నూతన వ్యవసాయ చట్టాలను అమలుచేయటానికి కేంద్రం ఏకపక్షంగా తీసుకొన్న నిర్ణయాన్ని దేశంలోని రైతాంగం వ్యతిరేకించింది. కార్పొరేట్ శక్తులకు లాభం చేకూర్చేవిధంగా కొత్త చట్టాలను రూపొందించారంటూ నిరసనోద్యమానికి దిగింది. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఏడాదికాలం పాటు ఆ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమించింది. దేశ రాజధాని ఢిల్లీ సరిహ ద్దుల్లో చలికి, ఎండకు, వానకు జడవకుండా, భయంకరమైన కరోనా రక్కసిని లెక్కచేయకుండా ప్రాణాలకు తెగించి రైతులు పోరాడారు. ఆ మహోద్యమంలో వంద ల మంది రైతులు అమరుల య్యారు. జరగా ల్సిన ఘోరం జరిగాక ప్రధాని మోదీ రైతులకు క్షమాపణలు చెప్పి ఆ నల్ల చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. కానీ.. ఆ తర్వాత కూడా రైతుల సమస్యల పట్ల ఆయన తీరు మారలేదు. కనీస మద్దతు ధర, ఎరువులు, పురుగు మందులను సబ్సిడీపై అందించటం లేదు. ఇదిలా ఉంటే వ్యవసాయ బావుల వద్ద విద్యుత్ మీటర్లను పెట్టాలని రాష్ర్టాలపై ఒత్తిడి తెస్తున్నారు. ఇలాంటి విధానాలు మోదీకి గల రైతు వ్యతిరేకతను చెప్పకనే చెప్తున్నాయి.
ఉద్యమ సమయంలో అసువులు బాసిన రైతు కుటుంబాలకు కనీసం సానుభూతి తెలుపలేదు. చనిపోయిన రైతు కుటుంబాలకు ఆర్థికసాయం అందించలేమని కేంద్రం నిక్కచ్చిగా తేల్చిచెప్పింది. ఆందోళన చేస్తున్న రైతులపైకి కారు నడిపించి ప్రాణాలు తీసినా కంటితుడుపు చర్యలే తప్ప, కఠిన చర్యలు తీసుకోలేదు. ఈ పరిస్థితుల్లో రైతుల పక్షాన నేనున్నానంటూ.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ముందడుగు వేయటం హర్షణీయం. రైతు ఉద్యమంలో, దేశ రక్షణలో ప్రాణాలు వదిలిన సైనికుల కుటుంబాలను స్వయం గా కలిసి బాసటగా ఉంటానని ఆర్థికసాయంతో భరోసా ఇవ్వటం ముదావహం. సీఎం కేసీఆర్ చూపిన ఔదార్యానికి తెలంగాణ ప్రజలు గర్వపడుతున్నారు. అలాగే.. రైతుల సమస్యల పరిష్కారం కోసం, కనీస మద్దతు ధర సాధించే వరకూ రైతులపక్షాన నిలిచి పోరాడుతానని ప్రకటించటాన్ని రైతుల పక్షాన ఆహ్వానిస్తున్నాం. అన్నివిధాలా అండగా నిలుస్తామని, కేసీఆర్ బాటలో నడుస్తామని ఈ సందర్భంగా ప్రకటిస్తున్నాం.
-పాకాల శ్రీహరిరావు, 93475 80252 , తెలంగాణ రైతు రక్షణ సమితి అధ్యక్షులు