రెండు వేల ఏండ్ల కిందట రోమ్ సామ్రాజ్యంతో వర్తకం చేసిన ప్రాంతం కొండాపూర్. ఇది శాతవాహనుల నాణేల ముద్రణశాలనా అని ఆలోచింపజేసే నగరం. శాతవాహనుల ముప్ఫై కోటల్లో ఒకటిగా అలరారిన అలనాటి నగరం.. హైదరాబాద్కు 70 కిలోమీటర్ల దూరంలో, సంగారెడ్డి పట్టణానికి 15 కిలోమీటర్ల దూరంలో- కొండాపూర్ గ్రామ మట్టి దిబ్బల కింద- చరిత్ర కాలనాళికగా మిగిలి ఉంది. మొదటిసారి 1900లో హెన్రీ కౌసెన్స్ అనే బ్రిటిష్ ఆర్కియాలజిస్ట్ తన ‘లిస్ట్స్ ఆఫ్ ఆంటిక్వేరియన్ రిమైన్స్ ఇన్ హిస్ హైనెస్ ది నిజామ్స్ టెరిటరీస్’ (నిజాం ప్రభువు రాజ్యంలో మిగిలి ఉన్న పురాతన అవశేషాల జాబితాలు) అనే రిపోర్టులో దీనిగురించి రాసేవరకు ప్రపంచానికి కొండాపూర్ చారిత్రక విశిష్టత తెలియదు.
కొండాపూర్ గ్రామానికి పక్కనే కోటగడ్డగా పిలుచుకునే 85 ఎకరాల మట్టి దిబ్బల కింద శాతవాహన కాలపు వైభవం దాగి ఉన్నది. 1900లో హెన్రీ కౌసెన్స్ ఇక్కడ ‘ఒక ప్రాచీన నగరం’ ఉన్నదని, అంతకంటే ముందుకాలం నాటి అంటే మధ్య రాతియుగం, కొత్త రాతియుగం ఆనవాళ్లు కూడా ఇక్కడ ఉన్నాయని ప్రపంచానికి ప్రకటించాడు. ఆ తర్వాత నిజాం ప్రభుత్వ ఆర్కియాలజీ శాఖ 1937లో ఖ్వాజా ముహమ్మద్ అహ్మద్ నేతృత్వంలో పరిశీలన జరిపింది. 1940-42 మధ్య తవ్వకాలు జరిగినయి. ఆ తర్వాత మళ్ళీ 2009-2011 మధ్య ‘ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా’ తవ్వకాలు జరిపింది. మొదటి తవ్వకాలలో దొరికిన అవశేషాలు ఇప్పుడు కొండాపూర్లోని సైట్ మ్యూజియంలో ఉన్నాయి.
నగరం అంటే ఇదే…
నగరంలో వీధులు, రాజ గృహ సముదాయం, బావులు, వృత్తి పనివారి కర్మాగారాల్లాంటి నిర్మాణాలు, కొలిముల అవశేషాలు, విలువైన వస్తువులను భద్రపరచుకునే ప్రత్యేక నిర్మాణాలు, బౌద్ధ స్తూప, చైత్యాల ఆనవాళ్లు తవ్వకాల్లో బయటపడ్డాయి. శాతవాహన కాలపు సమకాలీన పురావస్తు ప్రదేశాలైన అరికమేడు (పుదుచ్చేరి దగ్గర), బ్రహ్మగిరి, చంద్రవల్లి, మాస్కి (ఈ మూడు కర్ణాటక లోనివి), అమరావతి (ఆంధ్రప్రదేశ్) వంటి ప్రాంతాల్లో పెద్దపెద్ద మట్టి పాత్రలు దొరికాయి. కొండాపూర్లో కూడా ఇటువంటి పాత్రలే లభించాయి. వీటిపై క్రీస్తుశకం 1వ శతాబ్దం నాటి బ్రాహ్మీ లిపి అక్షరాలున్నాయి. ఇక్కడ దొరికిన చైత్యం, స్తూపం, బుద్ధ పాదాలు, కుండపై త్రిరత్న ముద్ర వంటి ఎన్నో ఆధారాల వల్ల బౌద్ధం ఇక్కడి ముఖ్య మతం అని తెలుస్తున్నది.
