ఒకటే రొద. చెవ్వులు చిల్లులు పడేటట్టు. మనసు కలవరపడేటట్టు. కండ్లెదుట జరిగినది జరగినట్టు. జరగనిది జరిగినట్టు. కనికట్టు చేసినట్టు. మనిషిని కట్టేసినట్టు. ఒకటే రొద. మరే చప్పుడూ వినిపించనివ్వకుండా! ఆ ధ్వని అబద్ధానిది. మళ్లెక్కడ నిజం నికార్సుగా, నిటారుగా బయటకు వచ్చి నిలబడుతుందోనని భయపడి అడ్డగోలు అబద్ధం అనేక రూపాలుగా విడిపోయి అన్నివైపుల నుంచీ మనలను ముంచేస్తున్నది. ఢిల్లీ నుంచి కాషాయ ముద్రాంకితులు గాలి మోటార్లలో దిగుతున్నారు హిందూ భాషలో, హిందీ యాసలో! డబ్బు మూటల గలగలల నడుమ కర్ణాటక సంగీతం కర్ణ కఠోరంగా కమ్ముకుంటున్నది. కాంగ్రెస్ అన్నాచెల్లెళ్లు తామే ఆపద్బాంధవులమంటూ ఆరున్నొక్క రాగం ఆలపిస్తూ తిరుగుతున్నరు.
ఈడీ జోడీ కట్టి సయ్యాడుతున్నది. ఐటీ పోటీ పడి సూటి పెడుతున్నది. తెలంగాణ తాబేదార్లు తాన తందాన అంటూ తన్మయత్వంలో మునిగితేలుతున్నరు. బొంగురు గొంతులతో భారంగా బానిస భజనలు పాడుతున్నారు. తెలంగాణ అంబేద్కర్ సచివాలయం పక్కనే నిలిచిన సమున్నత దళిత మూర్తి స్ఫూర్తిని చూడలేక కండ్లు బైర్లు కమ్మిన ఒకాయన, ఆత్మద్రోహం చేసుకుంటూ విద్రోహ రాగం అందుకున్నారు. ‘తెలంగాణకు మా నాన్న చేసిన అన్యాయం సాక్షిగా’ అంటూ ఒక పిల్ల కీచు గొంతు వేసుకొని, ‘చేతి’లో చెయ్యేసి బాసలు చేస్తున్నది. అన్నతో వారసత్వపు వాటాలు పంచుకోవడానికి తల్లితో కలిసి తెలంగాణలో తిరుగుతున్నది. ‘తెలంగాణకు పైసా ఇవ్వను పో’ అని సభాముఖంగా ఛీత్కరించుకున్న మాజీ ముఖ్యమంత్రి జాతీయపార్టీకి ఆశా‘కిరణ’మై రణానికి సైర చేస్తున్నడు.
మంచం మీద ఒక పార్టీ, మంచె మీద మరో పార్టీ సయ్యా‘రే వంతు’ల వారీ వ్యవహారం చేస్తున్న మరో ‘తుపాకీ రాముడు’ తనను మించిన ఉద్ధారకుడు లేడని రంకెలు వేస్తున్నడు. పదవీ విరమణ చేసిన ప్రొఫెసర్ గారు యథా ప్రకారం కేసీఆర్ను దించుడెట్లా అని రాజనీతి శాస్ర్తాన్ని మథిస్తూ అరచేతిలో ‘కోదండాలు’ వేస్తున్నారు. ‘ఉద్యమాలంటేనే చావులు, కొందరు పోతుంటారు, ఏం చేస్తం! సారీ!’ అంటూ అడ్వకేట్ మాజీ మంత్రిగారు కంటితుడుపుగా చిదంబర రహస్యాన్ని వాదిస్తున్నారు. వందల మంది అమరుల ప్రాణాలకు ఒక్క మాటలో మొక్కుబడి చదివేశారు. మోసాల పార్టీ గ్యారెంటీ కార్డు పేరుతో మీకు డబ్బులొచ్చేసినట్టే, ఇచ్చేసినట్టేనని అద్దం మీద రాస్తున్నది. మళ్లా కేసీఆర్ వస్తడు జాగ్రత్త అని ఒకడు డిజిటల్ డప్పు మీద ‘తీన్మార్’ కొడుతున్నడు.
