తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో బాలారిష్టాలను అధిగమించి అన్ని రంగాల్లో దేశంలోనే అత్యంత శక్తివంతమైన రాష్ట్రంగా అవతరించనున్న తరుణంలో నవంబర్ ముప్పైన రాష్ట్ర శాసనసభకు జరగబోయే ఎన్నికలు రాష్ర్టానికి అత్యంత కీలకమైనవి. ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా ప్రజలకు, రాష్ర్టానికి ఇంతవరకు మేలుచేసిందెవరు? భవిష్యత్తులో ఎవరు చేస్తారో? క్షుణ్ణంగా పరిశీలించి వారికి ఈ ఎన్నికల్లో తమ ఓటు వేయవలసిన ఆవశ్యకత తెలంగాణ రాష్ట్ర ప్రజలపై ఉన్నది.
Telangana | ఢిల్లీకి చెందిన కాంగ్రెస్ , బీజేపీ నాయకులు, ఢిల్లీ దూతలు కర్ణాటక, గుజరాత్ నోట్ల కట్టలతో ప్రజలను మభ్యపెట్టేందుకు ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలోని గల్లీలను చుట్టుముట్టినట్లు అనేక వార్తలు ప్రజలలో బలంగా వినిపిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ తెలంగాణ రాష్ట్రంలో కోట్లాది రూపాయలు పట్టుబడుతుండడంతో ఈ వార్తలను ప్రజలు విశ్వసించే పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా ప్రజలను కులాలు, మతాలు, ప్రాంతాల వారీగా విభజించి తాము లబ్ధి పొం దాలని భావిస్తున్నట్టు కాంగ్రెస్, బీజేపీలు ప్రజలకు ఇస్తున్న హామీలు, ఆ పార్టీలు గతానికి భిన్నంగా కేటాయిస్తున్న సీట్లు తేటతెల్లం చేస్తున్నాయి. రాష్ట్రంలో యాభైనాలుగు శాతం ఉన్న బీసీల ఓట్లను పొందేందుకు కాంగ్రెస్, బీజేపీలు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. కానీ బీసీలకు టికెట్ల కేటాయింపుల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా విఫలమయ్యింది. టికెట్ల కేటాయింపు విషయంలో బీసీలకు ఇచ్చిన మాటను విస్మరించడం కాంగ్రెస్ పార్టీకి కొత్తేమీ కాదు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి పదకొండు పర్యాయాలు అవకాశం వస్తే ఆ సమయంలో ఒక్క పర్యా యం కూడా బీసీ వ్యక్తికి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి పద వి కేటాయించలేదు. ఏడు పర్యాయాలు ఒక్క రెడ్డి సామాజిక వర్గానికే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా అవకాశాలు కల్పించింది. కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో ఎక్కడా బీసీ జనగణన చేసిన దాఖలాలు లేవు. తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు అధిక సీట్లు కేటాయించడంతో పాటు బీసీ అభ్యర్థికి ముఖ్యమంత్రి పదవి కేటాయిస్తున్నట్టు బీజేపీ ఇటీవల ప్రకటించింది. కానీ అదే బీజేపీ మొన్నటి వరకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షునిగా ఉన్న బీసీ నేత బండి సంజయ్ను తొలగించి, ఆస్థానంలో అగ్ర వర్ణానికి చెందిన కేంద్ర మంత్రి కిషన్రెడ్డిని నియమించింది. అదేవిధంగా బీసీ జనగణన చేయకుండా, కేంద్రంలో బీసీలకు మంత్రిత్వశాఖ కేటాయించకుండా, బీసీలకు చట్టసభల్లో , మహిళా బిల్లులో రిజర్వేషన్లు కల్పించకుండా బీజేపీ కాలయాపన చేస్తూ ఉన్నది. ఈ పరిణామాల దృష్ట్యా కాంగ్రెస్, బీజేపీలను ఎలా నమ్మాలనేది బీసీలలో మెదలుతున్న మిలియన్ డాలర్ల ప్రశ్న. గత తొమ్మిదిన్నరేండ్లుగా దేశాన్ని పరిపాలిస్తున్న ఎన్డీఏ ప్రభుత్వంలో గ్యాస్, పెట్రోల్, డీజిల్, నిత్యావసర వస్తువుల ధరలు మూడింతలు పెరిగాయి. దీంతో పేద, మధ్యతరగతి ప్రజల జీవన ప్రమాణాలు మరింత దిగజారాయి. అధిక ధరలు అరికట్టవలసిన కేంద్రం ధరల పెరుగుదల నెపాన్ని రాష్ట్ర ప్రభుత్వాలపై నెట్టివేసి చేతులు దులుపుకోవడం దురదృష్టకరం.
