ఆధునిక భారత చరిత్రలో ప్రపంచ దృష్టిని ఆకర్షించిన ఉద్యమాల్లో మూడున్నాయి. వీటిలో హింసకు తావివ్వకుండా జరిగిన స్వాతంత్రోద్యమం ఒకటి. జాగీర్దారులు, భూస్వాములకు వ్యతిరేకంగా పేద స్త్రీ పురుషులంతా కలిసి చేసిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం మరొకటి. ఇదే కోవలో నీళ్లు, నిధులు, నియామకాల కోసం సీమాంధ్ర వలస పాలకులకు వ్యతిరేకంగా ప్రత్యేక తెలంగాణ సాధన కోసం సాగిన అహింసాయుత రాష్ట్ర పోరాట ఉద్యమం మరొకటి.
స్వాతంత్య్ర పోరాటం, తెలంగాణ సాయుధ రైతాంగ ఉద్యమాలు ప్రపంచ ఉద్యమ చరిత్రలో లిఖించే ఉన్నప్పటికీ, ఈ తరం ఆ ఉద్యమాలను ప్రత్యక్షంగా చూడలేదు. కానీ, కేసీఆర్ నేతృత్వంలో సాగిన సుదీర్ఘ పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొనని, పరోక్షంగానైనా సంబంధం లేని తెలంగాణ వ్యక్తి లేడంటే అతిశయోక్తి కాదు. అన్నివర్గాలు తెలంగాణ కోసం పోరాటాలు, త్యాగాలు చేశాయి. ఫలితమే తెలంగాణ రాష్ట్రం.
ఇంతటి మహోన్నత ఉద్యమ నేపథ్యం ఉండి తెలంగాణ రాష్ర్టాన్ని ప్రపంచపటంలో అగ్రస్థానంలో ఉంచిన ముఖ్యమంత్రి కేసీఆర్ను హేళన చేస్తూ జుగుప్సాకర రీతిలో సామాజిక మాధ్యమాల ద్వారా కొందరు నిందాపూర్వకంగా పోస్టులు పెడుతున్నారు. ఈ మధ్య కేసీఆర్ స్వల్ప అనారోగ్యంతో వైద్య చికిత్సలకు వెళ్లిన విషయాన్ని ప్రస్తావిస్తూ చేసే ట్రోలింగ్స్ అత్యంత దారుణంగా ఉన్నాయి. ఇవి ఎవరు పెడుతున్నారో, వీటివెనుక ఎవరున్నారో బహిరంగ రహస్యమే. ఈ పోస్టులు వచ్చే ఐపీ అడ్రస్ ఎక్కడో సౌతాఫ్రికా దేశాల నుంచి ఉంటున్నది. ఇదిలా ఉంటే, ప్రధాన రాజకీయపార్టీల అగ్రనాయకులమని చెప్పుకొనేవారు కూడా కేసీఆర్ అనారోగ్యాన్ని చులకనచేసి మాట్లాడటం గర్హనీయం.
ఒక వ్యక్తిని లేదా వ్యవస్థను నేరుగా ఢీకొనలేక, దొడ్డిదారిన కుయుక్తులతో తప్పుడు వార్తలు ప్రచారం చేయడం ద్వారా పైచేయి సాధించే యత్నాలు ఇటీవల ఎక్కువయ్యాయి. స్వతంత్ర భారత పునాదులను ముఖ్యంగా స్వాతంత్య్ర పోరాటాలను, త్యాగాలను తక్కువ చేస్తున్నారు, లేదా వక్రీకరిస్తున్నారు. అలాగే రాష్ట్ర సాధన కోసం చేసిన పోరాటాన్ని అపహాస్యం చేయడం ఒక పార్టీకి పరిపాటి అయ్యింది. ఇది ఎందాక పోయిందంటే, మహోన్నత నాయకులైన మహాత్మాగాంధీ, జవహర్లాల్ నెహ్రూ గురించి, వారి వ్యక్తిగత విషయాలపై అవమానకరరీతిలో పోస్టులు పెడుతున్నారు. ఈ వాట్సాప్ యూనివర్సిటీలు వాటిని సామాజిక మాధ్యమాల ద్వారా లక్షలాది మందికి పంపించే విష సంస్కృతి ఇటీవలికాలంలో ఎక్కువైంది. గాంధీ, నెహ్రూ హిందూ వ్యతిరేకులని, లేదా దేశ వ్యతిరేకులుగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతున్నది. దీనిలో భాగంగా తప్పుడు వీడియోలు సృష్టించి సామాన్యుల మెదళ్లలో విష బీజాలను నాటే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ను కూడా ఆయన జన్మస్థలం బీహార్ అనే స్థాయిలో ఒక ప్రధాన పార్టీ నాయకుడు బహిరంగంగానే అన్నాడు!
అదేవిధంగా ‘సమానత్వం’, సౌభ్రాతృత్వం’ అవహేళనకు గురవుతున్నాయి. ఒక వ్యక్తి కానీ, పార్టీ కానీ సెక్యులర్గా ప్రకటించుకోవడం దేశ వ్యతిరేక చర్యగా భావించే పరిస్థితిని ఒక పద్ధతి ప్రకారం కొన్ని వర్గాలు తీసుకువచ్చాయి. ప్రస్తుతం దేశంలో రామజన్మ భూమి, కాశీ పునర్నిర్మాణం, ఉమ్మడి పౌర స్మృతి తదితరాలే ముఖ్యమైనవిగా ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి విష, అబద్ధపు ప్రచారహోరులో దేశంలో నిరుద్యోగ సమస్య, పారిశ్రామీకరణ, పౌరులకు కనీస సౌకర్యాల కల్పన, ఆధునిక వ్యవసాయం తదితరాలు చర్చకు కూడా నోచుకోవటం లేదు. ఎల్ఐసీ, వైజాగ్ స్టీల్ ప్లాంట్ను అడ్డంగా అమ్ముతున్నా ప్రాధాన్యాంశాలు కావడం లేదు. ప్రజలను చిత్రమైన భ్రమల్లో ఉంచే సైద్ధాంతికదాడి జాతీయస్థాయిలో అమలవుతున్నది.
ఇలాంటి జాతి, ప్రజావ్యతిరేక చర్యల వల్ల దేశ సమైక్యత, సమగ్రతకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉన్నది. దీన్ని ఎదుర్కోవడానికి తెలంగాణ సమాజం సిద్ధంగా ఉండాలె. ఈ తప్పుడు ప్రచారాలను అడ్డుకోవడం ద్వారా తెలంగాణ మరోసారి దేశానికి మార్గదర్శకంగా నిలువాలె.
(వ్యాసకర్త: కె.వెంకటరమణ, 98499 05900, ప్రజా సంబంధాల అధికారి, జీహెచ్ఎంసీ)