మునుగోడు నియోజకవర్గ ప్రజలారా..! మీరిచ్చే తీర్పు చాలా విశిష్టమైనది. ఎందుకంటే, దాంతో.. మీరు సంక్షేమ ప్రభుత్వాన్నా? లేక కార్పొరేట్ సామ్రాజ్యాన్నా? దేన్ని ఆకాంక్షిస్తున్నారో నిర్ధారిస్తుంది. కావున మీరంతా పార్టీలు, నేతల పట్ల అభిమాన, దురభిమానాలతో కాకుండా, కేవలం మీ నియోజక వర్గానికే కాదు, భారత భవితవ్యానికీ ఎలాంటి ప్రభుత్వం అవసరమో ఆలోచించి తీర్పు ఇవ్వాల్సిన అవసరమున్నది. ప్రతి ఒక్కరూ తమ బాధ్యతను నెరవేర్చాల్సిన చారిత్రక సందర్భంగా ఈ మునుగోడు ఎన్నికను పరిగణించాలి.
మాటల్ని బట్టి కాక, ప్రజలకు వాళ్లు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమాలను బేరీజు వేసుకొని పార్టీ అభ్యర్థిని చూడండి. పోటీలోని అభ్యర్థులను కమ్మ, రెడ్డి, కాపు, వెలమ, ముదిరాజ్, గౌడ అనే కులాన్ని బట్టి గాక, అభివృద్ధి సంక్షేమాలకు పాల్పడే పార్టీ ఏదో గుర్తెరిగి ఓటేయ్యండి. ఆ అర్థంలో చూసినట్లయితే.. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఏం చేశాయో, చేస్తున్నాయో చూస్తూనే ఉన్నాం. మరో వైపు టీఆర్ఎస్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమాలను చూసి ఆ పార్టీనే ఎంచుకోవాల్సిన చారిత్రక అవసరం నేడు మీ ముందున్నది.
కాంగ్రెస్ విషయానికి వస్తే.. కేసీఆర్ చేయనిది, తాము అధికారానికి వస్తే చేసేదేమిటో ఆ పార్టీ చెప్పటం లేదు. ‘కేసీఆర్ను దించి, మా రేవంత్ను గద్దెనెక్కించండి; కేం ద్రంలో మోదీని దించండి, మా రాహుల్ను గద్దెనెక్కించం డి’ ఇదే వారి ఏకైక నినాదం. రాష్ర్టాభివృద్ధి అనేది వారికి పట్టని విషయంగా దీంతో అర్థమవుతూనే ఉన్నది.
బీజేపీ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. కేంద్రంలో ఎనిమిదేండ్లుగా అధికారంలో ఉండి వాళ్లు చేస్తున్నదంతా విధ్వంసమే, వినాశనమే. ప్రభుత్వ రంగ సంస్థలను, దేశ సంపదను కారుచౌకగా కార్పొరేట్లకు కట్టబెట్టుతున్నది. కార్పొరేట్లకు రుణమాఫీలు, పన్ను రాయితీల ద్వారా ప్రపంచ కుబేరులుగా చేస్తూ, ప్రజలకు ఇస్తున్న సంక్షేమ పథకాలను ఉచితాలంటూ మాట్లాడుతున్నది! ఇతర పార్టీల ఆర్థిక వనరులను దెబ్బతీసి ఏక పార్టీ దిశగా నియంతృత్వానికి దారులు వేస్తున్నది. ప్రతి పక్ష పార్టీలను చీల్చటం, వాళ్ల ప్రభుత్వాలను కూల్చటం, విపక్ష పార్టీల్లో ఏక్నాథ్ షిండేలను సృష్టిస్తూ సమాఖ్య వ్యవస్థకు తూట్లు పొడుస్తున్నది. అభివృద్ధిలో దూసుకుపోతున్న తెలంగాణకు నిధులివ్వకుండా అభివృద్ధికి మోకాల డ్డుతూ, అడుగడుగునా ఆటంకాలు కలిగిస్తున్నది.
కాంగ్రెస్, బీజేపీలు ఇలా ఉంటే… కేసీఆర్ రాష్ర్టాన్ని అభివృద్ధి, సంక్షేమాల్లో దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దారు. సాగునీటిని, నిరంతర విద్యుత్తును అందిస్తున్నది టీఆర్ఎస్ ప్రభుత్వం. ఆరోగ్యమే దేశ సౌభాగ్యమని కేసీఆర్ వైద్యరంగాన్ని అభివృద్ధి చేశారు. మిషన్ భగీరథ ద్వారా రక్షిత మంచి నీటిని అందిస్తూ ఫ్లోరైడ్ రహిత తెలంగాణగా మార్చారు. వ్యవసాయం, గొర్రెలు, బర్రెలు, చేపలు, కోళ్ల పెంపకాల ద్వారా ప్రజల కొనుగోలు శక్తిని పెంచి గ్రామాలను సమృద్ధిగా తీర్చిదిద్దుతున్నారు.
టీఎస్ ఐపాస్తో పరిశ్రమలను నెలకొల్పి ఉద్యోగ కల్పనకు పెద్ద పీట వేశారు. వ్యవసాయ, పారిశ్రామిక రంగాలను జోడు గుర్రాలుగా పరిగెత్తిస్తూ అత్యల్ప కాలంలో భారత్కు అత్యధిక ఆదాయాన్ని అందిస్తున్న నాలుగవ రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దారు. అతిపెద్ద విద్య, ఐటీ హబ్లు, కాళేశ్వరం లాంటి నిర్మాణాలను స్వల్ప కాలంలో పూర్తిచేసి జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చిపెట్టారు. వివిధ రంగాల ప్రగతికి జాతీయ బహుమతులతో పాటు, ఐరాస, బీబీసీ ప్రశంసలను సంపాదించారు. నేడు.. తెలంగాణ రాష్ట్ర ప్రగతికై మీరెంచుకున్న పార్టీయే, రేపు భారత ప్రగతికి అవసరమంటూ భారతీయులకే దిశానిర్దేశం చేయనున్నారు. ఈ వాస్తవాన్ని గుర్తుంచుకొని మునుగోడు ఓటర్లు అభ్యర్థిని ఎంచుకోవాలి.
– పాతూరి వేంకటేశ్వరరావు