అగ్రరాజ్యాల్లో ఒకటైన రష్యా ముందు చిన్న దేశం ఉక్రెయిన్ నిలువటం కష్ట సాధ్యం లేదా అసాధ్యం అనుకున్న వారంతా విస్తుపోతున్న స్థితి. కొన్ని రోజుల్లో ముగుస్తుందనుకున్న యుద్ధం, నెలలుగా కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలో ప్రాచీనకాలం నాటి యుద్ధతంత్రాలపై చర్చ జరుగుతున్నది. తెలంగాణలో ప్రముఖ రాజవంశమైన కాకతీయుల కాలం నాటి రక్షణ ఏర్పాట్లు ఆసక్తికరం.
ఇటు గోదావరీ నది పరీవాహక ప్రాంతం నుంచి కృష్ణ, భీమా నదుల పరీవాహక ప్రాంతాలైన సుబ్బినాడు, గంగాపూర్, పిఠాపురం, రాజమహేంద్రవరం, కోనసీమ, మోటుపల్లి, కంచి, పుష్పగిరి, కడప, గండికోట, ఆదోని, కర్నూలు, ఆలంపూర్, బీదర్ సరిహద్దులుగా విశాల భూభాగాన్ని కాకతీయులు క్రీ.శ.1050 నుంచి 1300 వరకు 250 ఏండ్ల పాటు పాలించారు. చరిత్రను పరిశీలిస్తే అప్పుడు విదేశీయుల దండయాత్రలు, ఉత్తర భారత దేశం నుంచి తురుష్కుల సామ్రాజ్య విస్తరణ కాంక్ష, పొరుగు రాజ్యాల దురాక్రమణలు అధికంగానే ఉండేవి. వీటన్నింటినీ తట్టుకొని కాకతీయులు దాదాపు 250 ఏండ్లు ఎలా పరిపాలించారన్నది ఆసక్తికరం. కాకతీయులు రాజ్యరక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. సమయమొస్తే ప్రతీ పౌరుడు యుద్ధ రంగంలో పాల్గొనేలా శిక్షణ ఇవ్వడం, సామంత రాజులతో సామ్రాజ్యానికి రక్షణ కవచంగా నాయంకర వ్యవస్థను ఏర్పర్చుకోవటం, పటిష్ఠమైన గూఢచార వ్యవస్థ కాకతీయుల రక్షణ వ్యవస్థ విశిష్టతలు. రాజధాని అయిన వరంగల్ నగరం చుట్టూ రక్షణ గోడల్లా గిరి దుర్గాలను వారు ఏర్పాటు చేశారు. పటిష్ఠమైన యుద్ధతంత్రాలు, బలమైన మిత్రరాజ్యాలను కలిగి ఉండటం, వివాహ సంబంధాల ద్వారా పలు రాజ్యాలతో బంధుత్వాలను ఏర్పాటు చేసుకోవటం వంటి వాటి ద్వారా కాకతీయులు రాజ్యాన్ని కాపాడుకున్నారు.
‘ప్రతాప రుద్రీయం’ గ్రంథంలో ‘నవ లక్ష ధనుష్క చక్రవర్తి’ అని ప్రతాపరుద్రుడిని కొనియాడటాన్ని చూస్తాం. అంటే, తొమ్మిది లక్షల మంది సైనికులను కలిగిన వాడని తెలుస్తున్నది. నాటి పరిస్థితుల్లో తొమ్మిది లక్షల మంది సైన్యం కలిగివుండటం గొప్పవిషయమే. బహుమనీలు, మొఘల్ చక్రవర్తులకు కూడా ఇంత పెద్దసంఖ్యలో సైనికులు లేరు. మరి, ప్రతాప రుద్రుడికి తొమ్మిది లక్షల సైన్యం ఎలా ఉంది అనేది మనకు వచ్చే సంశయం. కాకతీయుల కాలంలో అప్పటి పౌరులందరూ అవసరమైతే, దేశ రక్షణలో పాల్గొనేలా యుద్ధవిద్యలో శిక్షణ ఇచ్చేవారు. అందుకే, తెలంగాణతోపాటు కాకతీయ సామ్రాజ్యం ఉన్న ప్రాంతాలన్నింటా వీరగల్లుల విగ్రహాలు ఇప్పటికీ విరివిగా దొరుకుతున్నాయి. ఈ క్రమంలోనే , ప్రతాప రుద్రుడికి 9 లక్షల మంది సైనికులున్నారు అని పేర్కొన్నారు.
