పర్యావరణాన్ని, జంతువులను పరిరక్షించే ప్రయత్నాలు ఎప్పుడైనా అభినందించదగ్గవే. ప్రపంచ వ్యాప్తంగా ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. వేట కారణంగా 20వ శతాబ్దంలో చీతాలు కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది. కానీ వాటిని విదేశాల నుంచి మన దేశానికి తరలించినప్పుడు అవి ఇక్కడి వాతావరణంలో మనుగడ సాగిస్తాయా లేదా అన్న విషయాన్ని పాలకులు ఆలోచించకపోవడం శోచనీయం. వివిధ రకాల వాతావరణాల్లో వివిధ రకాల జంతువులను పరిరక్షించడం అతి పెద్ద సవాల్. చీతాల విషయానికి వస్తే అవి మన దేశ వాతావరణంలో మనుగడ సాగించడంపై పర్యావరణ వేత్తలు రెండు వర్గాలుగా విడిపోయి వాదించుకుంటున్నారు. ప్రాజెక్ట్ చీతా కోసం రూ.100 కోట్లు ఖర్చు పెడుతున్నారు.
ఈ ప్రాజెక్టు ద్వారా మరిన్ని చీతాలను తీసుకురావాలని నిర్ణయించారు. అంతరించిపోయే ప్రమాదం ఉన్న జంతువులకు భారత్ మరో ఇల్లుగా మారుతుందంటే దేశ ప్రజలందరూ గర్విస్తారు. దీని వల్ల పర్యాటకం అభివృద్ధి చెందడంతోపాటు అనేక ప్రయోజనాలు కలుగుతాయి. కానీ కునో జాతీయ పార్కు వాతావరణం చీతాలకు అనుకూలమైనది కాదని కొందరు జంతు శాస్త్రవేత్తల అభిప్రాయం. ఆ పార్కులోని స్థలం చీతాల ఆహార వేటకు సరిపోదని వారు చెబుతున్నారు. చిరుత పులుల వంటి జంతువుల వల్ల చీతాలకు హాని కలుగుతుందని వారు హెచ్చరిస్తున్నారు. కనీసం 40 ఏళ్ల కాలమైనా చీతాలు కునో జాతీయ పార్కు వాతావరణంలో మనుగడ సాగించలేవని వారు విశ్లేషిస్తున్నారు.
పేరు గొప్ప కోసం ఆడంబరంగా చీతా ప్రాజెక్టు చేపట్టడం వృథా ప్రయాస అని చాలా మంది పెదవి విరుస్తున్నారు. చీతాలకు బదులు త్వరగా, ఎక్కువగా అంతరించి పోయే ప్రమాదం ఉన్న జంతువులను పరిరక్షించే ప్రాజెక్టును చేపట్టడం మేలని సూచిస్తున్నారు. చీతాలకు బదులుగా గిర్ జాతీయ పార్కు నుంచి కొన్ని సింహాలను తిరిగి కునో పార్కులో ప్రవేశపెడితే బాగుంటుందని సూచిస్తున్నారు. కునో పార్కును సింహాల ఆవాస స్థలంగానూ తీర్చిదిద్దిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. 6 నెలల లోపు గిర్ జాతీయ పార్కు నుంచి కొన్ని సింహాలను వేరే చోటుకు తరలించాలని 2013లో సుప్రీం కోర్టు ఆదేశించింది. కానీ ఆనాడు గుజరాత్ సీఎంగా ఉన్న నరేంద్ర మోదీ ఆ పని చేయలేదు. ఇప్పుడు మోదీ ప్రధానిగా ఉన్న సమయంలో చేపట్టిన చీతా ప్రాజెక్టు కేవలం ప్రయోగాత్మకమైనది. అది విజయవంతమవుతుందా కాదా అన్న విషయాన్ని దేశం జాగ్రత్తగా గమనిస్తుంది.
కునో పార్కులో వదిలిన చీతాల సంతతి పెరిగి అవి ఆహారం కోసం తమ ఊళ్లపై పడితే తమ పరిస్థితి ఏమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఇక మీదట పొలాలకు వెళ్లాలంటేనే భయపడాల్సిన పరిస్థితి నెలకొందని రైతులు తమ గోడు వెళ్లగక్కుతున్నారు. చీతాలపై అంత ప్రేమ కనబరిచే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మనుషులపై ఆ పాటి ప్రేమ లేదా అని వారు నిలదీస్తున్నారు.
కునో నేషనల్ పార్కులో చీతాలను వదలడం పట్ల అఖిల భారత బిష్ణోయ్ సమాజం ఆగ్రహం వ్యక్తం చేసింది. వాటికి ఆ హారంగా జింకలు, వాటి పిల్లలను పార్క్ సమీపంలోకి తరలించాలని సంఘం సభ్యులు ఇటీవల ఫతేబాద్లో ధర్నా నిర్వహించారు. జింకల రక్షణ కోసం పాదయాత్రను ప్రారంభించారు.
(డెక్కన్ హెరాల్డ్ సౌజన్యంతో)