సమష్టి పోరాటం ద్వారానే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని, ఇది ఏ ఒక్కరి త్యాగఫలం కాదని కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రాగం అందుకున్నది. దశాబ్ది ఉత్సవాల పేరిట తెలంగాణపై కపట ప్రేమను ఒలకబోస్తూ, ఆరు దశాబ్దాల పాటు తెలంగాణను సర్వనాశనం చేసిన చరిత్రను చెరిపేయాలని చూస్తున్నది. తెలంగాణ రాష్ట్రం సమష్టి పోరాటాల ద్వారానే సాధ్యమైందన్నది ఎంత వాస్తవమో, ఆ సమష్టి పోరాటంలో కాంగ్రెస్ పాత్ర గుండుసున్నా అనే విషయం కూడా అంతే పచ్చి నిజం. అసలు ఆరు దశాబ్దాల పాటు తెలంగాణకు అన్యాయం చేసిందే కాంగ్రెస్ పార్టీ. ప్రజలు దశబ్దాల పాటు పోరాడింది కాంగ్రెస్ పార్టీపైనే.
కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి కేసీఆర్ నాయకత్వంలో ప్రజలు తెలంగాణ రాష్ర్టాన్ని సాధించుకున్నారు. ఇది చరిత్ర. చెరిపేస్తే చెరగని సత్యం. తుడిచేస్తే మాసిపోని యదార్థం. తూతూ మంత్రంగా ఉత్సవాలు చేసి, చరిత్ర ఆనవాలు చెరిపేసి, చిహ్నాలు మార్చి తెలంగాణ పాటకు ఆంధ్ర రాగం జోడించి తామేదో తెలంగాణను ఉద్ధరించామని చెప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఆరు దశాబ్దాల పాటు అన్యాయం చేసిన పాపాన్ని ఉత్సవాలు చేసి కడిగేసుకుందామనుకుంటున్నారు.
Congress | ఊరూరా వెలసిన అమరవీరుల స్థూపాలే కాంగ్రెస్ పాపాలకు నిలువెత్తు సాక్ష్యం. కాంగ్రెస్ ప్రభుత్వమే ఉద్యమకారులను చంపేసింది. వారిని స్మరించుకోవడానికే అమరవీరుల స్థూపాలను ప్రజలు పెట్టుకున్నారు. వాటికి కాంగ్రెస్ పార్టీ నివాళులర్పించడమంటే అర్థం ఏమిటి? హత్యచేసిన వాళ్లే దండేసి దండం పెట్టినట్టుంది.
జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు చేయాలని నిర్ణయించిన కాంగ్రెస్ పార్టీ వైఖరి హత్యచేసిన వాడే ఘనంగా శ్రద్ధాంజలి ఘటించినట్టు ఉన్నది. అసలు తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడే హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదు. తెలంగాణ ఆవిర్భావ వేడుకలు నిర్వహించే నైతికత కాంగ్రెస్కు అంతకన్నా లేదు. ఎందుకంటే కాంగ్రెస్ చరిత్ర అంతా తెలంగాణకు ద్రోహం చేయడంతోనే నిండిపోయింది.
దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి నేటివరకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ర్టానికి చేసిన ద్రోహాల జాబితా చాంతాడంత ఉంది. అదంతా ప్రజల మనసుల్లో నిక్షిప్తమై ఉంది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు చేసిన దగా, మోసం, అన్యాయం అంతా ఇంతా కాదు. ప్రత్యేక రాష్ట్రంగా ఉన్న హైదరాబాద్ను ఇక్కడి ప్రజలు వ ద్దు అంటున్నా సరే, 1956లో బలవంతంగా ఆంధ్రతో కలిపింది నాటి కాంగ్రెస్ ప్రభుత్వమే. ఆంధ్రతో కలవక ముందు హైదరాబాద్ రాష్ర్టానిది మిగులు బడ్జెట్ కలిగిన బలమైన ఆర్థిక వ్యవస్థ. ఆంధ్ర రాష్ర్టానిది కనీసం ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించలేని దుర్భర పరిస్థితి. తెలంగాణ సంపదను ఆంధ్రకు దోచిపెట్టాలనే కుట్రతో మాత్రమే నాడు హైదరాబాద్, ఆంధ్ర రాష్ర్టాలను కలిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పాటుచేసింది కాంగ్రెస్ పార్టీ కాదా?
