భారత్ అధ్యక్ష తరహా పాలన వైపు అడుగులు వేస్తున్నదా? రాచరికం వైపు మళ్లుతున్నదా? చైనాలో జిన్పింగ్ శాశ్వత అధ్యక్షుడిలా, దేశంలో మోదీ తనకు ఎదురులేకుండా పావులు కదుపుతున్నారా? అంటే.. ఔననే సమాధానాలు వినిపిస్తున్నాయి. సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా మోదీ సర్కార్ రాష్ర్టాల హక్కులను కాలరాస్తూ, దొడ్డిదారిన చట్ట సవరణలు చేస్తూ పోతున్నది. తాజా ఉదాహరణే ‘ఆల్ ఇండియా సర్వీసెస్ (ఏఐఎస్) కేడర్ రూల్స్ సవరణ’.
ఏ ఐఎస్’ కేడర్ రూల్స్ సవరణపై ఇప్పటికే దేశంలోని పలు రాష్ర్టాల ముఖ్యమంత్రుల నుంచి నిరసన వ్యక్తమవుతున్నది. మనది సమాఖ్య స్ఫూర్తితో నడుస్తున్న ప్రజాస్వామిక దేశం. రాజ్యాంగం లో కేంద్ర, రాష్ర్టాల హక్కులతో పాటు ఉమ్మడి జాబితాను పొందుపరిచారు. ఆ స్ఫూర్తితోనే 70 ఏండ్లుగా చెక్కుచెదరని స్ఫూర్తితో దేశం ముందడుగు వేస్తున్నది. కానీ మోదీ సర్కారు అధికారంలోకి వచ్చాక దానికి విరుద్ధంగా, రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ చట్టాలన్నింటికీ సవరణలు చేస్తూ పోతున్నది. ఆ క్రమంలోనే ఏఐఎస్ నిబంధనలకు సవరణలు చేస్తున్నట్టు ప్రకటించింది.
ఈ సవరణలతో.. ఇకపై రాష్ట్ర ప్రభుత్వాల అనుమతితో సంబంధం లేకుండా నేరుగా ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులను కేంద్ర సర్వీసుల్లోకి డిప్యుటేషన్పై తీసుకునేలా ఏఐఎస్ నిబంధనలు-1951 చట్టంలో సవరణలు చేసింది. రాష్ర్టాల హక్కులను హరించేలా ఉన్న ఈ ఏకపక్ష నిర్ణయా న్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ సహా 9 రాష్ర్టాల ముఖ్యమంత్రులు కేంద్రానికి లేఖలు రాశారు. కేంద్రం ప్రతిపాదించిన సవరణలు రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా ఉన్నాయని కేసీఆర్ తన లేఖలో ఉద్ఘాటించారు.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 312 నిబంధనల ప్రకారం- ‘ఆల్ ఇండియా సర్వీసెస్ యాక్ట్-1951’ని పార్లమెంట్ రూపొందించింది. దానిప్రకారం ఐఏఎస్లు వివిధ రాష్ర్టాలకు కేటాయించబడుతారు. ఆయా రాష్ర్టాల నుంచి కేంద్రానికి డిప్యూట్ అవుతుంటారు. నిబంధనల ప్రకారం.. ఆ రాష్ర్టానికి ఉన్న క్యాడర్ సంఖ్యలో గరిష్ఠంగా 40 శాతానికి మించకుండా కేంద్రానికి స్టేట్ క్యాడర్ నుంచి బదిలీ చేయాల్సి ఉంటుంది. గతంలో రాష్ర్టాల అనుమతితో ఐఏఎస్ అధికారులు కేంద్రానికి డిప్యుటేషన్పై వెళ్లేవారు. ఒకవేళ ఎవరైనా అధికారిని కేంద్రానికి బదిలీ చేయాల్సి వస్తే, ఆ రాష్ట్ర ప్రభుత్వం రిలీవ్ చేసిన తర్వాతనే వెళ్లాలి. ఒకవేళ ఎవరైనా అధికారి తనకు తానుగా కేంద్ర సర్వీసులకు బదిలీ కావాలని కోరితే, ఆ రాష్ట్ర ప్రభుత్వం ‘నో అబ్జెక్షన్ సర్టిఫికెట్’ ఇచ్చిన తర్వాతనే రిపోర్ట్ చేయాల్సి ఉండేది. ఇవికాకుండా మొత్తం 9 పారామీటర్స్ ఆధారంగా కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఐఏఎస్ అధికారులు బదిలీ అవుతుంటారు.