కాకతీయుల మరో వ్యూహం- తమకు ఎప్పటికైనా ముప్పు అనుకున్న పొరుగు రాజ్యాలతో వైవాహిక సంబంధాలను ఏర్పాటుచేసుకోవ డం. దివిసీమ రాజు పిన్నచోడుడు. అతని కుమార్తెలు నారాంబ, పేరాంబను గణపతిదేవుడు వివాహం చేసుకున్నాడు. పిన్నచోడుడి కుమారుడు, తన బావమరిది అయిన జాయప సేనానిని ‘గజ సాహిణి’గా నియమించాడు. రాణి రుద్రమకు ముగ్గురు కూతుర్లు ఉండగా వీరిలో ఒక కూతురును బ్రాహ్మణుడైన ఇందులూరి అన్నయ్యకు, మరో కూతురును యాదవ రాజైన సారంగపాణి దేవుడికి ఇచ్చి వివాహం జరిపించింది. ఇక మూడవ కూతురు ముమ్మడమ్మను తమ కాకతీయ వంశస్థులకే ఇచ్చింది. ఈ మూడవ కూతురు కొడుకే ప్రతాపరుద్రుడు. దీనితోపాటు, నెల్లూరులో మనుమసిద్ది పాలకులతో పటిష్ఠమైన స్నేహబంధాన్ని కొనసాగించారు. ఉత్తరాదికి చెందిన కాయస్థులతో మిత్రుత్వం వహించారు. తమ రాజ్యంపై శత్రు రాజులు దండెత్తినా వారిని రాజ్య ప్రధాన స్థావరానికి వెలుపలనే అడ్డుకోవడం కోసం ఓరుగల్లు చుట్టూ చిన్న చిన్న ఉప రాజ్యాలను ఏర్పాటు చేసి వాటికి అధిపతులుగా నాయంకరులనే పేరుతో సామంత రాజులను నియమించుకున్నారు. వీరినే దండనాయకులు అనేవారు. ఆ సమయంలో దాదాపు 77 నాయంకరులు ఉండేవారని ప్రముఖ చరిత్రకారుడు డా.రేచర్ల గణపతి పేర్కొన్నారు. అంటే, ఓరుగల్లు చుట్టూ దాదాపు 70కి పైగా చిన్న చిన్న కోటలుండేవన్నమాట.
కాకతీయుల ప్రధాన స్థావరమైన ఓరుగల్లు కోటను శత్రు దుర్బేధ్యంగా తీర్చిదిద్దారు. ప్రధాన కోట చుట్టూ మూడు కోటలు నిర్మించారు. ఒకటి మట్టి కోట కాగా రెండోది రాతి కోట. ఈ రాతి కోట చుట్టూ కందకాలు తవ్వి వాటిని నీళ్లతో నింపి మొసళ్లను వదిలేవారు. మూడోది కంప కోట. ఈ కంప కోట మరే ఇతర రాజ వంశాల్లో కాన రాదు. కంప, వెదురు, కలప దూలాలతో కలిపి ఈ కోటను నిర్మించేవారు. దీని దగ్గరికి శత్రువులు రాగానే కోటను తగులపెట్టేవారు. బడబాగ్నిలా మంటలు విస్తరించి శత్రువులను కబళించేవి.
కాకతీయులు తమ రాజ్యాన్ని ఆర్థికంగా పటిష్ఠం చేసే విధానాలను అవలంబించారు. దీనికోసం ‘త్రీ టీస్’ విధానాన్ని అంటే, టెంపుల్, ట్యాంక్, టౌన్ (ఆలయం, చెరువు, పట్టణం) విధానాన్ని ప్రవేశపెట్టారు. ఉత్తర భారతానికి చెందిన మాలిక్ కాఫర్ ఓరుగల్లు కోటను స్వాధీనం చేసుకోవాలని మూడు సార్లు దండయాత్ర చేసి విఫలమైనాడు. చివరికి, కోటలోని వారిని ప్రలోభాలకు గురిచేసి, కోవర్టులుగా మలుచుకొని నాలుగోసారి దొంగ చాటుగా ఓరుగల్లు కోటను ఆక్రమించుకున్నాడు. కాఫర్ వద్ద ఫిరంగులు ఉండటం, వాటిని ఎదుర్కోవడంపై తన సైన్యానికి సరైన శిక్షణ లేకపోవడంతో ప్రతాప రుద్రుడు తన రాజ్యాన్ని కోల్పోవాల్సి వచ్చింది.
(వ్యాసకర్త: జాయింట్ డైరెక్టర్, సమాచార పౌర సంబంధాల శాఖ, హైదరాబాద్)
-కన్నెకంటి వెంకటరమణ
98499 05900