‘భారత ఆర్థిక వ్యవస్థకు ప్రధాన కేంద్రం భూమి. భూమి వర్తమానం, విద్య భవిష్యత్. అణగారినవర్గాల దృష్టికోణంలో భూమి కేవలం జీవనాధార వనరు మాత్రమే కాదు, కోల్పోయిన గుర్తింపును, ఆత్మగౌరవాన్ని నిలబెట్టే ఆధారం.’ – అంబేద్కర్.
దేశంలోని అత్యంత పురోగామి తాత్వికుడు అంబేద్కర్. సామాజికరంగాల్లో దేశ ఉన్నతికి కృషిచేసిన వ్యక్తి అంబేద్కర్. ఆయన ధన్యజీవుల వారసత్వాన్ని స్వీకరించి, అత్యంత వివక్ష, అవరోధాల మధ్య, కఠినమైన శారీరక, మేధో పరిశ్రమతో, సంఘర్షణాత్మక దృక్పథంతో, పీడిత ప్రజలకు విముక్తి మార్గాన్ని ప్రసాదించారు. ఆధునిక భారతంలో జరిగిన రాజకీయ సామాజిక, ఆర్థికరంగాల్లో విప్లవాత్మక మార్పులు తేవడంలో అసాధారణమైన కృషిచేశారు.
భారత వ్యవసాయ పారిశ్రామిక అభివృద్ధికి అంబేద్కర్ లోతైన అధ్యయనంతో విలువైన సూచనలు చేశారు. సామాజిక అభివృద్ధికి భూ సంస్కరణల అమలు అవశ్యమైనదిగా భావించారు. పెట్టుబడిదారి వ్యవస్థ సృష్టించే అసమానతలు రాజ్యాంగ ఔన్నత్యానికి ప్రమాదకరమని తెలియజేశారు. 1915లో ప్రాచీన భారత వాణిజ్యం, బ్రిటిష్ ఇండియాలో ప్రాంతీయ ఆర్థిక వికాసాలపై పరిశోధనలను చేసి, కొలంబియా విశ్వవిద్యాలయం నుంచి ఆర్థికశాస్త్రంలో డాక్టరేట్ అందుకున్నారు. తన పరిశోధనల్లో బ్రిటిష్ విధానాలను విమర్శిస్తూ వాటివల్ల ఇండియాలో ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయని, భూమి శిస్తు అధికంగా ఉండి, రైతులపై పెనుభారాన్ని కలిగిస్తుందన్నారు. అధికారులు, వ్యాపారులపై ఎలాంటి పన్నులు వసూలు చేయడం లేదని, ప్రభుత్వ రాబడుల్లో 80 శాతం రక్షణ, న్యాయపాలనపై వ్యయం చేస్తున్నారని ప్రజల ప్రగతికి తొడ్పడే మౌళిక రంగాలైన వ్యవసాయం, నీటి పారుదలను నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు.
వ్యవసాయాన్ని తక్కువ ఉత్పాదకతను కలిగి ఎక్కువమంది ఆధారపడినరంగంగా అంబేద్కర్ గుర్తించారు. దేశ వ్యవసాయరంగంలో చిన్న కమతాల వల్ల వ్యవసాయ ఉత్పాదకత తక్కువగా ఉంటుందని, దానికి పరిష్కారం కమతాల సమీకరణ అనే వాదాన్ని ప్రతిపాదించారు. 1928లో అంబేద్కర్ ‘ఇండియాలో చిన్న కమతాలు – పరిష్కారాలు’ అనే రచనలో పెట్టుబడి, ఉత్పత్తి సాధనాలను సరైన పాళ్ళలో ఉపయోగిస్తే గరిష్ఠ ప్రతిఫలం, రాబడి ఉంటాయన్నారు. పెట్టుబడులకు మించిన రాబడులు వస్తే, అది లాభసాటి కమతమవుతుందని చెప్పారు. సరైన పెట్టుబడి, శ్రామికులు తగిన సంఖ్యలో లేకపోతే పెద్ద కమతాలు కూడా గిట్టుబాటు కావని తెలియజేశారు.
1916లో ‘సౌత్ బరో కమిటీ’కి భూ సంస్కరణలను అమలుచేయాలని అంబేద్కర్ విజ్ఞాపన అందించారు. 1936లో మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో చిప్లుణ్లో వేలాదిమంది రైతులతో సభను నిర్వహించి ప్రభుత్వాన్ని మెడలు వంచి వడ్డీ వ్యాపారస్తుల నుంచి రక్షణ కోసం బాంబే మనీ లెండర్ చట్టం, కోథి అనే జమిందారీ వ్యవస్థ రద్దు చట్టాలను తీసుకొచ్చారు.
