ఏం జరుగుతోంది? దేశ రాజకీయాల్లో పెను సంచలనాలు చోటుచేసుకోబోతున్నాయా? గత ఏడున్నరేండ్లుగా దేశాన్ని పాలిస్తున్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మీద ప్రజల ఆశలు సన్నగిల్లాయా? ప్రభుత్వ పనితీరుపై నిస్పృహ చోటుచేసుకుంటున్నదా? మోదీ ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజాకంటక నిర్ణయాల పట్ల ప్రజలు నిరాశలో మునిగిపోతున్నారా? యూపీ, గోవాలో అధికారంలో ఉన్నప్పటికీ బీజేపీ నాయకులు మంత్రి పదవులను సైతం వదులుకొని వేరే పార్టీల్లో చేరిపోతున్నారెందుకు?
రాబోయే సార్వత్రిక ఎన్నికలు బీజేపీకి అగ్నిపరీక్ష కాబోతున్నాయా? బీజేపీకి మరో ప్రత్యామ్నాయం కావాలని దేశం ఎదురుచూస్తున్నదా? ఈసారి దేశ ప్రజల ఆశ దక్షిణ భారతదేశం కాబోతున్నదా? ఎందుకు ఎక్కడెక్కడి నాయకులు తెలంగాణ వైపు చూస్తున్నారు? దేశానికి తెలంగాణ రాష్ట్రం దిక్సూచి కాబోతున్నదా? దేశానికి కేసీఆర్ నాయకత్వం అవసరమని ప్రజానీకం భావిస్తున్నదా? ఎన్నో ప్రశ్నలు ఇవాళ దేశ ప్రజలనే కాకుండా రాజకీయపార్టీలను కూడా కుదిపేస్తున్నాయి. లేకపోతే ఏమిటి?
ఆ మధ్య ముఖ్యమంత్రి కేసీఆర్ తమిళనాడు పర్యటనకు వెళ్లినప్పుడు తమిళనాడు సీఎం స్టాలిన్ సాదర స్వాగతం పలికారు. దేశ రాజకీయాలను, బీజేపీ మత, విభజన రాజకీయాలను కేసీఆర్తో చర్చించారు. ఇటీవల కమ్యూనిస్టు అగ్రనేతలు ప్రగతిభవన్కు వెళ్లి కేసీఆర్తో చర్చలు జరిపారు. బీహార్ యువనేత, మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వీ యాదవ్ ప్రగతిభవన్లో ముఖ్యమంత్రిని కలిసి మాట్లాడారు. ఈ పరిణామాలన్నీ గమనిస్తుంటే దేశ రాజకీయాల్లో ఊహించని మార్పులు చోటుచేసుకోబోతున్నాయని విశ్లేషకుల అభిప్రాయం.
నిజానికి గత పార్లమెంట్ ఎన్నికలకు ముందు కేసీఆర్ చొరవతో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుచేయాలని కొన్ని ప్రయత్నాలు జరిగాయి. కానీ, అప్పుడు సమయం తక్కువగా ఉండటంతో కార్యకలాపాలు ఊపందుకోలేదు. కానీ, ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ పేలవమైన ప్రదర్శన చేయడంతో బీజేపీ బలం పెరిగింది. కాంగ్రెస్ అధిష్ఠానంగా చెప్పబడే రాహుల్గాంధీ సైతం యూపీలో ఓడిపోయారు. దాంతో కాంగ్రెస్ డీలా పడిపోయింది. ఆ తర్వాత మూడేండ్లు గడుస్తున్నా నేటికీ ఎన్డీయేకు ప్రత్యామ్నాయం కనిపించకపోవడంతో బీజేపీ చెలరేగిపోతున్నది. రాష్ర్టాలను బానిసల్లా చూస్తున్నది. రాజ్యాంగ ప్రకారం రావలసిన నిధులను కూడా తొక్కిపెడుతున్నది. పెట్రోల్, డీజిల్ ధరలను వంద రూపాయల మార్క్ దాటించింది. గ్యాస్ ధరను వెయ్యి రూపాయలకు పెంచింది. రైతు వ్యతిరేక చట్టాలను చేసి వేల మంది రైతులను నడిరోడ్ల మీద నిలబెట్టింది. రైతు ఆగ్రహాన్ని తట్టుకోలేక ఆ చట్టాలను ఉపసంహరించింది. మొదటి దశలో ఎవ్వరికీ చెప్పకుండా పెద్దనోట్ల రద్దుతో దేశం మొత్తాన్ని అల్లకల్లోలం చేసింది. ఏటీఎంల ముందు వృద్ధులను కూడా నిలబెట్టి నూట యాభై మంది మరణానికి కారణమైంది. జీఎస్టీ పేరుతో పన్నులను దారుణంగా పెంచింది. జీఎస్టీ కారణంగా లక్షల పరిశ్రమలు మూతపడిపోయాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం కుదేలైంది. లక్షల మంది ఉపాధి కోల్పోయారు.
