పాము పడగ ఆకారంలో ఉన్న కొండ.. దానిమీద మహా స్తూపం.. ఇప్పటివరకు బయటపడ్డ నాలుగు స్తూప చైత్యాలు.. సున్నపు రాతి స్తంభాలతో కట్టిన సమావేశ మందిరాలు.. 200 కంటే ఎక్కువ గదులున్న బౌద్ధ విహారం.. ఇది ఎక్కడో టిబెట్లోనో, జపాన్లోనో కాదు, హైదరాబాద్కు 140 కిలో మీటర్ల దూరంలో సూర్యాపేట జిల్లా ఫణిగిరిలో బయటపడిన ఒక అద్భుత పురావస్తు వారసత్వం.
శాతవాహనుల కాలంలో మొదలై, ఇక్ష్వాకుల కాలంలో నాగార్జున కొండ పరిసర ప్రాంతాల్లో బౌద్ధం విలసిల్లిన కాలంలోనే ఫణిగిరిలో ఒక పెద్ద బౌద్ధ స్థావరం ఉండేది. శాసనాధారాలను బట్టి దాన్ని ధమ్మచక్కపురం (ధర్మ చక్రపురం) అనే వాళ్లని చరిత్రకారుల భావన. న్యూయార్క్ మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ 150వ వార్షికోత్సవ సందర్భంగా ప్రదర్శించిన శిల్పం ఫణిగిరి తవ్వకాల్లో దొరికినదే.
గోదావరి నుంచి కృష్ణకు ప్రవహించిన మహాయానం..: తెలంగాణలో గోదావరీ తీరం వెంట మొదలైన థేరవాద బౌద్ధం శాతవాహనుల నుంచి ఇక్ష్వాకుల కాలం వచ్చేనాటికి అంటే క్రీ.పూ. 2వ శతాబ్దం నుంచి క్రీ.శ.200 నాటికి మహాయాన బౌద్ధం రూపు తీసుకుంది. అంటే థేరవాద బౌద్ధం పూర్తిగా కనుమరుగైందని కాదు కానీ మహాయాన బౌద్ధం విస్తృతంగా వ్యాప్తి చెందింది. అందుకే గోదావరి నుంచి దిగువ కృష్ణా లోయలోకి వచ్చే కొద్దీ బుద్ధ ప్రతిమలు, బుద్ధుడి రూపాలైన బోధిసత్వ మూర్తులు, బౌద్ధ విహారాల్లో జాతక కథలు విస్తృతంగా చెక్కి ఉండటం చూస్తున్నాం. సూర్యాపేట జిల్లాలో ఫణిగిరి, గాజుల బండ (ఈటూరు), ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలలో స్తూపాలు, కొత్తగూడెం దగ్గర కోరుకొండ రామవరంలో రాతిని తొలిచి నిర్మించిన బుద్ధుడి ప్రతిమలు, సూర్యాపేట జిల్లాలోని వర్ధమానుకోట, యాదాద్రి-భువనగిరి జిల్లాల్లోని చాడలో దొరికిన బుద్ధుడి ప్రతిమలు.. ఇలా మహాయాన బౌద్ధానికి చెందిన ఆధారాలున్నాయి. హైదరాబాద్లోని చైతన్యపురిలో మూసీ ఒడ్డున విష్ణుకుండి కాలం నాటి థేరవాద బౌద్ధ విహార శాసనం ఉంది.
బౌద్ధ మకుట రత్నం ఫణిగిరి..: 150 అడుగుల ఎత్తులో, కొండ మీద, కింద వంద ఎకరాల స్థలంలో విస్తరించిన ఫణిగిరి మహా విహారం బౌద్ధ ఆధారాల అక్షయ పాత్ర. కొండపై ఎత్తు పల్లాలను ఆధారం చేసుకొని ఇక్ష్వాకుల కాలంలో నిర్మించిన బౌద్ధుల టౌన్షిప్గా ఫణిగిరిని వర్ణించవచ్చు. ఇక్కడ తవ్వే కొద్దీ కొత్త అద్భుతం బయట పడుతూనే ఉంది. 1940-44ల మధ్య నిజాం రాష్ట్రంలో, 2001-2007లలో, తిరిగి 2018-19లో ఇక్కడ తవ్వకాలు జరిగాయి. ఫణిగిరి మిగిలిన అన్ని బౌద్ధ పురావస్తు స్థలాల కంటే ప్రత్యేకమైనది. ముందుగా చెప్పుకోవాల్సిందిక్కడ దొరికిన తోరణాలు. సాంచీ స్తూపానికి ఉన్నట్టే ఇక్కడ కూడా స్తూపం నాలుగు వైపులా తోరణాలుండేవి. తవ్వకాల్లో దొరికిన తోరణాల భాగాలపైన, ఇతర రాతి ఫలకాలపైనా ఉన్న శిల్పకళ అమరావతి శిల్పరీతికి అత్యంత ఉన్నత దశగా చెప్పుకోవాలి. ఇప్పటివరకు తెలంగాణలోని అన్ని పురావస్తు స్థలాల కంటే ఎక్కువగా ఇక్ష్వాకుల నాటి శిల్పాలు ఇక్కడ దొరికినయి. బుద్ధుడి శిల్పం, బుద్ధ పాదాలు, తల భాగం లేని ఇక్ష్వాకుల రాజు నిలువెత్తు విగ్రహం, ఇక్ష్వాకు వంశం చివరి రాజు రుద్రపురుష దత్తుడి స్తంభ శాసనం, జాతక కథల ఫలకాలు- ఇట్లా ఇక్కడ దొరికిన ప్రతీ రాతి ముక్కా ఒక కళాఖండమే. రెండేండ్ల కిందటి తవ్వకాల్లో బయటపడిన అష్టభుజ స్తూప పునాది శ్రీలంకలో రాజగాల అనే బౌద్ధ విహారంలో దొరికిన అష్టభుజ ‘బౌద్ధ ఘర’ను పోలి ఉన్నది. బౌద్ధ భిక్కువుల కోసం గదులు, ఎన్నో శాసనాలు, నాణేలు- ఇవన్నీ ఫణిగిరి గుట్ట మీద దొరికాయి.
