‘గ్రహ రాసుల నధిగమించి, ఘనతారల పథము నుంచి గగనాంతర రోదసిలో, గంధర్వగోళ తతుల దాటి.. ’ అంటూ మానవుడు గర్వంగా పాడుకుంటున్న రోజులివి. రోదసిలో వినోదయాత్రలు చేసే కాలం వచ్చింది. చంద్రమండలం మీద ఆవాసాలు ఏర్పాటు చేసుకుందామనే కలలు ఇంకా మిలమిలలాడుతున్నాయి. కానీ సుందరమైన, నివాసయోగ్యమైన భూగోళంపై మానవాళి మనుగడ సాగిస్తుందా అనే సందేహాలు వెంటాడుతున్నాయి. భూగోళ వాతావరణం వేడెక్కకుండా కాపాడుకోవాలనే అనేక ఆశల మధ్య, స్కాట్లాండ్లోని గ్లాస్గోలో ఇటీవల రెండు వారాల పాటు జరిగిన ‘ఐక్యరాజ్యసమితి వాతావరణ సదస్సు’ కాప్-26 ఆశించిన లక్ష్యాన్ని సాధించకపోవడం విషాదకరం. సదస్సుకు ఆతిథ్యం ఇచ్చిన బ్రిటన్తోపాటు అగ్రరాజ్యం అమెరికా కాప్-26’ విజయవంతమైందని ప్రకటించగా.. మాల్దీవుల వంటి చిన్న పేద దేశాలు మాత్రం తప్పేమీ లేకపోయినా జలసమాధి అయ్యే తమ పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నాయి.
భూగోళం ఉష్ణోగ్రతలను పారిశ్రామికీకరణకు ముందున్న నాటితో పోల్చితే 1.5 డిగ్రీలకు మించి పెరుగనీయవద్దన్న పారిస్ ఒప్పందం లక్ష్యాన్ని సజీవంగా కొనసాగించడం ఈ సదస్సులో కొంత సంతృప్తికరమైన అంశం. ఇందుకు మరో ఎనిమిదేండ్లలో కర్బన ఉద్గారాలను సగానికి తగ్గించుకోవాలి. 2050 నాటికి పూర్తిగా అరికట్టాలి. అయితే ఇంతకాలం బొగ్గు వాడకం ద్వారా భూగోళాన్ని కాలుష్యమయం చేసింది అభివృద్ధి చెందిన దేశాలే. తాము త్యాగాలు చేయకుండా, భారత్ వంటి వర్ధమాన దేశాలను కట్టడి చేయాలనడం ఏమిటనే ప్రశ్న వినిపిస్తున్నది. వర్ధమాన దేశాలకు సాంకేతికత బదిలీ, ఆర్థిక తోడ్పాటు, కొంతకాలం వెసులుబాటు ఇవ్వాలనే వాదనలో న్యాయం ఉంది. బొగ్గు వినియోగంపై భారత్ వైఖరి అభ్యంతరకరంగా ఉన్నట్టు కనిపిస్తున్నది. కానీ అమెరికా, చైనా సహా పలు దేశాలు తమ వంతు వెసులుబాట్లు పొందాయనేది గమనార్హం.
భూగోళ ఉష్ణోగ్రత ఇప్పటికే 1.1 డిగ్రీల సెల్సియస్ పెరిగిందని, ఈ శతాబ్దాంతానికి 2.4 డిగ్రీల పెరుగుదలకు చేరుకుంటుందని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. 2 డిగ్రీలు దాటినా కూడా అనేక లోతట్టు దేశాలు కనుమరుగైపోతాయి. ప్రచండమైన వడగాడ్పులు, వానలు, వరదలు బీభత్సాలను సృష్టిస్తాయి, కొత్త వ్యాధులను మోసుకొస్తాయి. ఈ మహా విపత్తును నివారించడానికి మానవాళి సమిష్టి కార్యాచరణకు దిగకపోవటం ఇప్పటికీ పెద్దలోటే. 23 సంపన్నదేశాలు సగం కర్బన ఉద్గారాలకు కారణమైతే, భారత్, చైనాతోపాటు మిగిలిన 150 దేశాలు మరో సగానికి కారణమవుతున్నాయి. ఆర్థిక అంతరాల్లాగే ఈ వాతావరణ అంతరాలున్నాయి. ఈ నేపథ్యంలో అభివృద్ధి చెందిన దేశాలు ‘సొంత లాభం కొంత మానుకొని పొరుగువారికి తోడ్పడాలి’. పెద్ద మనసుతో ముందుకొచ్చి పాప పరిహారం చేసుకోవాలి.