ఈసారి ఎలాగైనా బీజేపీని సాగనంపకపోతే దేశం అల్లకల్లోలమవుతుంది. తెలంగాణ రైతుల పట్ల మోదీ ప్రభుత్వం ప్రదర్శించిన నిర్దాక్షిణ్య వైఖరికి విసిగిపోయిన సీఎం కేసీఆర్ బీజేపీపై నిప్పులు కక్కుతున్నారు. బీజేపీ దుర్మార్గ విధానాలను దేశవ్యాప్తంగా ఎండగడతామని హెచ్చరించారు. కేసీఆర్ ప్రకటనలు దేశంలోని అనేక రాజకీయపార్టీలను కదిలించాయి. మోదీని ధిక్కరించలేక, సమర్థించలేక దిక్కులు చూస్తున్న రాజకీయ పార్టీలకు కేసీఆర్ ఒక ఆశాకిరణంలా కనిపిస్తున్నారు. కేసీఆర్ గురించి దేశంలో తెలియనివారు లేరు. విభిన్న సిద్ధాంతాలను కలిగిన 30కి పైగా రాజకీయపార్టీలను ఒప్పించి తెలంగాణ సాధించిన కేసీఆర్ ఘనచరిత్ర గురించి తెలియనివారు ఎవరున్నారు?
అందుకే మళ్లీ ఏదైనా జరగాలంటే, బీజేపీని దీటుగా ఎదుర్కొనగల నాయకత్వం కావాలంటే అందుకు కేసీఆర్ మాత్రమే సమర్థులని అనేక పార్టీల నాయకులు అభిప్రాయ పడుతున్నారు. దేశ రాజకీయాల్లో కేసీఆర్కు గల సుదీర్ఘమైన చరిత్ర, ఎంపీగా, కేంద్రమంత్రిగా అనుభవం, తెలంగాణ రాష్ట్రం కోసం అనేకమార్లు పదవులకు రాజీనామా చేసిన సాహసం, వివిధ పార్టీలతో ఆయనకు ఉన్న అనుబంధం, అన్నింటికీ మించి దక్షిణ భారతదేశంలోనే అందరు నాయకులకు భిన్నంగా ఇంగ్లీష్, హిందీ భాషల్లో ఆయనకున్న అసాధారణ ప్రతిభ, పట్టు, సమస్యల మీద ఎక్కడిదాకైనా పోరాడగల ధీర గుణం కేసీఆర్కు మాత్రమే ఉన్నాయని పలువురి అభిప్రాయం.
ఒకవేళ కేసీఆర్ నాయకత్వంలో బీజేపీ, కాంగ్రెస్లు మినహా మిగిలిన ప్రాంతీయ పార్టీలన్నీ ఏకమైతే దేశాన్ని శాసించడం సాధ్యమయ్యే విషయమే. దక్షిణ భారతదేశంలో కర్ణాటక మినహా మిగిలిన నాలుగు రాష్ర్టాలు ప్రాంతీయపార్టీల చేతుల్లోనే ఉన్నాయి. ఏపీలో జగన్, తమిళనాడులో స్టాలిన్, కేరళలో విజయన్, కర్ణాటక జేడీయూ నేత కుమారస్వామి, తెలంగాణలో కేసీఆర్ కలిస్తే కనీసం వంద లోక్సభ స్థానాలను సాధించగలరు. వీరికి శరద్పవార్, లాలూప్రసాద్ యాదవ్, నితీష్కుమార్, నవీన్ పట్నాయక్, మమతా బెనర్జీ తోడైతే, కాంగ్రెస్ పార్టీ సహకారంతో కేంద్రంలో అధికారం సాధించడం కష్టమేం కాదు. వీరందరినీ నడిపించే నాయకుడు కావాలి. ఆ వెలిగే సూర్యుడు కేసీఆర్ కావాలని దేశం మొత్తం కోరుకుంటున్నది.
రాజ్యం వీరభోజ్యం అన్నారు పెద్దలు. అలాం టి వీరుడిని కేసీఆర్లో చూస్తున్నది దేశం. అందు కే నేడు వరుసబెట్టి రాజకీయ పార్టీలన్నీ ప్రగతిభవన్ వైపు చూస్తున్నాయి. ప్రధాని పదవి ఎవ్వరి అబ్బ సొమ్మూ కాదు. పోరాడేవాడికే ప్రజలు పట్టం కడతారు. చూద్దాం.. భవిష్యత్తులో దేశానికి తెలంగాణ సారథ్యం వహించడం తథ్యం!
–ఇలపావులూరి మురళీ మోహనరావు
(వ్యాసకర్త: సీనియర్ రాజకీయ విశ్లేషకులు)