మొదటి ఎస్సార్సీ తెలంగాణను, ఆంధ్రను కలపవద్దని సూచించినా బలవంతపు పెళ్లి చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా? భాషా ప్రయుక్త రాష్ర్టాలు అవసరం లేదని జస్టిస్ ధార్ కమిషన్ చేసిన సిఫారసులను కూడా పట్టించుకోకుండా తెలంగాణను ఆంధ్రతో కలిపింది కాంగ్రెస్ పార్టీయే. సమైక్య ఆంధ్రప్రదేశ్ ఏర్పాటును తెలంగాణ వాదులు వ్యతిరేకించినా, నాటి కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి మరీ అన్యాయం చేసింది. 1956 నుంచి 2014 వరకు ప్రతి సందర్భంలోనూ తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఆంధ్ర నాయకుల ప్రలోభాలకు, ప్రభావానికి గురై ఈ నేలకు అన్యాయం చేశారు.
ఆంధ్రతో కలిసిన తర్వాత తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతినవద్దని 1956లో పెద్ద మనుషుల ఒప్పందం జరిగింది, ఆ ఒప్పందంపై చేసిన సంతకాల సిరా తడి ఆరకముందే చేసుకున్న తీర్మానాలన్నిటినీ తుంగలో తొక్కింది కాంగ్రెస్ పార్టీయే. తెలంగాణకు ముఖ్యమంత్రి లేదా ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని పెద్ద మనుషుల ఒప్పందంలో స్పష్టంగా రాశారు. కానీ ముఖ్యమంత్రి పదవి తీసుకున్న ఆంధ్ర నాయకులు ఉప ముఖ్యమంత్రి పదవిని ఆరో వేలుతో పోల్చి అవసరం లేదన్నారు. తెలంగాణలోని ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో ప్రవేశాలు తెలంగాణ స్థానికులకే ఇవ్వాలన్న పెద్ద మనుషుల ఒప్పందం ఒక్కనాడు కూడా అమలు చేయకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీయే. నాగార్జునసాగర్ డ్యామ్ నిర్మాణ స్థలాన్ని మార్చి తెలంగాణకు కృష్ణా జలాలు రాకుండా అడ్డుకున్నది కాంగ్రెస్ పార్టీయే.
ఆరు దశాబ్దాల పాటు తెలంగాణ వారికి ఉద్యోగాలు రాకుండా హైదరాబాద్లో ఎక్కువ ఉద్యోగాలు ఆంధ్ర ప్రాంతం వారికి దక్కేలా చట్టాలు చేసింది, జీవోలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయే. తెలంగాణలోని ఉద్యోగాలన్నీ తెలంగాణ స్థానికులకే ఇవ్వాలనే 1919, 1949లో జారీచేసిన ముల్కీ నిబంధనలను తుంగలో తొక్కి అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీయే. 35వ ఆర్టికల్ ద్వారా ముల్కీ నిబంధనలకు రాజ్యాంగ రక్షణ ఉన్నప్పటికీ అధికారాన్ని అడ్డు పెట్టుకొని 1950లో రెసిడెంట్స్ అనే సర్క్యులర్ తెచ్చి, తెలంగాణ స్థానికులకు అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీయే. 1952లో హైదరాబాద్లో నాన్ ముల్కీ గో బ్యాక్ ఉద్యమం చేసిన విద్యార్థులపై సైన్యాన్ని ప్రయోగించి, 18 మందిని కాల్చిచంపింది కాంగ్రెస్ పార్టీయే. తెలంగాణ నుంచి వచ్చిన నిధులను తెలంగాణలోనే ఖర్చుచేయాలనే పెద్ద మనుషుల ఒప్పందాన్ని నీరు గార్చి, తెలంగాణ ఆదాయాన్ని ఇతర ప్రాంతాలకు తరలించింది కాంగ్రెస్ పార్టీయే.