ఎక్కడెవడు దొరుకుతాడు, కొనేద్దామని మరొకడు చీకటి గదిలో ‘కొనుగోలు’ వ్యూహాలు రచిస్తున్నడు. లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు యాంటీ సోషల్ మాయాబజార్, నోట్ల కట్టల మీద కూర్చుని, కోట్ల రీల్స్ తయారుచేస్తున్నది. థర్డ్ రేట్ సృజనాత్మక కళాకారులు, ‘లేని మెదడును’ ఎడిట్ చేసుకొని చీప్ కామెడీ తయారుచేస్తున్నరు. ‘జర్నలిస్టులు కాని జర్నలిస్టులు’ యూట్యూబ్ చానెళ్ల పేరిట దుకాణాలు తెరిచారు. నిన్నటి నష్టాలను నేడు పూడ్చుకోవడానికి టీవీ చానెళ్లు అబద్ధాన్ని ప్రాయోజితంగా ప్రసారం చేస్తున్నాయి. వెకిలి పాత్రధారుల వెర్రి నటనల యాడ్స్ తమను ఈసీ నిషేధించిందని ముద్ర వేసుకొని మరీ తిరుగుతున్నయి. సెల్ఫోన్ను చీల్చుకొని వెల్లువెత్తుతున్న వాట్సాప్ మెసేజ్ల తాకిడికి స్క్రీన్ పలిగిపోతుందేమో అనిపిస్తున్నది. ఈ రంకెలను, బొంకులను తట్టుకోలేక మెదడు బద్దలవుతుందేమో అని భయమవుతున్నది. నిజాన్ని వినే సమయం దొరకకుండా, వాస్తవాన్ని చూసే వెసులుబాటు చిక్కకుండా అష్ట దిక్కుల నుంచీ అబద్ధం ఆవరిస్తున్నది. ఈ గందరగోళం, రణగొణ నడుమ, ఇన్ని అంతరాలు, అవాంతరాల నడుమ, వెల్లువలా చుట్టుముడుతున్న అవాస్తవాల నడుమ, ఒక్కుమ్మడి దాడికి దిగిన ప్రత్యర్థుల నడుమ..
…ఎటువంటి తత్తరపాటు చూపకుండా, ఏ ఆర్భాటమూ చేయకుండా, ఎలాంటి హడావుడి పడకుండా, నలుగురిని వెంటేసుకొని, హెలికాప్టర్ ఎక్కుతూ, దిగుతూ, రోజుకు నాలుగు ఊర్లు తిరుగుతూ, చేతిలో నాలుగు కాగితాలు పట్టుకొని, నడుం మీద చెయ్యేసుకొని, నెమ్మదిగా వేదిక మెట్లనెక్కి, నిటారుగా మైకు ముందు నిలబడి, ఒక్కమాట పొల్లు పోకుండా, సొల్లు చెప్పకుండా, ‘మనందరం పోరాడి తెలంగాణ తెచ్చుకున్నం. మీ కోసం నేను చావు నోట్లో తలపెట్టి రాష్ర్టాన్ని సాధించిన. తెచ్చిన తెలంగాణను ఇట్ల అభివృద్ధి చేసిన. ఫలితాలు మీ కండ్లముందే ఉన్నయి. తెలంగాణ కోసం 24 ఏండ్లు నేను కొట్లాడిన. ఇక కొట్లాడి కాపాడుకోవాల్సింది మీరు. ఉంచుకుంటరా? పోగొట్టుకుంటరా? ఆలోచించి నిర్ణయించుకోండి!’ అని సందేశమిస్తూ, ముందుకుసాగుతున్నరు. ముదిమిని లెక్క చేయకుండా.. వెలుగులీనుతున్న తెలంగాణను చూస్తూ, ముదముగా!
