అనాథ పిల్లల (సామాజిక భద్రత కల్పించడం) బిల్లు, 2016 ప్రకారం తల్లిదండ్రులు లేదా సంరక్షకులు విడిచిపెట్టిన లేదా కోల్పోయిన పిల్లలు అనాథ పిల్లలుగా వర్గీకరించబడతారు. నేడు 1.35 బిలియన్ల జనాభాతో కూడిన భారతదేశం ప్రపంచంలో రెండవ అతిపెద్ద అనాథ పిల్లల జనాభాను కలిగి ఉన్నది. జనాభాలో ఆరేండ్లలోపు పిల్లలు సుమారు 158.8 మిలియన్ల్ల మంది ఉంటే వారిలో 30 మిలియన్ల మంది అనాథలు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనాథలు లేని రాష్ట్రంగా మన రాష్ర్టాన్ని తీర్చిదిద్దేందుకు నడుం బిగించింది. అందుకోసం, సమగ్రచట్టం రూపొందించే పనిలో నిమగ్నమైంది. అనాథలను ప్రభుత్వ బిడ్డలుగా గుర్తించేందుకు ముందుకు వచ్చింది.
భారతదేశంలో ఒంటరిగా ఉన్న, అనాథలు, విడిచిపెట్టబడిన పిల్లలు 29.6 మిలియన్లు ఉన్నారని అంచనా. వారిలో ఏడాదికి కేవలం 3 నుంచి 4వేల మందిని మాత్రమే ఇతరులు దత్తత తీసుకుంటున్నారు. మొత్తం అనాథ పిల్లల్లో కేవలం 3 లక్షల,70 వేల మంది మాత్రమే సంరక్షణ సంస్థల్లో ఉన్నారు. అధికారిక సమాచారం ప్రకారం, రాష్ట్రంలో 2014-2022 మధ్య 1,430 మంది పిల్లలను దత్తత తీసుకున్నారు. వీరిలో 1,069 మంది బాలికలు, 361 మంది బాలురు ఉన్నారు. మిగిలినవారు రకరకాల పనుల్లో, మరికొంతమంది యాచక వృత్తిలో కాలం వెళ్లదీస్తున్నారు. మన రాష్ర్టాన్ని అనాథలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం నడుం బిగించింది.
గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతిరాథోడ్ నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం, పలువురు ఉన్నతాధికారులు గతంలో రూపొందించిన నివేదికపై చర్చించి అనాథలకు ఆత్మీయస్పర్శను అందించింది. అనాథలను ప్రభుత్వ బిడ్డలుగా గుర్తిస్తూ వారికి ప్రత్యేక స్మార్ట్ ఐడీకార్డులు జారీచేయడం, ఈ కార్డు ఉంటే ఆదాయ, కుల, ఇతర ధృవీకరణ పత్రాలకు మినహాయింపు ఇవ్వటం,. ముస్లింలలో అనాథలను చేరదీస్తున్న యతీమ్ఖానాలను ప్రభుత్వ పరిధిలోకి తీసుకొని రావడం తదితర అంశాలపై మంత్రివర్గం చర్చించింది. ప్రభుత్వ బిడ్డలుగా పరిగణించే అనాథల కోసం చేసే ఖర్చును గ్రీన్చానల్లో పెట్టాలని, దీనికి కేటాయించిన నిధులు ఆ ఏడాది ఖర్చు కాకపోతే మరుసటి ఏడాదికి క్యారీఫార్వాడ్ చేసి శాశ్వత ఆర్థిక భద్ర త కల్పించే విధంగా విధానాల రూపకల్పన జరిగే దిశగా పని చేస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం. దేశానికే మార్గదర్శనం చేసే విధంగా అనాథలకు అండగా ఉండే విధాన రూపకల్పన చేసి వచ్చే మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించడం విశేషం.
రాష్ట్రంలోని అనాథ పిల్లలకు మెరుగైన జీవన పరిస్థితులు కల్పించే లక్ష్యంతో సమగ్ర చట్టాన్ని ప్రవేశపెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించడం మంచి పరిణామం. అనాథలకు అన్ని రకాల సహాయాన్ని అందించడానికి వారిని రాష్ట్ర బిడ్డలుగా ప్రకటించిన మనసున్న ప్రభుత్వం మన తెలంగాణ ప్రభుత్వం.
అనాథలకు కేజీ టు పీజీ విద్యను అందించేందుకు గురుకులాల తరహాలో ప్రభు త్వం సమీకృత విద్యా క్యాంపస్లను ఏర్పాటు చేయాలి. అలా చేస్తే వారికి కూడా విద్యా అవకాశాలు మెరుగుపడుతాయి. రద్దీగా ఉండే రోడ్లపై ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద అనాథలు భిక్షాటన చేయడాన్ని పూర్తిగా నిర్మూలించేందుకు కృషి చేయాలి. పిల్లల అక్రమ రవాణాదారులను పీడీ చట్టం కింద అరెస్టు చేయడంతోపాటు కఠిన చర్యలు తీసుకోవాలి. కార్పొరేట్ కంపెనీలు, వ్యాపారవేత్తలు తమ కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా అనాథ గృహాలకు తమ సహాయాన్ని అందించడానికి ముందుకు రావాలి. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల(ఈడబ్ల్యూఎస్) జనాభా శాతం తక్కువగా ఉండటం వల్ల వారి పది శాతం రిజర్వేషన్లో అనాథ పిల్లలకు కొంత రిజర్వేషన్లు ఇస్తే బాగుంటుంది. విద్య, ఉపాధితో పాటు వారు జీవితాల్లో స్థిరపడే బాధ్యత ప్రభుత్వమే తీసుకొని వారిని అక్కున చేర్చుకోవాలని తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న మానవీయ నిర్ణయంతో అనాథ పిల్లల భవిష్యత్తు మారుతుందని ఆశిద్దాం.