తెలంగాణలో లక్షలాది మంది ఏపీ వాసులు అనేక దశాబ్దాల నుంచి స్థిరపడి ఉన్నారు. వీరంతా కేసీఆర్ నాయకత్వంలోని నూతన రాష్ట్రంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతమైన జీవనం సాగిస్తున్నారు. వీరి ఓట్లు పొందేందుకు కూడా కాంగ్రెస్, బీజేపీలు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. రాజకీయ పార్టీలు ప్రతి ఒక్కరి ఓట్లు ఆశించవచ్చు. దానిలో తప్పు పట్టాల్సిన అంశం ఏమీ లేదు. కానీ తాము కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలమే అని భావించి తెలంగాణ రాష్ట్ర ప్రజలతో ఏపీ ప్రజలు అన్ని విధాలుగా కలసిపోయి ప్రశాంతంగా తమ పని తాము చేసుకుంటూ పోతున్నారు.
తెలంగాణలో ప్రశాంత జీవనం సాగిస్తున్న ఏపీ ప్రజలను ఓట్ల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రజల నుంచి వేరు చేస్తూ ప్రజల మధ్య ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టే చర్యలకు జాతీయ పార్టీలు పూనుకుంటున్నాయి. ఈ పరిణామాన్ని ప్రతి ఒక్కరూ ఖండించాల్సిందే.
ఉమ్మడి రాష్ర్టాన్ని కాంగ్రెస్ అయిదు దశాబ్దాలకు పైగా పరిపాలించింది. ఆ సమయంలో ముఖ్యమంత్రులుగా ఉన్నవారు తమ పదవులు కాపాడుకునేందుకు ఢిల్లీ చు ట్టూ తిరుగుతూ తమ సమయమంతా వెచ్చించారు. వారి ని దించడానికి మరో వర్గం ప్రయత్నిస్తూ ఉండేది. దీంతో అస్థిరమైన ప్రభుత్వాలు నడిచేవి. ఒక్కో పర్యాయం ఇద్దరు, ముగ్గురు ముఖ్యమంత్రులు మారేవారు. దాంతో వారికి ప్రజలకు మంచి చేయాలనే స్పృహ, సమయం రెండూ ఉండేవి కావు. రెండు రాష్ర్టాల్లో పేదలకు ప్రస్తుత ప్రభుత్వాలు ఇస్తున్న ఇండ్లు, ఇండ్ల స్థలాల కోసం లక్షలాది మంది క్యూ కట్టడం పరిశీలిస్తే గతంలో కాంగ్రెస్ ప్రజలకు ఎంత మేలు చేసిందో సులభంగా అర్థమవుతుం ది. ఈ పరిణామాల దృష్ట్యా భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ పార్టీ స్థిరమైన ప్రభుత్వాన్ని ఎంతవరకు ఏర్పరచగలదనేది నేడు తెలంగాణ రాష్ట్ర ప్రజలముందున్న వెయ్యి డాలర్ల ప్రశ్న.
భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధ్దించి 76 ఏండ్లు గడవగా ఆ సమయమంతా దేశాన్ని కాంగ్రెస్, బీజేపీలు పరిపాలించాయి. ప్రస్తుతం కూడా దేశాన్ని బీజేపీ పరిపాలిస్తున్నది. అయినా ప్రపంచంలో ఉన్న పేద దేశాల్లో భారతదేశం కూడా ఒకటిగా ఉన్నది. పేపర్లు, గణాంకాలు, రాజకీయ నేతల మాటల్లో మాత్రం దేశంలో పేదరికం గణనీయంగా తగ్గింది. నిజంగా పేదరికం తగ్గినైట్లెతే దేశంలో కోట్లాదిమంది ప్రజలు ఇంకా ఎందుకు ప్రభుత్వాలు ఇచ్చే రేషన్ బియ్యం కోసం క్యూ కడుతున్నారు? గూడు లేక ఇంకా కోట్లాది మంది కిరాయి ఇండ్లల్లో ఎందుకు నివసిస్తున్నారు? ఇంకా ఎందుకు కోట్లాదిమంది కట్టెల పొయ్యిలపై వంట చేసుకుంటున్నా రు? ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లేక చదువుకున్న యు వత నిరుద్యోగంతో ఇంకా ఎందుకు బాధపడుతున్నట్టు ? దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు ఎందుకు ఆత్మ హత్యలు చేసుకుంటున్నట్టు ? కరోనా సమయంలో దేశవ్యాప్తంగా కోట్లాది మంది ఉపాధి కూలీలు తమ స్వరాష్ర్టాలకు పోవడానికి అష్టకష్టాలు పడిన వైనం ప్రపంచమంతా చూసింది. దీని ప్రకారం దేశంలో ఇంకా కోట్లాది మంది ఉపాధి కోసం సుదూర ప్రాంతాలకు వలస వెళ్తున్నారని కచ్చితంగా చెప్పవచ్చు.
