దళితులు, గిరిజనుల సామాజిక, ఆర్థిక, విద్యాభివృద్ధికి భారత రాజ్యాంగం ప్రత్యేక రక్షణలు కల్పించింది. ఈ వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు చేపట్టాలని రాజ్యాంగ స్ఫూర్తి స్పష్టం చేస్తున్నది. అయితే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి అమలు మధ్య ఏర్పడుతున్న అంతరం దళిత, గిరిజన వర్గాల్లో ఆందోళనకు కారణమతున్నది. చేవెళ్ల ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్లో ఇచ్చిన హామీలపై ప్రభుత్వం దృష్టి పెట్టలేదనేది వాస్తవం. వెయ్యి రోజుల పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకొనేందుకు ప్రజాస్వామికవాదులు, దళిత సంఘాల నాయకులు నిలదీతలను తప్పించుకొనేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కపట నాటకాలకు తెరతీసింది. ప్రతిపక్షం అడుగుతున్న ప్రశ్నలకు జవాబు ఇవ్వలేక రాజకీయ రక్షణ కోసం దళిత నినాదం ఎత్తుకోవడం సిగ్గుచేటు. దళిత వ్యతిరేకి అయిన రేవంత్రెడ్డి, దళితులను ఉసిగొలిపి ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తూ దళిత పక్షపాతి అని చెప్పుకోవడం విడ్డూరం.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి మూడేండ్లు కావొస్తున్నా దళిత, గిరిజనులకు ఒక్క పథకం కూడా ప్రారంభించలేదు. హామీలను అమలు చేయకుండా మోసం చేస్తున్నది. బడ్జెట్ కేటాయింపులే నిదర్శనం. గత బీఆర్ఎస్ ప్రభుత్వం దళిత సంక్షేమం కోసం 2023-24 బడ్జెట్లో రూ.21,072 కోట్లు కేటాయిస్తే, రేవంత్రెడ్డి ప్రభుత్వం 2024-25లో కేవలం రూ.7,638 కోట్లు కేటాయించింది. అదేవిధంగా గిరిజన సంక్షేమం కోసం గత ప్రభుత్వం రూ.4,365 కోట్లు కేటాయిస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం రూ.3,969 కోట్లు మాత్రమే కేటాయించింది. రేవంత్రెడ్డి ప్రభుత్వం దళిత, గిరిజన సంక్షేమంలో రూ.13,830 కోట్లు కోత విధించింది. కేసీఆర్ ప్రభుత్వం దళితబంధు పథకం కింద ప్రతి దళిత కుటుంబానికీ రూ.10 లక్షల చొప్పున 40 వేల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించింది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆ మొత్తాన్ని రూ.12 లక్షలకు పెంచుతామని ఎన్నికల సమయంలో బీరాలు పలికింది. ఇప్పటివరకు ఒక్క కుటుంబానికి కూడా ఆర్థిక సాయం అందించకపోగా ఏకంగా దళిత బంధు పథకాన్నే అటకెక్కించింది.
కేసీఆర్ ప్రభుత్వం దళిత, గిరిజనుల విద్యార్థుల కోసం అనేక రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలలను ప్రారంభించింది. విద్యార్థులకు సన్నబియ్యంతో అన్నం పెట్టింది. దళిత, గిరిజన విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ ద్వారా ఒక్కొక్క విద్యార్థికి రూ.20 లక్షల ఆర్థిక సహాయం అందించింది.
