రాజ్యాంగబద్ధ గవర్నర్ పదవిలో ఉన్నవారు నిష్పాక్షికంగా వ్యవహరించాలి. ఎలాంటి రాజకీయ జోక్యం లేకుండా ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. గవర్నర్గా నియమితులయ్యేవారు నిజాయితీపరులై, రాజ్యాంగం తెలిసిన మేధావులై ఉండాలి. దురదృష్ట వశాత్తు కేంద్ర ప్రభుత్వాలు తమ స్వార్థ ప్రయోజనాలు నెరవేర్చే సంకుచిత స్వభావులను గవర్నర్లుగా నియమిస్తున్నాయి. వీళ్లు నిరంతరం రాష్ట్ర ప్రభుత్వాలను అస్థిరపరిచే చర్యలకు దిగుతూ.. రాజ్యాంగానికే కళంకం తెస్తున్నారు. సమాఖ్యస్ఫూర్తిని విచ్ఛిన్నం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలను పడగొడుతూ, కేంద్రంలో ఉన్న అధికారపార్టీని రాష్ట్ర అధికార పీఠాలపై కూర్చోబెట్టడానికి అన్ని విలువలకు తిలోదకాలిస్తున్నారు.
ప్రజలను మతపరంగా, భాషాపరం గా, ప్రాంతీయ పరంగా విభజిస్తూ, హింసను సృష్టిస్తూ అధికారం చేజిక్కించుకోవాలనుకునే ఆర్ఎస్ఎస్ భావజాలం నుంచి వచ్చిన గవర్నర్ తమిళిసై తెలుగు, తమిళ ప్రజల మధ్య చిచ్చుపెట్టే కుట్రలకు దిగుతున్నా రు. ‘ఇంట్లో తెలుగు మాట్లాడుతూ తమిళులం అని చెప్పుకొంటున్నా’రని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కుటుంబాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ.. తమిళిసై తన విద్రోహ రాజకీయ ఆలోచనను బయటపెట్టుకున్నారు. తాను తిరుక్కురల్ (తమిళ సాహిత్యచరిత్రలో ఒక ఇతిహాసం)ను తెలంగాణ అసెంబ్లీలో ధైర్యంగా మాట్లాడానని తన భాష దురహంకారాన్ని ప్రదర్శించారు. గవర్నర్గా తాను అన్ని భాషలను సమానంగా గౌరవించాలన్న ఇంగితం లేకుండా ప్రవర్తించారు. అంతేకాకుండా తెలంగాణలో మూడేండ్లుగా పత్రికా కథనాలను పరిశోధించాలనీ, అందులో తాను ప్రభుత్వాన్ని ప్రశ్నించిన తీరు, సమస్యలపై తెలంగాణ ప్రభుత్వాన్ని నిలదీసిన తీరు అర్థమవుతుందని తమిళిసై ఒకటే డబ్బా కొట్టుకుంటున్నారు. నిత్యం రాజకీయ ప్రకటనలు చేస్తూ, రాష్ట్ర ప్రభుత్వంపై ఫిర్యాదులు చేస్తూ గవర్నర్ గౌరవాన్ని దిగజార్చుతున్న తమిళిసైని వెంటనే పదవి నుంచి తొలగించాలి.
బాపు కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అన్నిరంగాల్లో అభివృద్ధి సాధిస్తున్నది. దేశంలో ఎక్కడా లేనివిధంగా మన ప్రభుత్వం అద్భుత ప్రజా సంక్షేమ పథకాలు అమలుచేస్తున్నది. తెలంగాణ ప్రజలు సుభిక్షంగా ఉంటే తమ ఆటలు సాగవనుకున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గవర్నర్ ద్వారా మన ప్రభుత్వానికి అనేక ఇబ్బందులు సృష్టిస్తున్నది. చీటికిమాటికి పాలనలో జోక్యం చేసుకుంటూ చికాకు పరుస్తున్నది. బీజేపీకి అనుకూలంగా పనిచేస్తూ రాజ్యాంగస్ఫూర్తికి విఘాతం కలిగిస్తున్న గవర్నర్ తమిళిసై చర్యలను ఎండగట్టాలి.
‘గవర్నర్ తమిళిసై గారూ! తమరు తెలంగాణ నేలపై జీవిస్తూ, తెలంగాణ ప్రజల సంపదను జీతంగా పొందుతూ, ఇక్కడి తిండి తింటూ, ఇక్కడి నీరు తాగుతూ, ఇక్కడి గాలి పీలుస్తూ తమిళ భాష మాట్లాడొచ్చు.. కానీ, స్టాలిన్ మాత్రం తెలుగు మాట్లాడకూడదు. మీకొక నీతి, స్టాలిన్కు మరొక నీతా? మీకు స్టాలిన్ను విమర్శించే హక్కున్నదా? మీ గురివింద నీతిని తెలంగాణ ప్రజలు సహించరు. తెలుగు, తమిళ ప్రజల మధ్య చిచ్చుపెట్టే కుట్రలకు తెరలేపిన మీరు గవర్నర్గా కొనసాగే అర్హతను కోల్పోయారు. తక్షణమే రాజీనామా చేసి వెళ్ళిపోవాల’ని హెచ్చరిస్తున్నాం.
