HomeEditpageCm Kcr Faced That Injustice Heroically And Bought Electricity From Chhattisgarh And Saved The State From Falling Into Darkness
తెలివిగల్ల తెలివి తప్పిన పథకాలు
కాంగ్రెస్ పార్టీ 44 ఏండ్లలో హైదరాబాద్కు, తెలంగాణ జిల్లాలకు ఏం చేసింది? 2014 దాకా 10 జిల్లాలలో 9 జిల్లాలు వెనుకబడే ఉన్నాయి. వెనుకబడ్డ జిల్లాలకు కేంద్రం ఇచ్చే ప్రత్యేక గ్రాంట్లలోని ధనం కూడా వలస పాలకుల బాంకుల్లోకి వెళ్లిపోయి, ఆ జిల్లాలన్నీ ఏ మార్పు లేకుండా ఉన్నాయి.
కాంగ్రెస్ పార్టీ 44 ఏండ్లలో హైదరాబాద్కు, తెలంగాణ జిల్లాలకు ఏం చేసింది? 2014 దాకా 10 జిల్లాలలో 9 జిల్లాలు వెనుకబడే ఉన్నాయి. వెనుకబడ్డ జిల్లాలకు కేంద్రం ఇచ్చే ప్రత్యేక గ్రాంట్లలోని ధనం కూడా వలస పాలకుల బాంకుల్లోకి వెళ్లిపోయి, ఆ జిల్లాలన్నీ ఏ మార్పు లేకుండా ఉన్నాయి. మరి 2014 దాకా దాదాపు 58 ఏండ్లలో తెలంగాణలో ఏం జరిగింది? తర్వాత గత తొమ్మిదిన్నరేండ్లలో ఏం జరిగింది? 58 ఏండ్లు తొమ్మిదిన్నరేండ్ల కంటె చిన్నవనిపిస్తున్నది తెలంగాణ అభివృద్ధి విషయంలో.
పాత విషయాలు పక్కనపెట్టినా, కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు, నిన్న మొన్న జరిగిన కర్ణాటకలో ఎన్నికలప్పుడు ప్రమాణాలు చేసి పెట్టిన పథకాలు ఎలా ఉన్నాయో మన రాష్ట్రంలో కేసీఆర్ పెట్టిన పథకాలెలా ఉన్నాయో పోల్చి చూద్దాం! అప్పుడే తెలివి గల్ల పథకాలేవో, తెలివి తప్పిన పథకాలేవో తేటతెల్లమవుతుంది.
1.గృహజ్యోతి: వినటానికి ఎంత చక్కని పేరు. ఈ పథకం కింద ప్రతి ఇంటికి 200 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇస్తారు. ఈ పథకం ప్రజలను సహజంగానే ఆకర్షించింది. కానీ, ఏటా పెరుగుతున్న కరెంటు వాడకం, వారి రాష్ట్రంలో లభ్యమయ్యే కరెంటు సరిగ్గా లెక్కవేసుకోకుండా కోటి 34 లక్షల కుటుంబాలకు ఉచితంగా పవర్ ఇవ్వలేక రెండు నెలలలోనే బొక్కబోర్లా పడింది ప్రభుత్వం. పథకం సంగతి పక్కనపెట్టి కరెంటు ధర విపరీతంగా పెంచటం, కరెంటు కట్చేయటం చూస్తే ఈ పథకం ఎంత అనాలోచితంగా ప్రవేశపెట్టారో అర్థమవుతుంది. గృహజ్యోతి ఆరిపోయింది.
ఇక తెలంగాణలో ఏం జరిగింది? 2014లో రాష్ట్రం విడిపోగానే తెలంగాణకు రావలసిన కరెంటు చంద్రబాబు ప్రభుత్వం నిలిపేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ అన్యాయాన్ని వీరోచితంగా ఎదుర్కొని, ఛత్తీస్గఢ్ నుంచి కరెంటు కొని రాష్ట్రం అంధకారంలో మునిగిపోకుండా కాపాడారు. అంతేకాదు, భవిష్యత్తులో ఈ బాధలుండొద్దని భద్రాద్రి, యాదాద్రి పవర్స్టేషన్లను స్థాపించి, నేడు రాష్ట్రంలో 24 గంటల కరెంటు అందరికీ, రైతులకు ఉచితంగానూ ఇస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 4, 5 రోజులు అతి కష్టం మీద పనిచేసిన పరిశ్రమలు నేడు పవర్ హాలిడేలు లేకుండా చక్కగా తమ ఉత్పత్తులను పెంచుకుంటున్నాయి. ఏ పథకం తెలివి తక్కువది, ఏ ప్రణాళిక తెలివైనదో తెలుసుకోండి!
