.. అయ్య మీద సుఖవడ్లే ఓ నాదా.. నా తల్లి నన్ను గని, ఈ భూమ్మీదేసింది నా నాదో.. నా కట్టమేం సూసినావే నా అవ్వ.. నా సుఖమేమి సూసినావె నా అవ్వ… భర్తతోనే భాగ్యమనుకున్న.. మొగనితోనే మోక్షమనుకున్న.. పురుషునితోనే పుణ్యమనుకున్న.. నాకు బంగారు మేడలొద్దు నా నాదా.. కట్టలమ్ముకొని నిన్ను కాపాడుకుంటా నా నాదా..’ అని రత్నాంగి వలవలా ఏడ్సుకుంటా జవాబిస్తది నరేంద్ర మారాజుకు..
‘సారంగధరుడు’ ఒగ్గు కథల నాది ‘రత్నాంగి’ పాత్ర. రైక తొడిగి, చీర కట్టి, కాటిక వెట్టి, సవురం తొడిగి నుదుటి మజ్జన బొట్టువిల్ల వెడితే ఆడివిల్ల కన్న ఎక్కువ అందంగుంట. ఒక్క ‘సారంగధరుడు’ కథే గాదు.. ఎల్లమ్మ, బీరప్ప, మల్లన్న పట్నాలు, సావు కథలు.. ఇట్లా ఓ 60 కథల దాన్క చెప్తా.. మాది ‘శ్రీశైలం మల్లన్న ఒగ్గు కథా బృందం’. కన్నారం జిల్లా శంకరపట్నం మండలం మెట్పల్లికి చెందిన నా పేరు ఈరెల్లి సంపత్. మా అవ్వ పేరు గంగవ్వ, అయ్య పేరు ఐలయ్య. వారి నుంచే నాకు ఒగ్గు కథ అబ్బింది.
రెండేండ్ల కిందటనుకుంటా.. మా పక్కూళ్లే ఓ పెద్దమనిషి కాలంజేసింది. ఆమె ఆత్మ శాంతించాలని ఆమె మనుమరాండ్లు మాతో కథ చెప్పిచ్చిండ్లు. ఆమె దినాల నాడు రాత్రి తొమ్మిది గంటలకు ‘ఆత్మరాణి’ కథ మొదలువెట్టినం. ఆ కథల తల్లి అమ్రావతి, బిడ్డ ‘ఆత్మారాణి’ రెండు పాత్రలు నాయి. తెల్లారి నాలుగు గొట్టేదాన్క కథ నడిసింది. నవ్వేటోళ్లు నవ్విండ్లు. ఏడ్సేటోళ్లు ఏడ్సిండ్లు. ఆ రోజు తెల్లారి ఏడుగొట్టంగ ఇంటికివొయి నడుమాల్శిన. రాత్రి లేసి సూత్తె కాళ్లుబ్బినయి. లేత్తె కూసోవత్తలేదు, కూసుంటె లేవత్తలేదు. ‘ఓర్నీ.. ఇదెక్కడి గోసరా అయ్యా..’ అని కన్నారం దావఖాన్ల సూయించుకున్న. ఒగలు ఓ రోగమన్నరు. ఇంకొగలు ఇంకో రోగమన్నరు. రెండేండ్ల సంది తిరుగని దవాఖాన లేదు. ఇగ నా పెండ్లాం పేరు లలిత. దానిదో కథ. ఆమెకు నరాల వీక్నెస్. కూసుంటె లెవ్వది, లేత్తె కూసోదు. అయ్య ఐలయ్య ఇచ్చిన రెండెకరాలల్ల ఎకరం భూమి నా రోగం కోసం సూడంగనే మాయమైంది. ఇగున్నది ఎకరం. దాన్నమ్మితే ఉన్కొక్క బిడ్డకు ఆధీనమేది..? అందుకే నేన్సచ్చినా మంచిదే అని ఇంటికాడనే తిరంగున్న.
సూడబుద్ది గాక మావోళ్లు నిమ్స్ దవాఖానకు ఏస్కచ్చిండ్లు. మిలినీయం బ్లాక్ల రెండో ఫ్లోర్. కథలు చెప్పిన నోరు ఉత్తగుంటదా..? నాది నేనే ఒగ్గు కథ చెప్పుకుంటున్న. నా ఒగ్గు కథ విన్న ఓ పిలగాడు నా దగ్గరికొచ్చిండు. నా పక్కగ్గూసొని ‘ఏదేది.. మళ్లోసారి చెప్పన్న కథ?’ అన్నడు. ‘సారంగధరుడు’ కథలోని ‘రత్నాంగి’ పాత్ర కథ చెప్పిన. కథ విన్న ఆ పిలగాడు నా కట్టమంత తెల్సుకున్నడు. ‘నువ్వు బాధవడకే సంపతన్న, మనకు మన ప్రభుత్వం ఉన్నది, మనకు మన కేసీఆర్ సారున్నడు’ అని సోమారం పొద్దున డాక్టర్తోని మాట్లాడి ఎస్టిమేషన్ పేపర్ తీస్కపోయిండు. ఆ పిలగాడు మళ్లా గురువారం పొద్దూకిజాములొచ్చి…
‘సంపతన్నా నీ ఆరోగ్యం మంచిగయ్యేందుకు కేసీఆర్ సార్, మంత్రి హరీశ్రావు సార్ రెండు లక్షల యాభై వేల రూపాలు సాంక్షన్ చేసిర్రే’ అని ఎల్వోసీ నా చేతిల వెట్టిండు. అది తీస్కపొయి డాక్టర్ చేతిల వెట్టి ‘సారూ… గిది నడుస్తదా జర సూడుర్రి’ అనడిగిన. ‘బాజాప్తా నడుస్తది సంపత్, దీని విలువ 2 లక్షల యాభై వేలు. ఇగ నువ్ మంచిగైతవ్ రెస్ట్ తీస్కోపో’అని బెడ్డు మీదికి తోలిండు.
డాక్టర్ మాటలిన్న నాకు ఒక్కసారిగా ‘సారంగధరుడు’ ఒగ్గు కథల నేనేసిన ‘రత్నాంగి’ పాత్ర యాదికొచ్చింది. నన్ను కాపాడుకునేందుకు ప్రభుత్వం ఇంత ప్రయత్నం జేస్తున్నదంటే ఒగ్గు కళకు జీవం పోస్తన్నట్టే కదా లెక్క. ఆపతిల ఈ సంపతిని ఆదుకుంటున్న ముఖ్య మంత్రి కేసీఆర్ సారుకు, మంత్రి హరీశ్రావు సార్లకు వేనవేల శనార్థులు. నా ఆరోగ్యం మంచిగై మళ్లా కాళ్లకు గజ్జలు కట్టి, నా నోట ఒగ్గు కథ చెప్పేదాన్క నాకీ ప్రభుత్వం తోడుంటదని ఆశిస్తున్నా…
– గడ్డం సతీష్, 99590 59041