“మహబూబ్నగర్.. నూకల రామచంద్రారెడ్డి పుట్టిన గడ్డ. వారు నడిచిన నేల మీద నిలబడి వారి పేరు తలవకుండా, వారు తెలంగాణకు చేసిన సేవలు చెప్పకుండా ఈ సభ ముగించటం సముచితం కాదు. తెలంగాణ ఎమ్మెల్యేల ఫోరం పెట్టి, ఎంతోమంది రాజనీతిజ్ఞులకే గురువైన పీవీకే రాజకీయ గురువై… ‘ఈ అబ్బాయిలో స్పార్క్ ఉంది. తనకు మంత్రి పదవి ఇవ్వకుండా నేను మంత్రి పదవి తీసుకోలేను’ అని నీలం సంజీవరెడ్డికి చెప్పి, ఆయనను ఒప్పించి పీవీని మొదటిసారి మంత్రివర్గంలోకి తీసుకొచ్చిన ఘనత నూకల రామచంద్రారెడ్డిదే. అలా పీవీని తొలి మెట్టు ఎక్కించింది నూకల రామచంద్రారెడ్డే. వారి స్మృత్యర్థం మహబూబాబాద్లోనూ, వరంగల్లోనూ కాంస్య విగ్రహాలు పెట్టుకుందాం.. ఒక ప్రభుత్వ సంస్థకు వారి పేరు పెట్టుకొని జోహార్లు చెప్పుకొందాం’ అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ మహబూబాబాద్ సభలో నూకల రామచంద్రారెడ్డిని గుర్తుచేశారు. నేటి యువతకు ఆయన గురించి పెద్దగా తెలియకపోవచ్చు కానీ, అలాంటి త్యాగధనుల గురించి తెలుసుకోవాలని సీఎం అనటం గొప్పగా అనిపించింది.
నిజమే.. నాలుగు సార్లు క్యాబినెట్ మంత్రిగా చేసిన రాజకీయ దురంధరుడు, రెండుసార్లు ప్రతిపక్ష నేతగా ప్రజల హృదయాలను గెలుచుకున్న రాజనీతిజ్ఞ ప్రవీణుడు నూకల రామచంద్రారెడ్డి. 1972లో ఏకగ్రీవంగా శాసనసభకు ఎన్నికై చరిత్ర సృష్టించిన ప్రజల మనిషి ఆయన. తనను మెచ్చి వచ్చిన ప్రతి పదవిని వరించి ఆ స్థాయికి తగ్గ హుందాతనాన్ని, గౌరవాన్ని కాపాడుకుంటూ మానవీయ ముద్ర వేసిన మహోన్నత వ్యక్తి నూకల రామచంద్రారెడ్డిని చరిత్ర మరిచిపోదు.
రామచంద్రారెడ్డి దిశానిర్దేశం చేయడం వల్లనే నందమూరి తారక రామారావు హైదరాబాద్లో ఫిల్మ్ స్టూడియో కట్టారని, మద్రాసు నుంచి హైదరాబాద్కు మకాం మార్చారని చాలామందికి తెలియదు. ఎన్టీఆర్ ఎంతో గౌరవించే వారిలో నూకల ప్రముఖులు. ఎన్టీఆర్ ఈ గడ్డ మీదికి రాకుండా ఉండి ఉంటే ఆయన రాజకీయరంగ ప్రవేశం జరిగి ఉండేదా? అలా ఒక ముఖ్యమంత్రిని రాష్ర్టానికి అందించిన ఘనత కూడా నూకలకే దక్కుతుంది. పీఎం పీఠం ఎక్కిన పీవీని తొలిమెట్టు మీద చేయిపట్టి నిల్పిందీ వారే.