2.గృహలక్ష్మి: ప్రతి కుటుంబంలో స్త్రీకి నెలకు రూ.2,000 ఇస్తామని ప్రకటించారు. ‘దారిద్య్ర రేఖకు అడుగున ఉన్న కుటుంబాలే కోటి రెండు లక్షలున్నాయి. ఇక అన్ని కుటుంబాలకీ ఇస్తామనటంతో ప్రణాళిక ఘోరంగా విఫలమైంది. నెలరోజులు ఇచ్చాక గుడ్లు గూట్లోకి వచ్చి ఈ పథకం నిలిపివేశారు. గృహలక్ష్మి గృహజేష్ఠ అయింది. తెలంగాణలో ఆసరా పింఛన్లు వృద్ధులకు చిన్న మొత్తంలో మొదలుపెట్టి, క్రమంగా వికలాంగులకు, ఒంటరి మహిళలకు, బీడీ కార్మికులకు కూడా విస్తరించారు. అయితే ఒక పక్క సంపద పెంచి దానిని జాగ్రత్తగా లెక్కలు వేసి ఈ పథకాలు మొదలుపెట్టడంతో, అన్నీ విజయవంతంగా సాగుతున్నాయి. ప్రైవేటురంగ విస్తరణతో ఉద్యోగావకాశాలు చాలా పెరగటంతో నిరుద్యోగులకు ఈ పథకం విస్తరించలేదు.
3.అన్నభాగ్య: పేరెంత బాగుందో అంత అభాగ్య పథకమైంది ఇది కర్ణాటక కాంగ్రెస్ చేతుల్లో. అంతవరకు పరిపాలించిన బీజేపీ ప్రభుత్వం తమ అవినీతి సొమ్ము కొద్దిగా తగ్గిందని ఉచితంగా సరఫరా చేసే 7 కిలోల బియ్యం 5 కిలోలకు తగ్గించింది. అందుకని అనాలోచితంగా కాంగ్రెస్ తాము అధికారంలోకి వస్తే 10 కిలోలకు బియ్యం సరఫరా పెంచుతామని గొప్పలకు పోయింది. అయినా రైతు వ్యవసాయం బలోపేతం చేయకుండా, వారికి కరెంటు, నీళ్ళు ఇవ్వకుండా తాము దానకర్ణుల్లా మారుదామంటే సాధ్యమేనా? ముందు వ్యవసాయాన్ని బలోపేతం చేసి ఒక సంవత్సరం తర్వాత నుంచి ఇస్తామని చెప్పే తెలివి లేకపోయింది కాంగ్రెస్ నాయకులకు. గెలిచిన మరు నెల నుంచి ఇస్తామంటే బియ్యం స్వర్గం నుంచి రాలతాయా? రెండు నెలల్లో పథకం పటాపంచలైంది. తాము పంచటానికి ఇతర రాష్ర్టాలను అడుక్కున్నారు. దొరకకపోవటంతో 5 కిలోలు ఇచ్చి మిగతా 5 కిలోలకు రూ.170 ఇస్తామంటే ఎవరు సంతోషిస్తారు? అలా అన్నభాగ్య ఎత్తిపోయింది.
తెలంగాణలో ముఖ్యమంత్రి మొట్టమొదటి ప్రాధాన్యతా అంశంగా వ్యవసాయాన్ని తీసుకున్నారు. ఉచిత కరెంటు కాక, మూడున్నరేండ్లలో కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా తెలంగాణ నేలంతా తడిపారు. రైతుబంధు ఇచ్చి, క్రమంగా సంపద పెరిగాక, ఆ ధాన్యాన్ని ప్రభుత్వమే రైతుల కల్లాలకు వెళ్లి కొనేటట్టు ఏర్పాట్లు చేశారు. మరి తెలివిగల వాళ్లు ఇలాగే కదా ఒక పథకాన్ని ప్రణాళికాబద్ధంగా సాగిస్తారు. ఇప్పుడు కుటుంబానికి కాదు, తలకు 6 కిలోల చొప్పున ఇస్తున్నారు. ఎన్నికల తర్వాత ఆ రేషన్లో కూడా అందరికీ చక్కటి సన్నబియ్యం ఇచ్చే ఏర్పాట్లు చేస్తున్నారు. మేధావి చాణుక్యుడు ఒక మాట అంటాడు: ‘అధికారం నగరం నుంచి పల్లెకూ, సంపద పల్లె నుంచి రాజుకీ రావాలి.’
4.శక్తి: సగం మంది ఓటర్లు మహిళలుంటారు కాబట్టి అత్యుత్సాహంతో, అతి తెలివి తక్కువతో ప్రకటించిన పథకం ఇది. మహిళలందరికీ బస్సు ప్రయాణం ఉచితమన్నారు. దీనివల్లన అటు వాళ్ళ రోడ్డు రవాణా సంస్థ నష్టపోయింది. ఇటు ఆటోలు, క్యాబ్ల వాళ్ళు వ్యాపారం తగ్గిపోయి, నష్టపోయి, ప్రభుత్వాన్ని శాపనార్థాలు పెడుతున్నారు. అసలు ఏ మెదడు తక్కువ నాయకుడు ఈ పథకాన్ని రచించాడో కనుక్కోవాలి. తెలంగాణలో వృద్ధులు, ఒంటరి మహిళలకు పింఛన్లు, రేషన్ బియ్యం ఇవ్వటంతో వారు సంతోషంగా ఉన్నారు.