ప్రత్యేక తెలంగాణ కావాలని ఉద్యమించిన 369 మందిని 1969లో దారుణంగా కాల్చి చంపింది కాంగ్రెస్ పార్టీయే. తెలంగాణకు అనుకూలంగా మాట్లాడారని ముఖ్యమంత్రి పీఠం నుంచి పీవీ నర్సింహారావును అర్ధాంతరంగా దింపేసింది కాంగ్రెస్ పార్టీయే. 1969 నుంచి 2014 వరకు తెలంగాణ కోసం ఎవరు ఉద్యమించినా, ఎవరు రాజకీయ పార్టీ పెట్టినా దారుణంగా అణచివేసి, బెదిరించి, బలవంతంగా తమలో కలుపుకున్నది కాంగ్రెస్ పార్టీయే. జీవో నెంబర్ 36, జీవో నెంబర్ 610 ద్వారా స్థానికేతర ఉద్యోగుల స్థానంలో స్థానికులను నియమించాలన్న నిబంధనలు ఉల్లంఘించి తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీయే. ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు 1969లో తెలంగాణ ప్రయోజనాలు కాపాడతామంటూ అష్టసూత్ర పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకాన్ని కూడా నిర్వీర్యం చేసింది కాంగ్రెస్ పార్టీయే. 1973లో ఆరు సూత్రాల పథకం తెచ్చి, తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీయే. తెలంగాణకు ప్రత్యేకంగా ప్రాంతీయ ఆర్థిక, అభివృద్ధి మండలి ఏర్పాటుచేయాలని కేంద్రం ఆదేశించినా, దాన్ని పట్టించుకోకుండా అన్యాయం చేసింది నాటి కాంగ్రెస్ ప్రభుత్వమే.
రాష్ట్ర చిహ్నంలో కాకతీయ తోరణాన్ని, చార్మినార్ను తొలగించాలనుకోవడం ముమ్మాటికీ తుగ్లక్ చర్యనే. కాకతీయ తోరణం, చార్మినార్ రాజరికపు గుర్తులైతే మరి భారత జాతీయ చిహ్నంగా పెట్టుకున్న నాలుగు సింహాలు, ఆశోకచక్రం దేనికి గుర్తో కాంగ్రెస్ నాయకులు సమాధానం చెప్పాలి. ఏ దేశమైనా, ఏ రాష్ట్రమైనా చారిత్రక, సాంస్కృతిక, సామాజిక నేపథ్యాన్ని ప్రతిబింబించే విధంగానే చిహ్నాలు పెట్టుకుంటాయనే ఇంగితం రాష్ట్ర కాంగ్రెస్ నాయకులకు లేకపోవడం దురదృష్టకరం.
కృష్ణా, గోదావరి నదులు తెలంగాణ నుంచి పారుతున్నా, వాటిపై ప్రాజెక్టులు కట్టకుండా రైతులను అరిగోస పెట్టింది కాంగ్రెస్ పార్టీయే. ఉద్యోగాల విషయంలో, నిధుల వినియోగం విషయంలో, నదీ జలాల పంపకం విషయంలో సమైక్య ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకు అన్యాయమే జరిగిందని ప్రభుత్వమే నియమించిన అనేక కమిటీలు, కమిషన్లు, కేంద్ర బృందాలు నివేదికలు ఇచ్చాయి. అయినా సరే ఏ ఒక్క నాడు కూడా అన్యాయాన్ని సవరించడానికి కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రయత్నం చేయలేదు.
ఆరు దశాబ్దాల పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏ ఒక్క తెలంగాణ ముఖ్యమంత్రిని కూడా పూర్తికాలం అధికారంలో ఉండనివ్వకుండా కుట్రలు చేసింది కాంగ్రెస్ పార్టీయే. కేసీఆర్ నాయకత్వంలో బలంగా ఉద్యమం నడుస్తున్నదనే అక్కసుతో టీఆర్ఎస్ పార్టీని చీల్చి, ఉద్యమాన్ని బలహీనం చేయాలని ప్రయత్నించింది కాంగ్రెస్ పార్టీయే.