గృహ అవసరాల పాత్రలు, రౌలెటెడ్ వేర్ అని పిలుచుకునే రోమన్ పాత్రలు, చిన్న మట్టి కుండలు, మూసలు- ఇలా ఒక నగరంలో నాగరికత సృజించిన అన్ని వస్తువులూ ఇక్కడ దొరికాయి. మట్టితో చేసి కాల్చిన (టెర్రకోట) గుర్రం, ఏనుగు వంటి జంతువుల బొమ్మలు, మానవ ఆకృతులు ఈ ప్రాంత మనుషుల శారీరక లక్షణాలను తెలియజేస్తున్నాయి. రింగులు తిరిగిన జుట్టు, వెడల్పయిన పెదవులను గమనించవచ్చు. సుద్దతో చేసిన తల్లీబిడ్డల బొమ్మ, టెర్రకోటతో చేసిన యక్షుల బొమ్మలు- కళాకారుల అద్వితీయ నైపుణ్యానికి చిహ్నాలు.
స్త్రీల జడలు, స్త్రీ పురుషుల ఆభరణాలు అన్నీ రెండు వేల ఏండ్ల కిందటి సౌందర్య అభిలాషను వ్యక్తం చేస్తున్నాయి. టెర్రకోటతో చేసిన మూసలు అనేకం దొరకడంతో ఇక్కడ బొమ్మలు, ఇతర వస్తువుల ఉత్పత్తి జరిగేదని తెలుస్తుంది. టెర్రకోట బొమ్మలు, పూసలు, విలువైన రాళ్లు, దంతపు దువ్వెన, రాగి వస్తువులు – ఇవన్నీ నాటి సాంస్కృతిక జీవన అవశేషాలు.
ఇక్కడ దొరికిన నాణేల సంగతి సరేసరి. ఈ నాణేలను చూసే ఖ్వాజా ముహమ్మద్ అహ్మద్ కొండాపూర్ కచ్చితంగా శాతవాహనుల టంకశాల అయి ఉంటుందని అభిప్రాయపడ్డాడు. 1940 నాటి తవ్వకాల్లో క్రీ.పూ.2వ శతాబ్దం నుంచి క్రీ.శ.2వ శతాబ్దం వరకు గల 1835 నాణేలు దొరికాయి. రోమ్ చక్రవర్తి ఆగస్టస్ బంగారు నాణెం రోమ్తో కొండాపూర్కు ఉన్న వాణిజ్య సంబంధాలను చెప్తుంది.
జలమార్గం-వర్తకం
అటు అరేబియా సముద్రానికి, ఇటు బంగాళాఖాతానికి జలమార్గం ద్వారా కొనసాగిన శాతవాహన వాణిజ్యంలో కొండాపూర్ భాగమైంది. దక్కన్ పీఠభూమి మధ్యలో జలమార్గాన్ని ఎలా వాడుకున్నారనేది మనకు ఒక పెద్ద పాఠం అవుతుంది. ఒకవైపు మంజీరా, ఇంకోవైపు మూసీ నది మధ్యలో కొండాపూర్- ఇదీ కొండాపూర్ భౌగోళిక విశిష్టత. కొండాపూర్ నుంచి మంజీరా వరకు భూ మార్గాన రవాణా చేసి మంజీరా నదిలో ప్రవేశించి, ప్రస్తుత సంగారెడ్డి జిల్లాలోని మంజీరా దాటి, మహారాష్ట్రలోని ఉస్మానాబాద్ జిల్లాలోని తేర్ వరకు నౌకలు వెళ్లేవి. తేర్ పట్టణం ఉన్నది మంజీరా వాగు తేర్నా ఒడ్డున. అంటే కొండాపూర్ నుంచి మహారాష్ట్ర వరకు జలమార్గంలో సరుకు వెళ్లి, ఆ తర్వాత తేర్ నుంచి గుజరాత్ తీరంలో ఉన్న భరుచ్ వరకు భూ మార్గంలో ప్రయాణించి అక్కడినుంచి సముద్ర మార్గంలో రోమ్ చేరేవి. ఇందుకు ఆధారాలున్నాయని పరిశోధనలు చెప్తున్నాయి.
కొండాపూర్ నుంచి ఇప్పటి హైదరాబాద్ వరకు భూమార్గంలో ప్రయాణించి, అక్కడి నుంచి మూసీలో నల్గొండలోని వాడపల్లి వరకు నౌకల మీద వెళ్లి, అక్కడినుంచి కృష్ణానదిలో ప్రవేశించి మచిలీపట్నం (మైసోలియా అని విదేశీయులు పిలిచేవారు) వరకు సరుకులను రవాణా చేసేవారు. అటు తర్వాత రోమ్ వరకు సముద్ర ప్రయాణం. ఎంత అద్భుతమైన జలమార్గ ప్రణాళికో ఇది. అందుకే, శాతవాహనుల ప్రతి పట్టణంలో మనకు రోమన్ నాణేలు దొరుకుతున్నాయి.
