భగత్సింగ్ జీవితం 23 ఏండ్లే కానీ, ఆ స్వల్ప జీవిత కాలంలోనే 7 ఏండ్ల తన రాజకీయ జీవితంలో నిర్దిష్టమైన లౌకిక, ప్రజాస్వామిక భావాలను వ్యాప్తిచేసి, ఆచరించిన మార్గదర్శకుడు. రాజకీయాల్లో మతానికి స్థానం ఉండరాదని, అది వ్యక్తుల అభిమతంగానే ఉండాలని నాడే బోధించారాయన. వర్గ చైతన్యమే మతతత్వాన్ని నిర్మూలిస్తుందని బలంగా నమ్మిన వ్యక్తి భగత్సింగ్.
(నేడు భగత్సింగ్ జయంతి)
మనుషులను చంపగలరేమో కానీ, వారి ఆశయాలను చంపలేరని చాటిచెప్పిన విప్లవ వీరుడు సర్దార్ భగత్సింగ్. ‘ఇంక్విలాబ్ జిందాబాద్’ నినాదంతో స్వేచ్ఛాకాంక్షను రగిల్చి, స్వరాజ్య సాధన పోరాటంలో చిరుప్రాయంలోనే ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన యోధుడు. ఆయన పేరు వింటే చాలు యావత్ భారతీయుల రక్తం గర్వంతో ఉప్పొంగుతుంది. రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఆయన ఆశయాలు, ఆలోచనలు, ఆవేశం ఎంతోమంది యువకుల్లో స్ఫూర్తినింపింది. గొప్ప విప్లవకారుడిగా, స్వాతంత్య్ర సమరయోధుడిగా చరిత్రలో నిలిచిపోయిన వీరుడు భగత్సింగ్. ఉరికొయ్య ముందు నిల్చొని ‘ఇంక్విలాబ్ జిందాబాద్’ అనే నినాదం ఇచ్చారు. ఆ ధైర్యమే విప్లవ ప్రవాహంలా మారి తర్వాతి తరాలకు మార్గదర్శకమైంది.
మతాల మధ్య సామరస్యతకు, దేశ ప్రజల నడుమ శాంతియుత సహజీవనానికి ప్రతీకగా నిలిచారు భగత్సింగ్. అందరికీ ఆమోదయోగ్యమైన విశిష్ట వ్యక్తిత్వం ఆయనది. 1919లో జలియన్వాలాబాగ్లో జరిగిన మూకుమ్మడి హత్యల తర్వాత బ్రిటిష్ వారు అవలంబించిన ‘విభజించి పాలించు’ పద్ధతికి మరింత పదునుపెట్టారు. జలియన్వాలాబాగ్ ఘటన లో మరణించిన వారిలో అన్ని మతాల వారున్నారు. జలియన్వాలాబాగ్ సంఘటన తర్వాత 1924లో దేశవ్యాప్తంగా మత ఘర్షణలు చెలరేగాయి. కొహాట్, పంజాబ్లో ఘర్షణల ప్రభావం మరింత ఎక్కువగా ఉన్నది. ఈ ఘర్షణలపై ఒక జాతీయ చర్చ తెరపైకి వచ్చింది. సార్వత్రికంగా అలాంటి మత ఘర్షణలకు చరమగీతం పాడాల్సిన అవసరం ఉన్నదని స్వాతంత్య్రోద్యమం గుర్తించింది. నాటి కాంగ్రెస్ నాయకత్వం హిందూ, ముస్లిం నాయకులతో శాంతి ఒప్పంద పత్రాలపై సంతకాలు చేయించే ప్రయత్నం చేసింది. దీనికి భగత్సింగ్ కూడా మద్దతు ఇస్తూ.. ‘నేడు భారతదేశ పరిస్థితి దయనీయంగా ఉన్నది. ఒక మతానికి చెందిన ప్రజలు పరస్పరం ఇతర మతస్థులను శత్రువులుగా భావిస్తున్నారు. కనుక రాజకీయాల నుంచి మతాన్ని వేరుచేయడమే దీనికి పరిష్కారం’ అని భగత్సింగ్ అన్నాడు.