తన తర్వాతి స్థానం ఇస్తానని.. మంత్రివర్గ విస్తరణలో ఆ తర్వాత పీవీని తీసుకుంటానని సంజీవరెడ్డి ఎన్నోమార్లు చెప్పినా ససేమిరా అంటూ స్నేహబంధం కోసం మంత్రి పదవిని త్యజించడానికి సిద్ధపడ్డ గొప్ప మనిషి నూకల. అంతేకాదు, తెలంగాణ వాదాన్ని తొలి నుంచి ప్రోత్సహిస్తూ తెలంగాణ గోసను గుర్తిస్తూ, తెలంగాణ ఆత్మఘోషను గౌరవిస్తూ వచ్చారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన 30 మంది ఎమ్మెల్యేలతో కలిసి తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ను అప్పట్లోనే ఏర్పాటు చేసి సత్యాగ్రహం చేసినందుకుగాను ముషీరాబాద్ జైలుకు కూడా వెళ్లివచ్చారు. ముల్కీలకు కేటాయించిన పోస్టుల్లో పనిచేసే ఆంధ్రా ఉద్యోగులను పంపించివేయాలని, పెద్ద మనుషుల ఒప్పందాన్ని అమలుచేయడంలో లోపాన్ని సరిదిద్దాలని, తెలంగాణ నిధుల ఆదాయ పరిమాణాన్ని నిర్ణయించి తెలంగాణ ప్రాంత అభివృద్ధికి ఖర్చుపెట్టాలని గట్టిగా వాదించేవారు.
నూకల తెచ్చిన సంస్కరణలు కూడా గొప్పవి. లంబాడీలను బీసీల స్థాయి నుంచి ఎస్టీలుగా మార్చటంలో కీలక భూమిక పోషించారు. భూసంస్కరణలశాఖ మంత్రిగా ఉన్నపుడు కౌలుదార్లకు రక్షణ కల్పించే రెవెన్యూ చట్టాల్లో సమూలమైన నిబంధనలు పొందుపరచి ఎంతోమంది భూ నిర్వాసితులకు భూ పంపిణీ చేశారు. వీరి నిబంధనలనే సుప్రీంకోర్టు కూడా సమర్థించటం చెప్పుకోదగిన అంశం. కొత్త సాగు పద్ధతులను రైతుకు పరిచయం చేసి ఆర్థికంగా రైతు బలపడాలని ఆకాంక్షించారు. దేశంలో అసమానతలకు కారణం నిరక్షరాస్యతే అంటూ, ఎన్నో పాఠశాలలు నెలకొల్పి పేద పిల్లలకు విద్యాబోధన చేయించారు. అడ్మినిస్ట్రేటివ్ డిఫాల్ట్ కమిటీ చైర్మన్ క్షేత్రస్థాయి అధికారులకు అధికారాల వికేంద్రీకరణకు వీలు కల్పించే వినూత్న చర్యలకు శ్రీకారం చుట్టారు. వీరిలో ఉన్న మరో గొప్ప సుగుణం ఏమంటే ఎన్ని భిన్నాభిప్రాయాలతో సభికులు వాదించుకున్నా అందరికీ స్వేచ్ఛనిస్తూ చివరికి ఏకాభిప్రాయాన్ని సాధించేవారు.
మాతృదేవత, మాతృభాష, మాతృభూమిని అమితంగా ప్రేమించే వీరు యువకుడిగా ఉన్నప్పుడే ఓయూలో వందేమాతరం ఉద్యమంలో పాల్గొన్నారు. అందుకోసం ఆయన వర్సిటీ నుంచి బహిష్కరింపబడ్డారు. ఇండో-పాక్ యుద్ధంలో మన సాయుధ బలగాలకు ఆర్థికంగా కొంత నిధిని అందించాలని తపించి తెలుగు సినిమారంగం సాయంతో ఎన్టీఆర్ను కలుసుకొని పెద్దమొత్తంలో ధనాన్ని సేకరించి ప్రధాని లాల్బహదూర్ శాస్త్రిని హైదరాబాద్కు రప్పించి ఆయనకు ఆ చెక్కును అందించే దాకా విశ్రమించని దేశభక్తుడు నూకల రామచంద్రారెడ్డి. ఆయన 1919 జనవరి 11న జమండ్లపల్లిలో జన్మించి, 1974 జూలై 27న కేవలం 55 ఏండ్లకే హఠాత్తుగా గుండెపోటుతో మరణించారు. ఆయన మరణం తెలంగాణకు తీరని లోటు. స్వాతంత్య్ర సమరయోధుడిగా, నిఖార్సయిన రాజనీతిజ్ఞ పాలకుడిగా, భూదానోద్యమంలో వినోబాభావే అనుసరణీయుడుగా, నిజమైన గాంధేయవాదిగా నూకల పాత్ర అనన్య సామాన్యం. వారి కీర్తి అజరామరం.
(ఈ నెల 11న నూకల రామచంద్రారెడ్డి జయంతి)
అయినంపూడి శ్రీలక్ష్మి: 99899 28562