ఎంతోమంది విద్యార్థులను విదేశాల్లో చదువుకోవడానికి పంపించింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఓవర్సీస్ స్కాలర్షిప్లను విడుదల చేయకపోవడంతో విద్యార్థులు తీవ్రమైన సమస్యలను ఎదుర్కొంటున్నారు. దళితుల ఆత్మగౌరాన్ని పెంచేందుకు ప్రపంచంలోనే అతిపెద్ద 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని కేసీఆర్ నిర్మించారు. అంబేద్కర్ ఆశయాలను విశ్వవ్యాప్తం చేయడానికి తెలంగాణ సెక్రటేరియట్కు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ పేరు పెట్టారు. ఎస్సీల రిజర్వేషన్లు 15 శాతం నుంచి 18 శాతానికి పెంచుతామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ప్రైవేట్ విద్యాసంస్థల్లో, ప్రభుత్వ ప్రోత్సాహకాలను పొందే పరిశ్రమల్లో రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రగల్భాలు పలికింది. కేసీఆర్ ప్రభుత్వం గిరిజనుల రిజర్వేషన్లు 10 శాతానికి పెంచుతూ జీవో జారీ చేసి, వారి జీవితాల్లో వెలుగులు నింపింది. ప్రభుత్వ కాంట్రాక్టుల్లో దళిత, గిరిజనులకు రిజర్వేషన్ కల్పించింది.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రభుత్వ కాంట్రాక్టుల్లో దళితులకు 18 శాతం, గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని మాయమాటలు చెప్పింది. ఇండ్లు లేని దళిత, గిరిజన కుటుంబాలకు ఇంటి స్థలంతోపాటు ఇల్లు నిర్మించుకునేందుకు ఆర్థిక సాయం చేస్తామని నమ్మబలికి మోసం చేసింది. ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ల ద్వారా రుణాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నది. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు పదో తరగతి పాస్ అయితే రూ.10 వేలు, ఇంటర్ పాస్ అయితే రూ.15 వేలు, డిగ్రీ పూర్తి చేస్తే రూ.20 వేలు, పీజీ పూర్తి చేస్తే రూ.లక్ష, ఎంఫీల్/పీహెచ్డీ పూర్తి చేస్తే రూ.5 లక్షలు అందజేస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ చెప్పింది. కానీ ఆ హామీలు కూడా అమలుకు నోచుకోలేదు. అదీగాక ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను కూడా విడుదల చేయడం లేదు. దళిత, గిరిజనుల సంక్షేమం రాజకీయ నినాదాలు, విమర్శలకు మాత్రమే పరిమితం కాకూడదు. రాజ్యాంగం కల్పించిన హక్కులు, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు అనే అంశాల ప్రాతిపదికన ప్రభుత్వ పనితీరును అంచనా వేయాలి. గత ప్రభుత్వంతో పోల్చుకోవడం మాత్రమే కాకుండా ప్రస్తుత ప్రభుత్వం తన హామీలను ఎంతవరకు అమలు చేసిందన్నదే అసలు కొలమానం.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ప్రజల విశ్వాసానికి సంబంధించినవి. వాటిని ఎందుకు అమలు చేయలేదో ప్రభుత్వం ప్రజలకు వివరించాలి. అంతేకానీ మాటలతో కాలం గడుపుతూ అన్ని వర్గాల వారిని కాంగ్రెస్ నేతలు మోసం చేస్తున్నారు. 1000 అబద్ధాలు ఆడి అయినా అధికారంలోకి రావాలనే రేవంత్ తీరు బయటపడింది, కాంగ్రెస్ నవ్వుల పాలయింది.
దళిత, గిరిజనులు విద్యార్థులు, నిరుద్యోగు లు, రైతులు, పేద కుటుంబాలు తమ భవిష్యత్తుపై నమ్మకం పెట్టుకున్నప్పుడు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడం ప్రభుత్వ బాధ్యత. కాబట్టి ఇ చ్చిన హామీలు, అమలు పురోగతిపై స్పష్టమైన శ్వేతపత్రం విడుదల చేయాలి. దళిత, గిరిజన సంక్షేమం ఓటు బ్యాంకు రాజకీయాలకు పరిమి తం కాకుండా రాజ్యాంగబద్ధ బాధ్యతగా మారా లి. అప్పుడే సామాజిక న్యాయం అంటే ఒక నినాదం కాకుండా వాస్తవం అవుతుంది.
ఎస్సీల రిజర్వేషన్లు 15 శాతం నుంచి 18 శాతానికి పెంచుతామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ప్రైవేట్ విద్యాసంస్థల్లో, ప్రభుత్వ ప్రోత్సాహ
కాలను పొందే పరిశ్రమల్లో రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రగల్భాలు పలికింది. కేసీఆర్ ప్రభుత్వం గిరిజనుల రిజర్వేషన్ 10 శాతానికి పెంచుతూ జీవో జారీ చేసి, వారి జీవితాల్లో వెలుగులు నింపింది. ప్రభుత్వ కాంట్రాక్టుల్లో దళిత, గిరిజనులకు రిజర్వేషన్లు కల్పించింది.
-డాక్టర్ బొల్లికొండ వీరేందర్ ,98665 35807