ప్రప్రథమంగా మనమంతా భారతీయులం. భాషాపరంగా దక్షిణ ప్రాంతం వాళ్ళం. తెలుగువారు, తమిళులు, కన్నడిగులు, మలయాళీలని పిలువబడుతున్నాం. అంత మాత్రం చేత ఒకరి భాషను మరొకరు మాట్లాడగూడదనే నియమమేమీ లేదు. పైగా అలా మాట్లాడుకోవడం ఇతర భాషలను గౌరవించడమే.
ప్రపంచ మహాసభల సందర్భంగా 1975 లో భారత ప్రభుత్వం సంగీత విద్వాంసులు త్యాగయ్య తపాలా బిళ్లను విడుదల చేసింది. త్యాగయ్య తెలుగువాడనే విషయం విజ్ఞులందరికీ తెలుసు. నేటికి అరవ సంగీత విద్వాంసులు ప్రముఖంగా పాడుకునే త్యాగరాజు కీర్తనలు తెలుగు సాహిత్యమే. తెలియనివారి మూర్ఖత్వానికి జాలిపడటం తప్ప చేయగలిగిందేమీ లేదు. భాషాభేదాలు, మత వైషమ్యాలు, కులకుత్సితాలు, వర్ణ, వర్గ వ్యత్యాసాలు వగైరాలు పాటించడం రాజ్యాంగరీత్యా నేరం.
తెలుగుకు సుమారు 2 వేల ఏండ్ల చరిత్ర, సాహిత్యానికి వెయ్యేండ్లకు పైబడిన చరిత్ర ఉన్నది కనుకనే ప్రాచీనభాషగా గుర్తింపు పొందిన విషయం జగద్విదితం. తన గీతి యరవ జాతి పాటకులనుగా (సంగీత కారులుగా)దిద్ది వర్ధిల్లిన తెనుగు వాణి అంటారు రాయప్రోలు వారు.
ఎంతోమంది భారతీయులు అమెరికా, ఇం గ్లండ్ వంటి ఇతర దేశాల్లో స్థిరనివాసం ఏర్పర్చుకొని అక్కడి పౌరులుగా గుర్తింపు పొం ది, అక్కడి పరిపాలనావ్యవస్థలో భాగస్వాములవుతున్న సంగతి అందరికీ తెలుసు. వారు ఇంట్లో తమ భాష, వ్యవహారంలో అధికార భాష మాట్లాడటం కూడా తెలియని విషయ మేం కాదు. అది దోషం అంతకన్నా కాదు.
అలాంటప్పుడు, ఇంట్లో తెలుగు మాట్లాడుతూ తమిళులుగా చెలామణి అవుతున్నారని ఒకరిని నిందించడం లేదా తప్పుపట్టడం అజ్ఞానానికి పరాకాష్ఠ. అలాంటివారు ఉన్నత పదవుల్లో ఉన్నారంటే వారిది కాదు, వారిని ఆ పదవుల్లో కూర్చోబెట్టినవారిది తప్పు. అం దుచేత, అలాంటి చీడ పీడ నివారణార్థం అం దరం మూకుమ్మడిగా ఉద్యమించి, సమాజానికి, శాంతి సుస్థిరతలకు భంగం వాటిల్ల్లకముందే అలాంటి అవివేకులకు, అజ్ఞానులకు, కుటిల కపట స్వభావులకు పలాయనమంత్రం ఉపదేశించి సత్వరం వారిని వారి సొంత గూటికి పంపించడం తక్షణ కర్తవ్యం.
తెలుగదేల యన్న దేశంబు తెలుగేను
తెలుగు వల్లభుండ, తెలుగొకండ
నెల్ల నృపులు గొల్వ యెరుగవే బాసాడి,
దేశభాషలందు తెలుగు లెస్స..
అని తెలుగును కీర్తించిన కృష్ణరాయలు తుళును మరిచాడా.. తెలుగును విడిచాడా?సుందర తెలుంగు అని కితాబునిచ్చిన తమిళ కవి సుబ్రహ్మణ్య భారతికి మీ అంత విజ్ఞత, వివేకం లేదా?(వ్యాసకర్త: రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షురాలు)
-మంత్రి శ్రీదేవి