ప్రత్యేక తెలంగాణ ఇస్తామని హామీ ఇచ్చి, 2004లో అధికారంలోకి వచ్చి పదేండ్లు జాప్యం చేసింది కాంగ్రెస్ పార్టీయే. యూపీఏ కామన్ మినిమమ్ ప్రోగాంలో తెలంగాణ ఏర్పాటును ప్రస్తావించారు. 2004లోనే రాష్ట్రపతి ద్వారా తెలంగాణ ఏర్పాటుచేస్తామని చెప్పించారు. కానీ, సమైక్యవాదుల ఒత్తిళ్లకు తలొగ్గి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వెనక్కి నెట్టేశారు. 2004 నుంచి 2009 వరకు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయలేదు. 2009లో మళ్లీ అధికారంలోకి వచ్చినా ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుచేయకపోవడం వల్లనే ‘కేసీఆర్ సచ్చుడో, తెలంగాణ వచ్చుడో’ అనే తెగింపుతో టీఆర్ఎస్ అధ్యక్షుడు ఆమరణ నిరాహార దీక్ష చేశారు. రాష్ట్ర ప్రజలంతా ఏకోన్ముఖులై కేసీఆర్ వెంటనడిచి రాష్ర్టాన్ని స్థంభింపజేయడంతో తప్పని పరిస్థితిలో 2009, డిసెంబర్ 9న తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రకటన వచ్చింది. ఆ ప్రకటనలో కూడా కేంద్ర ప్రభుత్వం కేసీఆర్ పోరాటాన్ని ప్రస్థావించింది తప్ప తెలంగాణ కాంగ్రెస్ నాయకుల ప్రయత్నాన్ని ప్రస్తావించలేదు.
డిసెంబర్ 9న ప్రకటన చేసి కూడా తెలంగాణ ఏర్పాటులో తీవ్ర జాప్యం చేసి దగా చేసింది కాంగ్రెస్ పార్టీయే. ఇక కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వదు అనే నిరాశ నిస్పృహతో వందలాది మంది విద్యార్థులు, యువకులు ఆత్మహత్యలు చేసుకున్నారు. తమ చా వుకు కాంగ్రెస్ తెలంగాణ మంత్రులు కారణమంటూ నాటి అమరవీరులు తమ వాంగ్మూలాల్లో స్పష్టంగా పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పాటుకోసం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పదవులకు రాజీనామా చేసి ప్రజలతో పాటు పోరాటంలో ఉన్నారు. కానీ, అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు సమైక్యవాదుల పంచన చేరి అధికారాన్ని అనుభవించారు. తెలంగాణ ఉద్యమకారులపై నాటి కాంగ్రెస్ ప్రభుత్వం అనేకసార్లు లాఠీలు ఝుళిపించింది. కాల్పులు జరిపింది. కేసులు పెట్టింది. ఉద్యమకారులను జైళ్లపాలు చేసింది. నాడు నిండు అసెంబ్లీలో తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వం, ఏం చేసుకుంటారో చేసుకోండి అని నాటి సీఎం కిరణ్కుమార్ రెడ్డి కరాఖండీగా చెప్పినా అదే తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ మంత్రులు మౌనంగా కూర్చున్నారు. తెలంగాణకు నిధులు ఎందుకు ఇవ్వరు అని ఒక్కరూ ప్రశ్నించలేదు.
చివరికి తెలంగాణ ప్రజలంతా సకలజనుల సమ్మె చేసి, దేశంలోని రాజకీయ పక్షాలన్నింటిని ఒప్పించి, కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నారు. ఇది తెలంగాణ ప్రజల పోరాట చరిత్ర. ఆరు దశాబ్దాల పాటు అడుగడుగునా అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీపై తిరుగుబాటు చేసి మరీ రాష్ట్రం సాధించుకున్న విజయ గాథ. ఈ మొత్తం చరిత్రలో కథా నాయకులు తెలంగాణ ప్రజలైతే విలన్లు తెలంగాణ కాంగ్రెస్ నాయకులే. తెలంగాణ ప్రజల్లో చైతన్య స్ఫూర్తిని నింపి తెలంగాణ రాష్ట్ర కాంక్షను ఒక రాజకీయ శక్తిగా మరలిచింది ముమ్మాటికీ కేసీఆరే. గమ్యం ముద్దాడేవరకు వెనుకడుగు వేయకుండా తెలంగాణ ప్రజలకు ప్రాతినిధ్యం వహించింది బీఆర్ఎస్ పార్టీయే.