ఇంతకీ విమర్శకులు ఏమంటున్నారు? తెలంగాణలో అభివృద్ధి జరగలేదంటున్నారా? లేదు. కాళేశ్వరం కట్టలేదంటున్నారా? లేదు. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తిచేయలేదంటున్నారా? లేదు. పొలాలకు నీళ్లు రాలేదంటున్నారా? లేదు. ఇంటికి, పంటకు, పరిశ్రమకు 24 గంటల కరెంటు ఇవ్వలేదంటున్నారా? లేదు. 3 కోట్ల టన్నుల ధాన్యం పండలేదంటున్నారా? లేదు. పండిన వడ్లన్నీ కొనలేదంటున్నారా? లేదు. ఇంటింటికీ మంచినీళ్ల నల్లా పెట్టలేదంటున్నారా? లేదు. రోడ్లు బాగా లేవంటున్నారా? లేదు. కొత్త జిల్లాలు కాలేదంటున్నారా? లేదు. కొత్త మండలాలు ఏర్పడలేదంటున్నారా? లేదు. పింఛన్లు, సంక్షేమం పెరగలేదంటున్నారా? లేదు. హైదరాబాద్ అభివృద్ధి కాలేదంటున్నారా? లేదు. ఉద్యోగులకు దేశంలోనే భారీ జీతాలివ్వలేదంటున్నారా? లేదు. సచివాలయం కట్టలేదంటున్నారా? లేదు. ఎత్తయిన అంబేద్కర్ విగ్రహం పెట్టలేదంటున్నారా? లేదు. అమరులకు అద్భుత స్తూప నివాళి అర్పించలేదంటున్నారా? లేదు. అనడం లేదు. అనలేరు కూడా. ఎందుకంటే ఇవన్నీ మన కండ్లముందు కనిపిస్తున్న వాస్తవాలు. కాదనలేని సత్యాలు. నికార్సయిన చెరపలేని నిత్యాలు. అందుకే ఏమంటున్నారు?
మన కండ్లకు కనబడని ఒక అసత్యానికి, అందమైన మాటల ప్యాకింగ్ చేసి, అద్దాల తెరపైకి పంపి మన మెదడులో చొప్పించి, మాయజేసే, మసిబూసి మారేడుకాయ చేసే ప్రయత్నం చేస్తున్నరు. అదే ఆత్మగౌరవం, దొరతనం! కండ్లముందు కనిపించే వాటిని కాదనలేక, కనిపించని దానితో కనికట్టు చేసే ఎత్తుగడ ఇది. మన వేలితో మన కన్నే పొడిపించే సీమాంధ్ర వలస పాలకుల వ్యూహమే ఇది.
కేసీఆర్కు దొరతనమే ఉంటే, ప్రాంతం కోసం, ప్రజల కోసం ఇంతలా తగ్గేవాడా? తగ్గినెగ్గేవాడా? జరిగేదేనా? తెలంగాణలో నాటి నుంచి నేటిదాకా కేసీఆర్లాగా, జనంలో తిరిగి, జనంతో గడిపిన ఒక నాయకుడి పేరు చెప్పగలరా?
‘ఉద్యమంలో రాజీపడితే రాళ్లతో కొట్టండి, తెలంగాణ కోసం గొంగళి పురుగునైనా కావలించుకుంటా, 24 గంటల కరెంటివ్వకపోతే దేనికైనా సిద్ధం, ఇంటింటికీ నీళ్లివ్వకపోతే ఓటే అడగను అన్నవాడు’ దొర అయితడా? భూమి పుత్రుడు అయితడా? దొరతనమే ఇష్టమనుకుంటే, మొదట్లో చంద్రబాబుతో రాజీపడినా, 13 ఏండ్ల ఉద్యమంలో ఒక్కరోజు కాంగ్రెస్తో రాజీపడినా, అద్భుతమైన దొరతనమే (పదవీ వైభోగం) దక్కేది కదా! ఈ కష్టాలన్నీ ఎందుకు? అయినా కేసీఆర్ ఒక్కడేనా? మిగిలిన అన్నిపార్టీల సారథులూ అగ్రకులాల వాళ్లే కదా? వాళ్లు దొరలు కాదా?