1927, అక్టోబర్ 10న బొంబాయి శాసనమండలిలో మాట్లాడుతూ భారతదేశంలో సాధారణ జీవన ప్రమాణాన్ని పెంచాలంటే వ్యవసాయం నుంచి కొంతమంది శ్రామికులను పరిశ్రమల వైపు మళ్లించాలని సూచించారు. ఫలితంగా ఈ రెండు రంగాల్లో అధిక ఉత్పాదకత సాధ్యమవుతుందని వ్యవసాయంలో మిగులు ఉంటే పొదుపుగా మారుతుందని అదే పెట్టుబడిగా ఉపయోగపడుతుందని కానీ భారత వ్యవసాయరంగంలో మిగులు అనేది ఉండటం లేదన్నారు. 1860 నుంచి 1910 వరకు వరుస కరువు కాటకాలతో వ్యవసాయం తీవ్ర సంక్షోభంలో ఉందని చెప్పి, భూమిని ప్రభుత్వ యాజమాన్యంలో ఉంచి సమష్టి, సహకార, పర్యావరణ అనుకూల సుస్థిర వ్యవసాయ పద్ధతిని అనుసరించాలని సూచించారు. వ్యవసాయానికి కావలసిన మూలధనాన్ని ప్రభుత్వం సమకూర్చాలి. వచ్చిన ఆదాయాన్ని వారి వాటాలకు అనుగుణంగా పంచాలి. దీనివల్ల నిరుపేదలకు ఉపాధి భద్రత, విద్య కనీస ఆదాయాలు లభించి గ్రామీణ పేదరికం, సంపద, ఆదాయాల పంపిణీ లో అసమానతల సమస్యకు కూడా పరిష్కారం లభిస్తుందన్నారు.
మౌలిక పరిశ్రమలను రాజ్యం నిర్వహించినప్పుడు వచ్చే మిగులును ప్రజల ప్రయోజనాలకు ఉపయోగిస్తుంది. వ్యవసాయంపై ఆధారపడిన జనాభా భద్రతకు పంటల బీమా పథకాన్ని అమ లుచేయాలన్నారు. తద్వారా దేశంలోని గ్రామీణుల బతుకులను మెరుగుపరచడంలో, కరువు కాటకాల భయానక పరిస్థితులను తగ్గించడంలో ప్రగతి సాధించవచ్చునని తెలియజేశారు. భూసేకరణలో నష్టపరిహారాన్ని చాలా ఉదారంగా చెల్లించాలని అంబేద్కర్ ప్రతిపాదించారు. కానీ, 2014 నుంచి కేంద్ర పాలకులు అమలు జరుపుతున్న కార్పొరేట్ విధానాలు రాజ్యాంగస్ఫూర్తికి విరుద్ధం. అనేక పంటలకు కనీసం మద్దతు ధర ప్రకటించకపోవడం, పంటల సేకరణలో వైఫల్యంతో వ్యవసాయరంగం తీవ్ర సంక్షోభంలోకి కూరుకుపోయింది. భూ సేకరణ పరిహార చట్టాన్ని బలహీనం చేసి కారుచౌకగా రైతులు భూములు కాజేసుకుంటున్నారు.
అంబేద్కర్ సూచించిన సంక్షేమ రాజ్య విధానాలు దీపస్తంభంగా పాలకులు పనిచేయాలి. అంబేద్కర్ ప్రతిచోట పిడుగులు కురిపించారు. తన ప్రజల ఉద్ధారకుడిగా కీర్తించబడ్డారు. భూ గర్భం నుంచి పైకెగిసి భూమినే అంటిపెట్టుకున్న మనిషి, అసాధారణ శక్తి, అద్భుత వివేకం, కార్యదీక్ష, ధైర్యం ఆయన్ను భారత దేశానికి నిజమైన నాయకుడిగా నిలిపాయి. ‘సమాజానికి తిరిగి చెల్లించు’ అనే భావనతో పనిచేయటమే అంబేద్కర్కు మనం ఇచ్చే ఘన నివాళి.
(వ్యాసకర్త: అస్నాల శ్రీనివాస్, 96522 75560, తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం కార్యదర్శి)