‘న్యాయం లభించటంలో జాప్యం.. న్యాయం దక్కకపోవటంతో సమానం’ అనేది ప్రసిద్ధ నానుడి. దీనినే మరొక విధంగా కూడా తీసుకోవచ్చు. దక్కిన న్యాయం అర్థం కాకపోతే కూడా న్యాయం లభించనట్లే. మన దేశంలో ప్రజాస్వామ్యానికి మూలస్తంభాల్లో ఒకటైన న్యాయవ్యవస్థలో ఈ సమస్యలు ఏండ్లుగా తిష్ట వేసుకొని ఉన్నాయి. వీటిని ఒకటొకటిగా పరిష్కరించుకుంటూ వెళ్తున్న క్రమంలో తాజాగా మరొక కీలక ముందడుగు పడింది. సుప్రీంకోర్టు తీర్పులను స్థానిక భాషల్లో కూడా వెలువరించాలని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ చంద్రచూడ్ నిర్ణయించటం ముదావహం. ఇప్పటికే సుప్రీంకోర్టు విచారణలను ఆన్లైన్లో ప్రత్యక్ష ప్రసారం చేయటం వల్ల సాధారణ పౌరులకు దేశ అత్యున్నత న్యాయస్థానం ఎలా పని చేస్తుందో తెలుసుకోగలిగే వీలు కలిగింది. ఇవన్నీ దేశ న్యాయవ్యవస్థపై ప్రజలకు మరింత నమ్మకం కలిగిస్తాయి.
ఈ సంస్కరణలను కొనసాగించటమేగాక, విస్తృతపరచాలి. కొండంత కేసుల భారాన్ని మోసే దిగువ కోర్టుల నుంచి ప్రారంభించాలి. పిటిషన్ల దాఖలు, కౌంటర్ అఫిడవిట్ల వంటి పరిపాలన సంబంధిత పని భారాన్ని దిగువ కోర్టుల జడ్జీల పైనుంచి తప్పించి, కేసుల విచారణపైనే వారు దృష్టి పెట్టే పరిస్థితులు కల్పించాలని న్యాయ నిపుణులు సూచిస్తున్నారు. పరిపాలన, నిర్వహణ పనులకు తగిన సిబ్బందిని నియమించాలి. కేసులు త్వరగా పరిష్కారం కాకపోవటానికి వాయిదాలు కూడా ఒక ముఖ్యమైన కారణం. ఇరుపక్షాలూ అంగీకరించిన తేదీన విచారణకు హాజరుకాకపోతే జరిమానా విధించటం, నిర్ణీత కాలవ్యవధిలో విచారణను పూర్తి చేయటం వంటి చర్యల ద్వారా ఈ సమస్యను పరిష్కరించే అవకాశం ఉంది. హైకోర్టుల్లో, సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల కొరత తీవ్రంగా ఉన్న దృష్ట్యా దీనిపై సత్వరం దృష్టి పెట్టాలి.
కొలీజియం వ్యవస్థపై ఉన్న విమర్శలను పరిశీలించి, మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా నియామకాల ప్రక్రియను తీర్చిదిద్దాలి. న్యాయమూర్తుల పదవీ విరమణ వయస్సును పెంచాలన్న డిమాండ్ ఏండ్లుగా ఉన్నది. వయస్సును పెంచటంతోపాటు, రిటైరైన న్యాయమూర్తుల సేవలను కూడా వినియోగించుకోవటం వల్ల జడ్జీల కొరతను కొంతైనా అధిగమించవచ్చు. కరోనా కారణంగా మొదలైన ఆన్లైన్ విచారణ ప్రక్రియను మరింత విస్తృతపరచాలి. ప్రతీ కేసును సుప్రీంకోర్టులో అప్పీల్ చేసే అవకాశం ఉండటం కూడా సుప్రీంకోర్టు పనిగంటలను గణనీయంగా హరించి వేస్తున్నది. అప్పీళ్లను విచారించటానికి దేశవ్యాప్తంగా నాలుగైదు చోట్ల మధ్యంతర కోర్టులను ఏర్పాటు చేయాలన్న నిపుణుల సూచన మేలైనది.
ఈ సంస్కరణలు అమల్లోకి రావాలంటే.. కేంద్రప్రభుత్వ సహకారం తప్పనిసరి. కానీ, మోదీ సర్కారు ఏకంగా సుప్రీంకోర్టు మీదే దాడికి దిగి న్యాయవ్యవస్థను బలహీనపరిచే పనులకు పాల్పడుతున్నది. న్యాయ నియామక కమిషన్ రద్దుపై, కొలీజియంపై కేంద్రమంత్రి కిరెణ్ రిజిజు వ్యాఖ్యలు రోజురోజుకీ తీవ్రమవుతున్నాయి. ఆయనకు ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్కర్ తోడయ్యారు. అన్ని వ్యవస్థలను చెరబట్టిన కేంద్రం న్యాయవ్యవస్థనూ పూర్తిగా అదుపాజ్ఞల్లో పెట్టుకోవాలని చూస్తున్నది. న్యాయవ్యవస్థ, ప్రజాస్వామ్య హితైషులందరూ కలిసి దీనిని తిప్పికొట్టాలి.