కాకతీయులు మనకు నీటిపారుదల సౌకర్యాల పెంపు గురించి చెప్తే, శాతవాహనులు తెలంగాణకు జల మార్గాలను ఎలా అన్వేషించాలో చెప్తున్నారు.
కొండాపూర్ను ఎలా నిలబెట్టుకోవాలి?
రోమ్లో సుమారు 2000 ఏండ్ల కింద వెసూవియస్ అగ్నిపర్వతం కింద కూరుకుపోయిన పాంపే పట్టణాన్ని తిరిగి ఒక పురావస్తు దర్శనీయ స్థలంగా మార్చారు. కొండాపూర్లో నాలుగు విడుతలుగా తవ్వకాలు జరిగినప్పటికీ అక్కడ దొరికిన పురాతత్వ అవశేషాలను మ్యూజియంలోకి తరలించారు. ప్రతిసారీ తవ్వకాలు పూర్తయిన వెంటనే ఆ ‘సైట్’ పాడు కాకూడదని మట్టితో కప్పివేస్తున్నారు. అందుకే ఇప్పుడు అక్కడ గడ్డి, చెట్లు మొలిచిన మట్టి దిబ్బ తప్ప ఏమీ కనిపించదు. 2012లో జరిపిన తవ్వకాల రిపోర్టు ఇప్పటికీ బయటికిరాలేదు.
మొహంజొదారో, హంపి లాగా, పాంపే లాగా కొండాపూర్ను పునరుజ్జీవింపజేయాలి. సందర్శకులు- అలనాటి శాతవాహన నగర వీధుల మధ్య తిరుగుతూ, చరిత్రను మనసుతో స్పృశించగలగాలి. అప్పుడే మనం ఒక గొప్ప చరిత్రకు నిజమైన వారసులమవుతాం. పూర్తిస్థాయి తవ్వకాలు జరిపి, ఆర్కియాలజీ పరిభాషలో చెప్పాలంటే కన్జర్వేషన్ అండ్ ప్రిజర్వేషన్ (సంరక్షించడం) జరగాలి.
గుణాఢ్యుడి కథ
కథా సాహిత్యంలో తొలి రచన అయిన బృహత్కథను గుణాఢ్యుడు కొండాపూర్ ప్రాంతంలోనే రాశాడని ప్రముఖ చరిత్రకారుడు ప్రొఫెసర్ ముక్కామల శర్మ భావించారు. అందుకే తెలుగు విశ్వవిద్యాలయంలో గుణాఢ్యుడి చిత్రానికి రూపకల్పన కూడా చేయించారు.
క్రీ.శ.1వ శతాబ్దంలో శాతవాహన రాజు హాలుడి రాజ్యంలో గుణాఢ్యుడు అనే పండితుడు ఉండేవాడు. పైశాచీ భాషలో (ప్రాకృత భాషల్లో ఒక రూపం. అది అప్పటి ప్రజల భాష) రాసిన బృహత్కథను హాలుడు పట్టించుకోకపోవడంతో ఆవేదన చెందిన గుణాఢ్యుడు అడవికి వెళ్లి ఒక్కో కథను చదువుతూ తాళపత్రాలను అగ్నికి ఆహుతి చేస్తుంటే జంతువులు చుట్టూ చేరి తదేకమై విన్నాయట. హాలుడు తప్పు తెలుసుకొని కొంత భాగాన్ని మాత్రం కాపాడ గలిగాడని సాహిత్య ఆధారాలు చెప్తున్నాయి. ఆ మిగిలిన భాగం ఆధారంగానే హాలుడు గాథా సత్త సయీ (సంస్కృత రూపం గాథ సప్త శతి) రాశాడంటారు.
సంగారెడ్డి జిల్లాలో శాతవాహన ఆనవాళ్లు
ఒక మహానగరం ఎప్పుడూ ఒంటరిగా ఎదగదు. చుట్టూ చిన్న పట్టణాలు, గ్రామాలతో ఆ ప్రాంతమంతా ఆ మహానగరానికి అనుసంధానంగా అభివృద్ధి చెందుతుంది. అందుకే కొండాపూర్కు దగ్గరలోనే మంజీరా పరీవాహక ప్రాంతం లోపల, వెలుపలా కొన్ని గ్రామాల్లో పురావస్తు శాఖ చేపట్టిన తవ్వకాల్లో శాతవాహన కాలం నాటి విశేషాలు బయటపడ్డాయి. ఆ వివరాలు..
