దక్షిణాది అంటే ఉత్తరాది నాయకులకు అనాది నుంచే చిన్నచూపు. ప్రతిభావంతుడైనా సరే, కేంద్ర రాజకీయాలను శాసించే స్థాయికి దక్షిణాది నాయకుడు ఇప్పటివరకు ఎదగలేదంటే అతిశయోక్తి కాదు. నిధులు, నీళ్ల కేటాయింపులోనూ దక్షిణాదిపై వివక్షే కొనసాగింది.
రాజ్యాంగంలో పొందుపరిచిన ఫెడరల్ స్ఫూర్తిని సైతం ఉత్తరాది నాయకులు మరిచిపోవడం అత్యంత గర్హనీయం. దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెకించిన ప్రధానిగా ఐదేండ్ల పాటు పాలించిన ఏకైక వ్యక్తి పీవీ నరసింహరావునూ వివక్షకు గురిచేశారు. రాజకీయ రంగంలోనే కాదు, సాంస్కృతిక, సామాజిక రంగాల్లోనూ ఉత్తరాదికి ఉన్న స్థానం దక్షిణాదికి లభించలేదు.
75 ఏండ్ల స్వతంత్ర భారతంలో అతి కష్టంగా దక్షిణాది నాయకులు దేశ ప్రధానులుగా దేశాన్నేలింది సుమారు ఆరేండ్లే. ఉత్తరాది నుంచి ప్రధాని అయితే దక్షిణాది నుంచి రాష్ట్రపతి, దక్షిణాది నుంచి ప్రధాని అయితే ఉత్తరాది నుంచి రాష్ట్రపతి కావాలన్న నియమాన్ని కూడా ఉత్తరాది నాయకులు పాటించటం లేదు. ఇందుకు ప్రధాన కారణం జాతీయ పార్టీలుగా చెప్పుకునే పార్టీలన్నీ ఉత్తరాది నుంచి పుట్టినవి కావడమే. జాతీయపార్టీలుగా దేశాన్ని ఏలిన, ఏలుతున్న కాంగ్రెస్, బీజేపీ, జనతా, కమ్యూనిస్ట్టు పార్టీలన్నీ ఉత్తరాది నాయకుల, పార్టీల, వాతావరణానికి అనుకూలంగా ఏర్పడినవే. తర్వాతి కాలంలో వచ్చిన జాతీయ పార్టీ బీఎస్పీ కూడా ఉత్తరాది నాయకుల నుంచి, ఉత్తరాదిలో స్థాపించబడిందే. పూలే, అంబేద్కర్, పెరియార్, నారాయణ గురూ లాంటి తాత్వికులంతా దక్షిణాది నుంచే వచ్చినా రాజకీయాల్లో, తదితర అన్నిరంగాల్లో ఉత్తరాది ఆధిపత్యమే కొనసాగుతుండటం గర్హనీయం. దక్షిణాది రాష్ర్టాలు కేంద్రానికి పంపుతున్న నిధులను కూడా ఆయా రాష్ర్టాలకు పంచాల్సిన నిష్పత్తిలో పంచకుండా దేశాన్నేలుతున్న జాతీయపార్టీలు వివక్ష చూపుతున్నాయి. ఈ వివక్ష పరాకాష్ఠకు చేరి గత ఎనిమేదేండ్లుగా బీజేపీ పాలనలో విశ్వరూపం దాల్చింది. దక్షిణాది రాష్ర్టాలపై జాతీయ పార్టీల వివక్ష, కర్రపెత్తనం, దక్షిణాదికి దక్కాల్సిన వాటా దక్కకపోవడం, ఉత్తరాది హిందీని బలవంతంగా దక్షిణాదిపై రుద్దడం లాంటి అనేక వివక్షల కారణంగా ప్రాంతీయ పార్టీలు పుట్టుకొచ్చాయి. జాతీయపార్టీలను మట్టిగరిపించి రాష్ర్టాల పాలనాధికారాలను చేజిక్కించుకున్నాయి. జాతీయ పార్టీల కంటే అన్నిరకాలుగా మెరుగైన పాలనను అందిస్తున్నాయి.
దాదాపు అర్ధ శతాబ్ది రాజకీయానుభవంతో, అపర చాణక్యుడిగా, రాజనీతిజ్ఞుడుగా పేరొందిన నాయకుడు కేసీఆర్. గత ఎనిమిదేండ్లుగా, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా దక్షణాది ప్రాంతీయ పార్టీలపై, రాష్ర్టాలపై బీజేపీ చూపుతున్న వివక్షను ఆయన గమనిస్తున్నారు. దేశాన్ని మధ్యయుగాల్లోకి తీసుకెళ్తున్న బీజేపీ పాలనకు చరమగీతం పాడాల్సిన అవసరాన్ని గుర్తించారు. కానీ బీజేపీయేతర జాతీయ పార్టీలేవీ పిల్లి మెడలో గంట కట్టడానికి సిద్ధంగా లేవన్నది మనం గమనిస్తూనే ఉన్నాం.
దక్షిణాది నుంచి జాతీయ పార్టీ రావాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. అందుకే ‘భారత రాష్ట్ర సమితి’ లేదా మరో పేరుతో పార్టీని స్థాపించడానికి కేసీఆర్ పూనుకున్నారు. ఈ పార్టీని స్థాపించడానికి కేసీఆర్ దేశమంతా తిరిగి వివిధ పార్టీల నాయకులతో సంప్రదించి, వారి మద్దతును కూడగట్టారు. టీఆర్ఎస్తో తెలంగాణ రాష్ర్టాన్ని సాధించి దేశానికే రోల్ మోడల్గా తెలంగాణను మార్చిన ఘనత కేసీఆర్ది. కాబట్టి జాతీయ పార్టీతో నవ, ప్రజాస్వామ్య, లౌకిక, ఆదర్శ, మానవీయ భారతాన్ని నిర్మిసారనడంలో కూడా సందేహం లేదు. ఈ పార్టీ త్వరలో విశేష ప్రజాదరణ పొందుతుంది. ఎందుకంటే.. ‘రోటీ, కప్డా, ఔర్ మకాన్’ వంటి మౌలిక సదుపాయాలతోపాటు విద్య, వైద్యం, ఆత్మగౌరవాన్ని భారతదేశ ప్రజలకిచ్చే పార్టీ కేసీఆర్ స్థాపించబోయే జాతీయ పార్టీ.
– డాక్టర్ కాలువ మల్లయ్య, 91829 18567