ఇన్నేండ్ల స్వాతంత్య్రంలో ఉపాధి కోసం ఇంకా వలసలెందుకు జరుగుతున్నాయి ? దేశ సంపదలో 90 శాతం సంపద కేవలం కొద్ది మంది వ్యక్తుల వద్దే ఎందుకున్నట్టు ? అనేవి జవాబులేని ప్రశ్నలు. దీంతో జాతీయ స్థాయిలో పేదరిక నిర్మూలన, నిరుద్యోగ నిర్మూలనపై కేంద్రం వద్ద ప్రణాళికలు ఉన్నాయా ? లేవా ? అనే అనుమానాలు ప్రజల్లో బలంగా వెలువడుతున్నాయి. ప్రజలకు ఉచిత విద్య, వైద్యం అందించవలసిన బాధ్యత కచ్చితంగా కేంద్ర ప్రభుత్వంపై ఉన్నది. కానీ దీన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు వదలి వేయడం కేంద్రం బాధ్యతారాహిత్యాన్ని తేటతెల్లం చేస్తున్నది. ఇవన్నీ ప్రజలకున్న ప్రాథమిక హక్కు లు. వీటి కోసం ఇంకా పోరాడాల్సిందేనా?
స్వతంత్ర భారతావనిలో నాటి నుంచి నేటి వరకు దేశాన్ని పరిపాలించిన, ప్రస్తుతం పరిపాలిస్తున్న ఏ కేంద్ర ప్రభుత్వం ఇటువంటి విషయాలపై కనీసం సమీక్ష కూడా జరిపిన దాఖలాలు ఇప్పటివరకు లేవు. ఒక్క మెతుకు చూసి అన్నం ఉడికిందో ? లేదో? తెలుసుకోవచ్చు. అదేవిధంగా ప్రజలకు మేలు చేసే అంశంలో ఈ అంశాల ప్రాతిపదికన కాంగ్రెస్, బీజేపీలకు ఉన్న చిత్తశుద్ధి ఏపాటిదో గహించవచ్చు. ఆ రెండు పార్టీలు అధికారంలోకి వస్తే ఏ కార్యక్ర మం జరగాలన్నా ఆ పార్టీల ఆధిష్ఠానం అనుమతి కచ్చితంగా తీసుకోవాలి. దానికోసం వారి ఆధిష్ఠానం చెప్పినట్టు వినేవారిని ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టి రిమోట్ను ఢిల్లీలోని తమ చేతిలో పెట్టుకుంటాయి. ఈ విధమైన రిమోట్ పాలనతో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మేలు జరుగుతుందనుకోవడం ఖచ్చితంగా భ్రమే.
జాతీయ స్థాయిలో పేదరిక నిర్మూలన, నిరుద్యోగ నిర్మూలనపై కేంద్రం వద్ద ప్రణాళికలు ఉన్నాయా ? లేవా ? అనే అనుమానాలు ప్రజల్లో బలంగా వెలువడుతున్నాయి. ప్రజలకు ఉచిత విద్య, వైద్యం అందించవలసిన బాధ్యత కచ్చితంగా కేంద్ర ప్రభుత్వంపై ఉన్నది. కానీ దీన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు వదలి వేయడం కేంద్రం బాధ్యతారాహిత్యాన్ని తేటతెల్లం చేస్తున్నది. ఇవన్నీ ప్రజలకున్న ప్రాథమిక హక్కులు.
– కైలసాని శివప్రసాద్ 94402 03999