కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ను ఎదుర్కోవడంలో టెస్టింగ్, ట్రీట్మెంట్, వ్యాక్సినేషన్ ముఖ్యమైనవని శాస్త్రవేత్తలు, వైద్యులు చెబుతున్నారు. కానీ ఈ మూడింటి విషయంలో మన దేశం ఎంత వరకు సంసిద్ధంగా ఉన్నదనే ప్రశ్న తలెత్తుతున్నది. మనం వాస్తవికంగా ఆలోచించి మన వైఫల్యాలను అంగీకరించగలిగితే, భవిష్యత్తులో ఇటువంటి ఇబ్బందులు పునరావృతం కావు.
కేంద్ర ప్రభుత్వానికి తగిన ముందుచూపు లేకుండా హటాత్ నిర్ణయాలు తీసుకోవడం అలవాటే. గతంలో ఏ మాత్రం ముందు ఏర్పాట్లు లేకుండా పెద్ద నోట్లను రద్దు చేయడం జరిగింది. జీఎస్టీ అమలు కూడా అస్తవ్యస్థంగానే మారింది. ఇప్పుడు 18 ఏండ్లకు పైబడిన వారికి వ్యాక్సిన్ వేస్తామని ప్రకటించడం కూడా అలాంటిదే. మే 1 నుంచి మన దేశంలో వ్యాక్సిన్లకు కొరత ఏర్పడటంతో పాటు తీవ్ర గందరగోళం తలెత్తవచ్చు.
మన దేశంలో రోజుకు సుమారు 17 లక్షల టెస్టులను (రాపిడ్, ఆర్టీపీసీఆర్) మాత్ర మే చేయగలుగుతున్నాం. ఇందులో రోజుకు సుమా రు 3.5 లక్షల మంది కరోనా పాజిటివ్ అని నిర్ధారణ జరుగుతున్నది. అంటే టెస్టు చేయించుకున్న వారిలో 20.5 శాతానికి పైగా కరోనా రోగులున్నారని అర్థం చేసుకోవచ్చు. మన దేశంలో రోజుకు సుమారు 17 లక్షల రాపిడ్ టెస్టు కిట్లు ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉన్న ది. అలాగే సుమారు 8 లక్షల ఆర్టీపీసీఆర్ టెస్టు కిట్లు ఉత్పత్తి చేయగలం. అంటే మన దేశంలో రోజు కు 25 లక్షలకు మించి పరీక్షలు చేయడం సాధ్యం కా దు. 136 కోట్ల జనాభా ఉన్న భారతావనిలో మనం రోజుకు చేస్తున్నది 17 లక్షల పరీక్షలు మాత్రమే.
వ్యాక్సినేషన్ విషయానికి వస్తే మన దేశంలో సుమారు 100 రోజుల్లో 45 ఏండ్లకు పైబడిన వారిలో సుమారు 15 కోట్ల మందికి టీకా ఇవ్వగలిగాం. 45 ఏండ్లకు పైబడిన వారు 35 కోట్ల పైన ఉండగా 100 రోజుల్లో కేవలం 40 శాతం మందికి కూడా టీకా ఇవ్వలేకపోయామనేది గణాంకాలు తెలియజేస్తున్న సత్యం. ఇప్పుడు మే 1వ తేదీ నుంచి 18 ఏండ్లకు పైబడిన వారికి కూడా వ్యాక్సిన్ వేయాలని కేంద్రం నిర్ణయించింది. 18-45 మధ్య వయసున్న వాళ్లు మన దేశంలో సుమారు 55 కోట్ల మంది ఉన్నారు. అంటే ఇప్పటికే 45ఏండ్లకు పైబడి వ్యాక్సి న్ వేయనివారు 20 కోట్ల మంది ఉన్నారు. ఇందుకు అదనంగా వ్యాక్సిన్ వేయవలసిన వారు మరో 55 కోట్ల మంది వచ్చిచేరుతారు. అంటే 75 కోట్ల మంది కి వ్యాక్సిన్ చేయవల్సి ఉంటుంది. మరి అంతమేర వ్యాక్సిన్ ఉత్పత్తికి ఏర్పాట్లు చేసుకున్నామా? మన దేశంలో రోజుకు సుమారు 20-22 లక్షల వాక్సిన్లు మాత్రమే ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంది.
ఈ ఉత్పత్తిని రెట్టింపు చేసుకున్నా18 ఏండ్లకు పైబడిన 75 కోట్ల మందికి వ్యాక్సిన్ వేయడానికి సుమారు 8 నెలల నుంచి 14 నెలల సమయం పట్టొచ్చు. సాధారణ పరిస్థితుల్లో ఇది ఎక్కువ సమయమేమీ కాదు. కానీ కాలంతో పరుగులు పెట్టవలసిన ఇప్పటి విషమ పరిస్థితుల్లో ప్రజలకు అతి వేగంగా వ్యాక్సినేషన్ జరిపించాలి. 18 ఏండ్లకు పై బడిన వారికి కూడా వ్యాక్సినేషన్ చేయించాలనే నిర్ణయం తీసుకున్నప్పుడు, ముందుగా సమాయత్తం కాకపోవడం ఆశ్చర్యకరం.