తాజా కేంద్ర సవరణలతో అఖిల భారత సర్వీసుల్లోని అధికారులపై రాష్ర్టాలకు సంబంధం ఉండదు. కేంద్ర సర్వీసుల్లోకి ఎవరిని డిప్యూటేషన్పై తీస్కోవాలన్నది కేంద్రం చేతుల్లోనే ఉంటుంది. సంఖ్య, క్యాడర్ లిమిటేషన్తో సంబంధం లేకుండా ఇకపై రాష్ర్టాల నుంచి ఎంతమందిని కేంద్రానికి డిప్యుటేషన్పై పంపాలన్నది కేంద్రమే నిర్ణయిస్తుంది. ఓ అధికారి విషయంలో భిన్నాభిప్రాయం ఉంటే కేంద్రానిదే తుది నిర్ణయమవుతుంది.
తాజా పంజాబ్ ఘటన, అంతకుముందు బెంగాల్ ఉదంతాలతో మోదీ సర్కార్ కేంద్ర సర్వీసులపై పెత్తనానికి సిద్ధమైనట్టు అర్థమవుతున్నది. పంజాబ్లో మోదీ కాన్వాయ్ ఒక ఫ్లై ఓవర్పై 20 నిమిషాలు నిలిచిపోవడంపై ఆ రాష్ట్ర ప్రభుత్వం మీద విమర్శలొచ్చాయి. చీఫ్ సెక్రెటరీ, డీజీపీ లాంటి సెంట్రల్ క్యాడ ర్ అధికారులు ప్రధాని భద్రతను పణంగా పెట్టారని బీజేపీ విమర్శించింది. అంతకుముందు బెంగాల్లోనూ ప్రొటోకాల్ సమస్యపై మమతా బెనర్జీ చీఫ్ సెక్రెటరీతో గొడవపడిన సందర్భాలను దేశం చూసింది.ఈ మధ్యకాలంలో మోదీ సర్కారు ఒంటెత్తు పోకడతో అనేక చట్టాలు చేసింది. అలా వచ్చిన రైతు వ్యతిరేక చట్టాలు, డ్రై పోర్ట్ యాక్ట్, డ్యాం సేఫ్టీ బిల్లు, సమాచార హక్కు చట్టం, సర్వీసు నిబంధనలు.. ఇలా ఉన్న చట్టాలను ఏకపక్షంగా మార్చుకుంటూ పోతున్నది. రాష్ర్టాల్లో పనిచేస్తున్న అధికారులను కేంద్రం నియంత్రించేలా ఈ ప్రతిపాదనలు రూపొందించినట్టు అర్థమవుతున్నది. నిజానికి యూనియన్ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్(యూపీఎస్సీ), సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ (సీఎస్ఈ) ద్వారా భారతదేశానికి కావాల్సినంత మంది సివిల్ సర్వీస్ అధికారులను ఎంపికచేస్తారు. అలా ఎంపికైనవాళ్లను సెంట్రల్ పూల్ నియామక ప్రక్రియ ద్వారా అన్ని రాష్ర్టాలకు, కేంద్ర సర్వీసులకు కేటాయిస్తారు.
జాతీయస్థాయిలో ప్రతిపక్షంలో ఉన్నంతకాలం సర్కారియా కమిషన్ సిఫారసులు అమలుచేయాలని బీజేపీ డిమాండ్ చేసింది. మోదీ అధికారంలోకి వచ్చిన కొత్తలో ‘సహకార సమాఖ్య స్ఫూర్తి’, ‘టీమ్ ఇండియా’ అని నీతులు చెప్పారు. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి నడిస్తేనే అభివృద్ధి సాధ్యమన్నారు. కానీ ఇప్పుడు ఏకపక్ష నిర్ణయాలతో నియంతలా వ్యవహరిస్తున్నారు. ఆర్టికల్ 6కు సవరణలు చేయడమంటే రాజ్యాంగాన్ని మార్చడమే. డిప్యుటేషన్ పేరుతో ఐఏఎస్లపై పట్టు బిగించడమే. రాష్ర్టాల అధికారాలకు కత్తెర వేయడమే. రాష్ర్టాలను జిల్లా స్థాయికి దిగజార్చడమే.
(వ్యాసకర్త: టీఆర్ఎస్రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్)
-వై. సతీష్రెడ్డి ,96414 66666