ఈ నేల మీద అడుగు పెట్టిన తరువాత
రాత్రి పూట ఆకాశం ఆగ్రహంతో ఉరిమినపుడో
కార్చిచ్చు మా గూడుని కాల్చివేసినపుడో భయపడి
చెట్ల కొమ్మల్లో, రాళ్లల్లో భరోసానిచ్చే
దేవుడిని చూసుకుని దండం పెట్టుకున్నం
కొమ్మలూ రాళ్లూ మా అనాది దేవుళ్ళు
ఏ ఏటి వొడ్డునో నదీ తీరంలోనో నలుగురితో కూడి
గుడిసెలు వేసుకుని, కలిసి బతుకుతున్నపుడు
మా ప్రాణాలనూ పశువులనూ పంటలనూ కాపాడేది
అమ్మ తల్లులే అని దండం పెట్టుకున్నం
ముక్కల కూర అన్నమే అమ్మలకు మా నైవేద్యం
పోచమ్మలు, మైసమ్మలు, ఉప్పలమ్మలు…
మా ఆది దేవతలు
దు:ఖానికైనా, సంబురానికైనా
యెముడాల రాజన్నకు కోడెను ఇచ్చుకుంటం
అన్నారం షరీఫ్కు కందూరు చేస్తం
పుట్టు వెంట్రుకలకైనా, మొక్కుల చెల్లింపులకైనా
కొరివి వీరన్న, కొంరెల్లి మల్లన్న
యాదగిరి లక్ష్మీ నరసింహుడూ మా యిలవేల్పులు
కుల భేదం, లింగ భేదం లేనివాడే దేవుడని చాటి
పురాణం రచించిన ప్రజల కవి పుట్టిన నేల ఇది
భగవంతుడే పలికిన పదాలతో
మహాకవి భాగవతం విరచించిన నేల మాది
మనుషులను విడదీసే మాయారూపం కాదు
కలిపి వుంచే కరుణా స్వరూపమే దైవమని
తరాలుగా విశ్వసించిన వాళ్లం
మా అనాది విశ్వాసాల మీద మళ్లా
ఎవరెవరో ఇటుకలు తెచ్చి పేరుస్తున్నారు
మా పురా దేవుళ్లనూ దేవతలనూ తెర మరుగు చేసి
ఈ దేవుడిని కొత్త రూపంలో తెర మీదకు తెచ్చారు
ఒక దేశం, ఒకే పన్ను అంటే భరించాం గానీ
ఒకే భాష, చివరికి ఒకే దేవుడంటే ఎట్ల?
దేవుడంటే కరుణ కురిసే చూపులూ
బతుకులకు భరోసానిచ్చే చేతులు గదా
చలువ పందిళ్లలో మంగళ వాయిద్యాల నడుమ
వడపప్పు పానకంలా చల్లబుచ్చే దివ్యరూపం గదా
ఈ దేవుడు యుద్ధానికి సిద్ధమైన గంభీర రూపంతో
ఎందుకు కనిపిస్తున్నాడో… ఎవరైనా చెప్పగలరా?
విపణి ఆకాశం ధరల పిడుగులు కురిపిస్తున్నపుడు
నానా తిప్పలు పడి నాలుగు రూపాయల కోసం
బతకడమే భయానక యుద్ధమైన రోజుల్లో
ఈ కొత్త యుద్ధం ఎవరి మీద ఎవరు చేయవలసినదో
ఎవరైనా కాస్త వివరించగలరా..?
-కోడూరి విజయకుమార్ , kodurivijay@gmail.com