అయినా ఆత్మగౌరవం మనకే ఉంటదా? కేసీఆర్కు ఉండదా? ఫామ్హౌజ్లో పండుకుంటడన్నది మొదలుకొని ఆయనపై ఇప్పటికి వేయని ముద్ర లేదు. చేయని విమర్శ లేదు. అయినా మనకోసం ఆయన వాటన్నింటిని భరించలేదా? ఆయనలోనో, ఆయన పార్టీలోనో ఒకటో రెండో లోటుపాట్లుంటే మనం భరించలేమా? భరిస్తే తప్పేమిటి? కండ్లముందు కనిపిస్తున్న అభివృద్ధిని ఒప్పుకోక తప్పని పరిస్థితిలో, అభివృద్ధి చేసిండు అంటూనే, మరో రకం మాయలు చేసి మనల్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నరు. ఇది కేసీఆర్పై జరుగుతున్న కుట్ర కాదు. మొత్తం తెలంగాణపై జరుగుతున్న కుట్ర. అన్ని రాష్ర్టాలనూ దాటిపోతున్న తెలంగాణను అడ్డుకోవడానికి, అందరూ కూడబలుక్కుని పన్నిన కుతంత్రం. ఉద్యమ సమయంలోనూ ఇలాంటి ప్రచార కుట్రలే జరిగాయి. వాటికి లొంగిపోయి ఉంటే తెలంగాణ వచ్చేదే కాదు. అప్పట్లాగే ఇప్పుడూ తెలంగాణ ఒక్కుమ్మడిగా ఈ కుట్రలను తిప్పికొట్టాలి.
ఇది సెల్ఫోన్ను స్విచాఫ్ చేసి, మన మెదడును స్విచాన్ చేయాల్సిన సమయం. ఇది గతకాలపు కష్టాలను, మనకాలపు సౌకర్యాలను బేరీజు వేసి చూసుకోవాల్సిన సమయం. ఇది మనసుతో కాదు; బుద్ధితో ఆలోచించాల్సిన సమయం. ఉద్వేగంతో కాదు; ఉద్యమస్ఫూర్తితో యోచించాల్సిన సమయం. ఇది చెవులతో విని నిర్ణయించుకోవాల్సిన సమయం కాదు; కండ్లతో చూసి నిర్ధారించుకోవాల్సిన సమయం. ఎవడో చూపించింది కాదు; మనకై మనం పోల్చుకొని చూడాల్సిన సమయం.
ప్రచారం అబద్ధం. ఎన్నిక నిజం. మాట అబద్ధం. ఓటు నిజం. అబద్ధాల ప్రచారానికి లొంగిపోయి, నిజమైన ఎన్నికల్లో తప్పు చేస్తే, పరిస్థితి తారుమారవుతుంది.
6 గ్యారెంటీల కోసమే రాచకొండ రైతు భూముల బేరం అన్నవాళ్లు, అడ్డగోలు హామీల కోసం తెలంగాణనే అమ్మకానికి పెడతారు. రూ. 3.5 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న కర్ణాటకలో 5 గ్యారెంటీలనే అమలు చేయలేనప్పుడు, రూ. 2 లక్షల కోట్ల బడ్జెట్ మాత్రమే ఉన్న తెలంగాణలో 6 గ్యారెంటీలను, 42 పేజీల హామీలను ఎలా అమలుచేస్తరు?
ఇప్పుడు రెవెన్యూ రివర్స్, ఉచిత కరెంటు రివర్స్ అంటున్నవాళ్లు రేపు తెలంగాణ రివర్స్ అంటరు. అప్పుడు రెడ్డొచ్చె మొదలాయె అన్నట్టు కథ మొదటికి వస్తుంది. ఏడాదికో ముఖ్యమంత్రి పారాడుకుంటూ వస్తడు.