కేంద్రం 2021-22 బడ్జెట్లో వ్యాక్సినేషన్ కోసం రూ.35 వేల కోట్లు కేటాయించింది. ఈ నిధులతో 100 కోట్ల మందికి వ్యాక్సిన్ వేయవచ్చు. మన దేశ జనాభాలో 18 ఏండ్లకు పైబడిన వారు 90 కోట్లు. దేశం మొత్తం జనాభాకు ఉచితంగా కేంద్రం వాక్సిన్ వేయించే అవకాశం ఉన్నప్పటికీ ఎందుకు మూడు రకాల రేట్లు పెట్టే వెసులుబాటును కార్పొరేట్ కంపెనీలకు కల్పించినట్టు?
2020-21 ఆర్థిక సర్వే ప్రకారం ఆరోగ్యశాఖ బడ్జెట్ కేటాయింపుల్లో భారతదేశం (189 దేశాల్లో) 179వ స్థానంలో ఉన్నది. దేశ జీడీపీలో ఆరోగ్య శాఖకు కేటాయింపులు 1.1 శాతం మాత్రమే ఉన్నాయి. 2015-16 లో కేటాయింపు ఇంకా తక్కువగా 0.9 శాతంగా ఉన్నది. అయితే 2017లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నేషనల్ హెల్త్ పాలసీని అనుసరించి ఆరోగ్య శాఖ కేటాయింపులు జీడీపీలో 2.5 శాతం ఉండాలి. 2025 వరకు ఈ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఇప్పుడు కరోనా వంటి కష్టకాలంలో కూడా కేటాయింపు 1.1 శాతం మాత్రమే ఉండటాన్ని బట్టి చూస్తే, కేంద్ర ప్రభుత్వం తాను నిర్దేశించుకున్న మేర కూడా కేటాయించడం లేదని స్పష్టమవుతున్నది.
ఆరోగ్యశాఖకు ఇంత అతితక్కువ కేటాయింపులతో కేంద్రం కరోనాపై సమర్థవంతంగా యుద్ధం చేయగలదా? ఆరోగ్యశాఖకు అతి తక్కువగా నిధులు కేటాయించడం వల్లనే మన దేశంలో ఇప్పుడు ఔషధాలకు, ఆక్సీజన్, వెంటిలేటర్స్, బెడ్స్ మొదలైన వాటికి తీవ్ర కొరత ఏర్పడుతున్నది. ఒక వ్యక్తికి విరోచనాలైతే ఏ విధంగానైతే ఎటువంటి పరీక్షలు లేకుండా వైద్యులు తక్షణం చికిత్స చేస్తారో, అదే విధంగా లక్షణాల ఆధారంగా కరోనా చికిత్సను టెస్టులకు ముందే చేస్తే, అనేక మంది రోగుల ప్రాణాలను కాపాడవచ్చు.
తెలంగాణ పరిస్థితి: తెలంగాణ ఏర్పాటైన వెంటనే వైద్య మౌలిక వసతుల కల్పనకు ముఖ్యమంత్రి కేసీఆర్ చర్యలు తీసుకున్నారు. ప్రభుత్వ దవాఖానలపై ప్రజలకు నమ్మకం కలిగించడం గొప్ప విషయం. మొదటి ఆరేండ్లలోనే కొత్తగా నాలుగు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, 43 డయాలసిస్ సెంటర్లు, 30 ఐసీయూ సెంటర్లు జిల్లాలలో ఏర్పాటు చేశారు. తెలంగాణ ఏర్పాటుకు ముందుతో పోలిస్తే ఇప్పుడు వైద్యవ్యవస్థ ఎంత మెరుగ్గా ఉన్నదో తెలుస్తుంది. తెలంగాణ ఏర్పడక ముందు ఆక్సీజన్ బెడ్లు 254 ఉంటే, ఇప్పుడు 11,758కి పెంచారు. వెంటిలేటర్ బెడ్స్ 100 ఉండగా ఇప్పుడు 1484 చేరుకున్నాయి.
గతంలో హాస్పిటల్ బెడ్స్ 17,130 ఉండేవి. ఇప్పుడు వాటి సంఖ్య 23,450. ఇంతేకాకుండా కరోనా పరిస్థితిని ఎదుర్కొనడానికి ప్రత్యేకంగా 1200 బెడ్స్తో ‘టిమ్స్’ హాస్పిటల్ను ప్రభుత్వం ఏర్పాటుచేసింది. అంటే కరోనా పరిస్థితిని ప్రాతిపదికగా చేసుకొని దీర్ఘకాలికంగా మౌలిక
వసతులను పటిష్టపరుస్తున్నది.
కరోనాకు ముందే వైద్య ఆరోగ్య వ్యవస్థను పటిష్టపరచడం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. అందువల్లనే ఇతర రాష్ర్టాలతో పోలిస్తే కరోనాను తెలంగాణ మెరుగ్గా ఎదుర్కోగలుగుతున్నది. ప్రభుత్వ కృషికి తోడుగా ప్రజలు కూడా కొంత బాధ్యతగా వ్యవహరించాలి. మాస్క్, శానిటైజర్ను తప్పకుండా వాడాలి. భౌతికదూరం పాటించాలి. ప్రజలు జాగ్రత్తగా ఉంటే తక్కువ నష్టంతో బయటపడుతాం.