వాస్తవం ఇలా ఉంటే తిమ్మిని బమ్మి చేయాలని, నిజాలకు మసి బూసి మారేడు కాయగా మార్చాలని కాంగ్రెస్ నాయకులు ప్రయత్నిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును తమ ఘనతగా చెప్పుకొనే ప్రయత్నం చేస్తూ సుదీర్ఘ ప్రజా పోరాటాన్ని అవమానపరుస్తున్నారు. ఈ ప్రయత్నాలను తెలంగాణ ప్రజలు హర్షించరు. ఉత్సవాల నిర్వహణ పేరిట తెలంగాణ చారిత్రక నేపథ్యాన్ని, సాంస్కృతిక వైభవాన్ని కూడా మరుగున పడేసే కుంచిత నిర్ణయాలు కూడా జరుగుతున్నాయి. రాష్ట్ర చిహ్నంలో కాకతీయ తోరణాన్ని, చార్మినార్ చిహ్నాన్ని తొలగించాలనుకోవడం ముమ్మాటికీ తుగ్లక్ చర్యనే. కాకతీయ తోరణం, చార్మినార్ రాజరికపు గుర్తులైతే మరి భారత జాతీయ చిహ్నంగా పెట్టుకున్న నాలుగు సింహాలు, ఆశోకచక్రం దేనికి గుర్తో కాంగ్రెస్ నాయకులు సమాధానం చెప్పాలి. ఏ దేశమైనా, ఏ రాష్ట్రమైనా చారిత్రక, సాంస్కృతిక, సామాజిక నేపథ్యాన్ని ప్రతిబింబించే విధంగానే చిహ్నాలు పెట్టుకుంటాయనే ఇంగితం రాష్ట్ర కాంగ్రెస్ నాయకులకు లేకపోవడం దురదృష్టకరం.
ఒక పక్క ఉత్సవాల నిర్వహణ అంటూ సొంత డబ్బా కొట్టుకుంటున్న కాంగ్రెస్ నాయకులు తెలంగాణ కోసం కొట్లాడిన ఉద్యమకారులను అవమానిస్తూనే ఉన్నారు. 2023లో తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ నేతృత్వంలోని రేవంత్రెడ్డి ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులను మోసం చేస్తూనే ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఉద్యమకారులకు, అమర వీరుల కుటుంబాలకు అనేక హామీలు ఇచ్చింది. అమరవీరుల కుటుంబానికి నెలకు రూ.25 వేల పింఛన్ ఇస్తామన్నారు. ఉద్యమకారులందరికీ ప్రతీ నెలా గౌరవ పింఛన్ ఇస్తామన్నారు. ఉద్యమకారులందరికీ 250 గజాల చొప్పున ఇంటి స్థలం ఇస్తామన్నారు. ఉద్యమ కారులకు ఇచ్చిన ఈ మూడు ప్రధాన హామీలను నెరవేర్చాలని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. అవి నేరవేర్చిన తర్వాతనే ఉత్సవాలు నిర్వహించాలని కోరుతున్నాను.
కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ నేలపై ప్రేమ లేదు. తెలంగాణ సమస్యలపై అవగాహన లేదు. తెలంగాణ ప్రజలపై మమకారం లేదు. తెలంగాణ అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదు. మొత్తంగా వీరికి తెలంగాణ సోయి లేదు. ఈ విషయం గడిచిన 75 ఏండ్లలో అనేక మార్లు రుజువైంది. తెలంగాణ విషయంలో కాంగ్రెస్ పార్టీ నిన్న, నేడు, రేపు కూడా విలనే. ఇది చరిత్ర చెప్పిన సత్యం. ఉత్తుత్తి మాటలు చెప్పి మొసలి కన్నీరు కార్చి, ఉత్సవాల పేరిట హడావుడి చేస్తే కాంగ్రెస్ చేసిన పాపాలు మాసిపోవనే విషయం గమనించాలి.
– తన్నీరు హరీశ్ రావు శాసనసభ్యులు, సిద్దిపేట