అందుకోసం మన సొమ్ము ఢిల్లీకి కప్పమై పోవచ్చు. మన పొల్లగాడి బతుకు కత్తిపోటై కడతేరవచ్చు. మన హైదరాబాద్లో కంపెనీలకు బదులు కల్లోలం- కర్ఫ్యూ కనిపించవచ్చు. ఇదివరకిదే కదా జరిగింది! మాయాబజార్లో పింగళి అన్నట్టు ‘పెండ్లి చేయడమంటే కష్టంగానీ చెడగొట్టడం చిటికెలో పని’!
ఈనగాచి నక్కల పాలు జేస్కుంటమా? చరిత్రలో ఎన్నడూలేని రీతిలో తెలంగాణ గత పదేండ్లుగా వెలుగులు విరజిమ్ముతున్నది. మంచిగున్నదాన్ని ఉంచుకోవడమా, పోగొట్టుకోవడమా అన్నది మన చేతిలోనే ఉన్నది.
ఒక్క చాన్స్ ప్లీజ్ అనడానికి ఇదేమైనా ఖడ్గం సినిమానా? మార్పు కావాలని అమ్మను మార్చుకుంటమా? మార్పు చూడాలని నాన్నను మార్చుకుంట మా? మార్పే ముఖ్యమనుకుంటే అన్నీ మారిపోతయ్…
7 ఏండ్లుగా మలయాళీలు విజయన్ను కాపాడుకుంటున్నట్టు, 12 ఏండ్లుగా బెంగాలీలు మమతా బెనర్జీని కాపాడుకుంటున్నట్టు, 20 ఏండ్లుగా టర్కీ జనం ఎర్డోగాన్ను కాపాడుకున్నట్టు, 23 ఏండ్లుగా ఒడిషా వాసులు నవీన్ పట్నాయక్ను కాపాడుకున్నట్టు, 56 ఏండ్లుగా తమిళనాడు ప్రజలు ద్రవిడ పార్టీలను కాపాడుకుంటున్నట్టు, 74 ఏండ్లుగా చైనా ప్రజలు కమ్యూనిస్టు పార్టీని కాపాడుకుంటున్నట్టు… మనం మనకోసం కాపాడుకోవాలి కేసీఆర్ను. కేసీఆర్తోనే తెలంగాణ బాగైంది. తెలంగాణ బాగుండాలంటే కేసీఆర్ బాగుండాలె!
60 ఏండ్లలో అన్నీ ఇలాంటి కుతంత్రాలే! ఇది 2006లో హైదరాబాద్ పాతబస్తీలో జరిగిన మత కల్లోలాల దృశ్యం. చార్సౌ సాల్ షహర్ అయిన సౌభాగ్యనగరం 60 ఏండ్లలో అనుభవించిన వేదనను ఒక్క ఫొటోలో వర్ణించే సాదృశ్యమిది. దాదాపు 40 ఏండ్ల కాంగ్రెస్ దుష్పరిపాలనలో ఏకంగా 2,700 మత ఘర్షణలు జరిగాయి. ఆ తర్వాత తెలంగాణ ఏర్పడ్డాక, గత పదేండ్లలో,హైదరాబాద్లో ఒక్కటంటే ఒక్క మత కలహమూ చోటుచేసుకోలేదు. కారణం.. సీఎం కేసీఆర్! ఆయన అనుసరించిన పరిపాలన విధానం!
10 ఏండ్లలో అన్నీ ఇటువంటి చిత్రాలే ఇది హైదరాబాద్లోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో నిర్మిస్తున్న గూగుల్ ఆఫీసు. కాలిఫోర్నియాలోని హెడాఫీసు తర్వాత గూగుల్ సంస్థ అమెరికా వెలుపల నిర్మిస్తున్న అతిపెద్ద ఆఫీసు ఇదే. 30 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కడుతున్న ఈ అత్యాధునిక భవనం 2026 కల్లా పూర్తవుతుంది. దేశంలో ఇన్ని నగరాలున్నా గూగుల్ హైదరాబాద్నే ఎంచుకోవడానికి కారణం.. సీఎం కేసీఆర్! ఆయన రూపొందించిన పారిశ్రామిక విధానం!