కంది: కొండాపూర్కు 16 కిలోమీటర్ల దూరంలో, ముంబై నేషనల్ హైవే పక్కన ఉన్న కందిలో 1982-83లో పరిమితస్థాయిలో చేపట్టిన తవ్వకాల్లో.. మలి శాతవాహనుల కాలం నాటి ఇటుకలు, నిర్మాణాలు, మట్టిపాత్రలు, టెర్రకోటతో చేసిన మానవ, జంతువుల బొమ్మలు, పూసలు దొరికాయి. ఇటుకలతో కట్టిన ఒక మతపరమైన నిర్మాణం బయటపడింది. ఒక గర్భవతి తన గర్భాన్ని నిమురుకుంటున్నట్టుగా సుద్దతో చేసిన ఒక బొమ్మ ఇక్కడ దొరికింది. ఇది ప్రత్యుత్పత్తిని సూచించే అమ్మ తల్లుల ఆరాధనకు సంబంధించిన ఆధారం. ఈ ప్రదేశం క్రీ.పూ.1 నుంచి క్రీ.శ.1 మధ్య నాటిదిగా, అంటే కనీసం 2000 ఏండ్లకు ముందటిదిగా గుర్తించారు. అప్పుడే ఈ స్థలం చుట్టూ కంచె వేసి కాపాడుకోవాలని ఆర్కియాలజీ శాఖ వార్షిక నివేదికలో చెప్పినప్పటికీ అది జరగకపోవడం వల్ల ఇప్పుడు చారిత్రక ఆధారాలన్నీ పెరిగిన ఆవాసాల కింద భూస్థాపితమయ్యాయి.
పెద్దపూర్: కొండాపూర్కు ఇది 8 కి.మీ.ల దూరంలో ఉన్న ప్రాంతం. జాతీయ రహదారికి పక్కనే ఉన్న పెద్దాపూర్ గ్రామంలో ఈ వ్యాసకర్త శాతవాహన కాలం నాటి కుండపెంకులను ఈ ఏడాది మార్చిలో సేకరించారు.
ఇందూరు: సంగారెడ్డి జిల్లాలోని ఈ గ్రామంలో, సింగూర్ డ్యాం కింద ముంపుగ్రామాల్లో సాల్వేజ్ ఆర్కియాలజీలో (ముంపుకు గురయ్యే ప్రాంతాల్లో చేపట్టే పరిరక్షణ చర్యలు) భాగంగా జరిపిన తవ్వకాల్లో శాతవాహన నాణెం దొరికింది. దానిపై ఉజ్జయిని గుర్తు, మూడు కొండలు, నెలవంకతో పాటు ‘స (సి) రిస’ అనే బ్రాహ్మీ లిపి అక్షరాలున్నాయి. కొండాపూర్లో దొరికిన టెర్రకోట బొమ్మల వంటివి ఇక్కడ కూడా లభించాయి.
నిర్జుప్పల: ఇది కూడా సింగూర్ ప్రాజెక్టు ముంపు గ్రామమే. మంజీరా తీరంలో ఉన్న ఈ గ్రామంలో శాతవాహనకాలం నాటి కుండపై తెల్లరంగుతో వేసిన చతురస్ర్తాలు (దీన్ని ఆర్కియాలజీ పరిభాషలో బ్రహ్మగిరి టైపు కుండలు అంటారు), టెర్రకోట బొమ్మలు దొరికినయి.
రేకులపాడు: సదాశివపేట మండలం మల్లికార్జునపల్లి దగ్గరున్న రేకులపాడులో 1983-84లో ఒక మట్టి దిబ్బ కింద క్రీ.పూ.1 నుంచి క్రీ.శ.2 మధ్య నాటి అవశేషాలు లభ్యమైనాయి.
బూసరెడ్డిపల్లి: సంగారెడ్డి దగ్గర మంజీరా నది ఒడ్డున ఉన్న ఈ గ్రామంలో 1983-84లో శాతవాహన కాలం నాటి మట్టిపాత్రలు, పూసలు, దంతంతో చేసిన వస్తువులు దొరికాయి.
కల్లేపల్లి: ఈ ఊరిలో శాతవాహనకాలం నాటి రాగి గాజు, పాత్రలు దొరికాయి.
మాంతూరు: అందోళ్ దగ్గరి ఈ ఊళ్లో వివిధ సైజుల్లో పాత్రలు, విలువైన రాళ్లతో చేసిన పూసలు, పొయ్యి, కోతి, జంతువుల మట్టి బొమ్మలు దొరికాయి.