5.యువనిధి: ఈ పథకం అన్నిట్లో ప్రమాదకరమైనది. ఎందుకంటే ఇబ్బడి ముబ్బడిగా విద్యాలయాలు, విశ్వవిద్యాలయాలు ఈ దేశంలో పెంచుతూ పోయిన ప్రభుత్వాలు మాత్రం, విద్యా విధానాన్ని మార్చటం కానీ, మారుతున్న మార్కెట్లు, ఉద్యోగాలని గమనించి, దానికి తగిన కోర్సులను ప్రవేశపెట్టడం కానీ చేయటం లేదు. దేశంలో ఒక సర్వేలో డిగ్రీలున్న 85 శాతం యువతకు ఉద్యోగాలకు కావలసిన నైపుణ్యాలు లేవని తేలింది. ఉన్నత విద్యాసంస్థలకు సలహాదారులుగా, అధికారులుగా పైరవీకారులని నియమిస్తున్నాయే కానీ, నిజంగా మారుతున్న ప్రపంచాన్ని అర్థం చేసుకునే విద్యావేత్తలని నియమించటం లేదు. దానితో ఏటా పట్టాలు తీసుకొని బయటకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంటుంది. కనుక వారికి నిరుద్యోగ భృతి రాష్ట్రం మీద చాలా భారమవుతుంది. అయితే ఉద్యోగాలకు ప్రకటనలిస్తామని కర్ణాటక ప్రభుత్వం తప్పించుకుంటోందే కానీ ఈ పథకం ఇంకా మొదలవలేదు. బహుశా అవదు కూడా!
యువతకు నైపుణ్యాలు పెంచుకునే కేంద్రాలు స్థాపించి వాటిని బాగా నడపాలి రాష్ట్ర ప్రభుతాలు. అందుకే తెలంగాణలో స్టార్టప్ కంపెనీలకు ప్రోత్సాహం, పెట్టుబడి ఇస్తోంది బీఆర్ఎస్ ప్రభుత్వం. ప్రపంచంలో ఏ దేశమూ యువత అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించలేదు. అందుకే అన్నిరంగాలనూ వృద్ధి చేసి, చేతివృత్తులు, ఇతర వృత్తులు, ఉన్నత విద్యావంతులకు తమ సొంత కంపెనీల స్థాపనకు ప్రోత్సాహమిస్తోంది తెలంగాణ ప్రభుత్వం.
ఎన్నికలప్పుడు హడావుడిగా పథకాలు ప్రకటించటం కాదు. ముందుగానే ఆ పథకం ఎంతమందికి ఉపయోగం దానికి డబ్బు ఎక్కడినుంచి ఎంత తేవాలి, ఆ పథకాన్ని ఎలా, ఎప్పుడు ప్రవేశపెట్టాలన్న ప్రణాళిక ఉండాలి. అట్లా ప్రణాళికలు రచించాలంటే మన ముఖ్యమంత్రి వంటి మేధావి, దార్శనికుడు, నిబద్ధత కలిగిన నాయకుడు ఉండాలి. పైన చెప్పిన విషయాలు కాంగ్రెస్లో ఎటువంటి తెలివి తక్కువ నాయకులున్నారో, మనం ఎటువంటి నాయకుడి నీడలో సుఖంగా ఉన్నామో అర్థం చేసుకోవాలి.
ఇంక అసలు హాస్యాస్పద విషయం పరిశీలిద్దాం! 5 పథకాలు గొప్పగా ఎన్నికల్లో ప్రకటించి, గెలిచి, మూడు నెలలు కాకుండా అన్నీ విఫలమయి, తమ రాష్ట్ర ప్రజలను నిరాశ, నిస్పృహలకు గురిచేసి, చెప్పినవి, చెప్పనివి వందల పథకాలు విజయవంతంగా నడుపుతున్న కేసీఆర్ రాష్ర్టానికి వచ్చి ప్రజలకు భాషణలిస్తున్నారు కర్ణాటక ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు! నవ్వకండి, బాగా ఆలోచించండి. ఎన్నికలు ఎంతో దూరంలో లేవు. తెలివి తక్కువ కాంగ్రెస్ కావాలా? మేధావి ముఖ్యమంత్రి కావాలా?
వివేకానంద అంటారు: ‘ఎవరికీ వండుకోమని చేపలు ఇవ్వకండి; ఆ రోజుతో మీ సహాయం అయిపోతుంది. వారికి ఆ చేపల్నెలా పట్టాలో నేర్పించండి. స్వయం ప్రతిపత్తి కలిగేలా వారిని ప్రోత్సహించండి’. తెలంగాణ ప్రభుత్వం సరిగ్గా అదే చేస్తోంది.