ఇక్కడ దొరికిన ఒక శాసనంలో ఇక్ష్వాకు రాజు రుద్రపురుషదత్తుడి ముఖ్య వైద్యుడైన ధేమసేన అనే రాజవైద్యుడు చేసిన ధర్మచక్ర స్తంభాన్ని స్థాపించిన దాఖలా ఉంది. అందుకే ఆయు ష్ మంత్రిత్వశాఖకు చెందిన నేషనల్ సెంటర్ ఫర్ ఇండియన్ మెడికల్ హెరిటేజ్ పరిశోధకులు అశోకుడి శిలా శాసనాల తర్వా త ప్రాచీనకాలపు వైద్యరంగ ప్రశస్తిని తెలిపే శాసనంగా గుర్తించారు.
ఫణిగిరిలో దొరికిన ఇంకో ప్రత్యేకమైన అవశేషం బోధిసత్వుడి నిలువెత్తు స్టక్కో ప్రతిమ. స్టక్కో అంటే ఇటుకలు, మట్టి, సున్నపు లేప్యంతో నునుపు చేసి తయారుచేసిన ప్రతిమ. బౌద్ధ స్టక్కో ప్రతిమలు ఎక్కువగా ఆఫ్గనిస్థాన్, పాకిస్థాన్లో దొరుకుతున్నాయి. దక్షిణ భారతదేశంలో బోధిసత్వుడి నిలువెత్తు స్టక్కో ప్రతిమ కేవలం ఫణిగిరి తవ్వకాల్లో దొరికింది. ఈ బోధిసత్వుడి ప్రతిమను బాగుచేసి (మెండింగ్) మ్యూజియంలో ఉంచితే తెలంగాణ పురావస్తు సంపదకు మరొక విశిష్టత తోడవుతుంది.
అవశేషాలు సంధిస్తున్న ప్రశ్నలు..: కోటలింగాల తవ్వకాలు అసంపూర్తిగానే మిగిలాయి. కంభంపల్లి స్తూపం కనుమరుగైంది, గాజులబండ శిథిలాల్లో ఉంది. ధూళికట్ట స్తూపం వెళ్లే దారిలేక ఆదరణ కరువైంది. ఫణిగిరిలో ఇంకా సంరక్షణ, పునర్నిర్మాణం జరగలేదు. తెలంగాణ నేల మీద వెలసిన తొలి మతపరమైన నిర్మాణాలు బౌద్ధ కట్టడాలు. వీటిని మనం కాపాడుకోలేకపోతే మన తొలి నిర్మాణ కౌశల్యాన్ని, శిల్ప నైపుణ్యాన్ని, రెండు వేల ఏండ్ల కిందటి తెలంగాణ జీవన ఆధారాలను మట్టిలో కలిపేసినవాళ్ళమవుతాం. అందుకే మట్టి పొరల్లోంచి తొంగి చూస్తూ బౌద్ధ సంస్కృతి మనల్ని ప్రశ్నిస్తూనే ఉంటుంది. వీటిని మనం పురావస్తు స్థలాలుగా అభివృద్ధి చేయగలిగితే ఇప్పటికీ బౌద్ధ మతం ప్రధాన మతంగా ఉన్న ఎన్నో దేశాల ప్రజలకు తెలంగాణ ఒక టూరిస్ట్ డెస్టినేషన్గా మారుతుంది.
బౌద్ధ స్తూపం ఎలా మొదలైంది..?: కొత్త రాతియుగం చివరలో అంటే సుమారు క్రీ.పూ.1500 నుంచి 1000 కాలంలో మొదలైన ఖనన సంస్కృతి (మృతదేహాలను సమాధి చేసే సంస్కృతి) మన దేశంలో ఉంది, దక్కన్లో అయితే మరింత విస్తృతంగా ఉన్నది. ఈ మెగాలిథిక్ బరియల్ (పెద్ద రాళ్లతో ఏర్పాటుచేసే సమాధులు, రాకాసిగూళ్లు) నుంచే స్థూపం పుట్టిందని చరిత్రకారుల భావన. బౌద్ధంలో ఈ పద్ధతి స్తూప నిర్మాణరూపంలో మతపరమైన నిర్మాణరూపంగా మారింది. తెలంగాణ నిండా మనకు రాకాసి గూళ్లలో ఖననం చేసే సంస్కృతి ఉన్నందున బౌద్ధ స్తూప నిర్మాణం సులభంగా ఉనికిలోకి వచ్చి ఉంటుంది. వైదిక మతంలోని శైవ, లింగాయత్ వంటి శాఖల్లో, సూఫీ మతంలో కూడా గురువు పార్థ్థివదేహంపై కట్టిన సమాధులను పూజించే అలవాటుంది.
-డా. ఎం.ఏ. శ్రీనివాసన్ ,81069 35000