మతం వ్యక్తిగతమైన విషయం. దానిలో ఎవరూ జోక్యం చేసుకోకూడదని భగత్సింగ్ అన్నారు. ‘ఎవరూ మతాన్ని రాజకీయాల్లోకి జొప్పించే ప్రయత్నం చేయకూడదు. ఎందుకంటే మతం ఎవ్వరినీ ఐక్యంగా ఉంచదు, అందరూ కలిసి ఐక్యంగా పనిచేసుకోనివ్వదని’ అన్నారు. నాటి గదర్ పార్టీ పిలుపుతో ఉద్యమంలో సిక్కులు, హిందువులు, ముస్లింలు ఉరికంబాలు ఎక్కేందుకు ముందుండేవారు. ‘మతాన్ని రాజకీయాల నుంచి వేరుచేస్తే, మనం భిన్న మతాలకు చెందిన వారమైనప్పటికీ, రాజకీయాల్లో మనమంతా కలిసి ఒకచోటకు రావచ్చ’ని భగత్సింగ్ నాడే వర్గచైతన్య ప్రాముఖ్యం గురించి నొక్కిచెప్పారు. మతతత్వాన్ని నిర్మూలించడానికి ఏకైక మార్గం వర్గ చైతన్యం అని అన్నారు. ఈ మతఘర్షణల వెనుక మతతత్వ నాయకులు, వార్తాపత్రికల పాత్ర ఉన్నదని, ఈ ఘర్షణలు రగిలించడంలో వార్తా పత్రికలే కీలకపాత్ర పోషించాయని భగత్సింగ్ గుర్తించారు. ప్రజల్లో అవగాహన కల్పించి, వారిలో ఉన్న సంకుచిత స్వభావాన్ని నిర్మూలించి, మతతత్వ భావజాలాన్ని అంతం చేసి, వారిలో పరస్పర అవగాహనను ప్రోత్సహించి, ఒక ఉమ్మడి భారత జాతీయతాభావాన్ని పెంపొందించడం వార్తాపత్రికల బాధ్యత. కానీ వారు తమ వ్యాపారాన్ని పెంచుకునేందుకు, సంకుచిత స్వభావాన్ని ప్రోత్సహించేందుకు, ద్వేష భావాన్ని పెంచేందుకు, ఘర్షణలకు నాయకత్వం వహించేందుకు, ఉమ్మడి భారత జాతీయ భావాన్ని నాశనం చేసేందుకు పనిచేశాయని భగత్సింగ్ గుర్తించారు.
సమానత్వం, సామాజిక న్యాయం గురించి భగత్సింగ్ చాలా రచనలు చేశారు. ‘ప్రజలందరూ సమానులేనని, వర్గాల విభజన, అంటరానితనం అనే విభజన ఉండకూడదనీ, మతానికి వ్యతిరేకంగా ఏమీ మాట్లాడకుండా ఇంట్లో కూర్చుంటామని ప్రతిజ్ఞ చెయ్యాలి, లేదా దాన్ని కచ్చితంగా వ్యతిరేకించాలి’ అని పిలుపునిచ్చారు. ఆయన ‘నేను నాస్తికుడిని ఎందుకయ్యానంటే..’ అనే వ్యాసం రాసినప్పుడు, హేతుబద్ధ వైఖరి, పాదార్థిక అవగాహన, మార్క్సిస్ట్ ప్రాపంచిక దృక్పథం తనను ప్రభావితం చేశాయని పేర్కొన్నారు. సంకుచిత స్వపక్ష దురభిమానులను భగత్సింగ్ ప్రజల శత్రువుగా చూశారు. అందుకే నేడు దేశంలో ‘భగత్సింగ్ తమ్ములం భరతమాత బిడ్డలం’ అని పైకి నినాదాలిచ్చే ఆర్ఎస్ఎస్ సంఘీయులు, కర్ణాటకలో 10వ తరగతి పిల్లలకు ఉన్న భగత్సింగ్ పాఠాన్ని తొలగించి దానికిబదులు ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుడు హెగ్డేవర్ పాఠాన్ని చేర్చారు. భగత్సింగ్ బలంగా నమ్మి ప్రచారం చేసిన లౌకిక, ప్రజాస్వామ్య భావాలపట్ల వారిలో దాచిపెట్టుకున్న వ్యతిరేకతకు ఇది ప్రత్యక్ష నిదర్శనం.
దేశ ప్రజలకు సంపూర్ణ స్వాతంత్రాన్నిచ్చే మేలైన భారతదేశాన్ని సృష్టించేందుకు భగత్సింగ్ చేసిన కృషిని ముందుకు తీసుకువెళ్లే బాధ్యత మనపై ఉన్నది. ప్రజాస్వామిక వ్యవస్థ స్థాపన కోసం సమిధలైపోయిన ఎందరో వీరుల త్యాగఫలాన్ని నేడు ప్రతి భారత పౌరుడూ ఆస్వాదిస్తున్నాడంటే ఆ ఘనత భగత్సింగ్ వంటి వీరులు, ధీరులకే దక్కుతుంది. అందుకే నేడు దేశంలో వేళ్లూనుకుపోయిన కుల, మత మౌఢ్యాలు పోవాలంటే లౌకిక, ప్రజాస్వామికశక్తులు భగత్సింగ్ స్ఫూర్తితో దేశ ప్రజలను చైతన్యపరచాలి.
‘నేను నాస్తికుడిని ఎందుకయ్యానంటే..’ అనే వ్యాసం రాసినప్పుడు, హేతుబద్ధ వైఖరి, పాదార్థిక అవగాహన, మార్క్సిస్ట్ ప్రాపంచిక దృక్పథం తనను ప్రభావితం చేశాయని పేర్కొన్నారు. సంకుచిత స్వపక్ష దురభిమానులను భగత్సింగ్ ప్రజల శత్రువుగా చూశారు. అందుకే నేడు దేశంలో ‘భగత్సింగ్ తమ్ములం భరతమాత బిడ్డలం’ అని పైకి నినాదాలిచ్చే ఆర్ఎస్ఎస్ సంఘీయులు, కర్ణాటకలో 10వ తరగతి పిల్లలకు ఉన్న భగత్సింగ్ పాఠాన్ని తొలగించి దానికిబదులు ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుడు హెగ్డేవర్ పాఠాన్ని చేర్చారు.
– నాదెండ్ల శ్రీనివాస్
96764 07140