కేంద్రంలో అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పిస్తామని చెప్పిన బీజేపీ
ఎనిమిదేండ్లయినా ఎన్నికల హామీని అమలుచేయకుండా చోద్యం చూస్తున్నది. దళిత వ్యతిరేక పార్టీగా పేరుగాంచిన బీజేపీ తన వైఖరికి కొనసాగింపుగా ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత అంశాన్ని విస్మరించింది. ఎస్సీ వర్గీకరణను కేవలం ఎన్నికల హామీగా మిగిల్చింది. కేంద్రంలోనీ బీజేపీ ప్రభుత్వం మాదిగల పట్ల తన వైఖరిని మార్చుకొని ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించకపోతే మాదిగల ముందు దోషిగా నిలబడక తప్పదు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఎస్సీ వర్గీకరణ చేయాలని అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపించి ఎనిమిదేండ్లయినా కేంద్రం వర్గీకరణ అంశాన్ని పరిశీలించకపోవడం శోచనీయం. ఎన్నికల సమయంలో మాదిగల ఓట్ల కోసం బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు వర్గీకరణ అంశాన్ని తాత్కాలికంగా తెరమీదకు తెచ్చి అమలులో మాత్రం శ్రద్ధ చూపడం లేదు. పార్లమెంట్లో ఎస్సీ వర్గీకరణ బిల్లుకు చట్టబద్ధత కల్పించకుండా దేశాన్ని పాలించిన కాంగ్రెస్, బీజేపీలు మాదిగలను మోసం చేస్తూ ఎస్సీ కులాల మధ్య మరింత దూరం పెరగడానికి ఆజ్యం పోస్తూనే ఉన్నాయి. ఎస్సీ వర్గీకరణ ద్వారా అన్ని కులాలకు సమన్యాయం జరుగుతుందని మేధావుల అభిప్రాయం. కానీ ఈ అంశాన్ని పరిష్కరించకుండా కేంద్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా కాలయాపన చేస్తూ రాజ్యాంగస్ఫూర్తికి విఘాతం కలిగిస్తున్నాయి. దీనివల్ల ఎస్సీలలో విద్య, ఉద్యోగాలు, రాజకీయ, ఆర్థికరంగాల్లో వెనుకబడి ఉన్న మాదిగ కులం సమాన అవకాశాలు పొందలేకపోతున్నది. మాదిగల అభ్యున్నతే లక్ష్యంగా మాదిగ ఉద్యమం ప్రారంభమైంది.
ఎన్నో సంవత్సరాల ఉద్యమ ఫలితంగా ఎస్సీ వర్గీకరణ ఫలాలు పొందుతున్న సమయంలో సుప్రీంకోర్టు కొన్ని సాంకేతిక సమస్యలను ప్రస్తావిస్తూ ఎస్సీ వర్గీకరణను కొట్టి వేసింది. 26 ఏండ్లుగా నలిగిపోతున్న ఈ అం శం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మళ్లీ తెరపైకి వచ్చింది. తెలంగాణలో మాదిగల న్యాయమైన డిమాండ్ను గుర్తించిన తెలంగా ణ ప్రభుత్వం 2014 నవంబర్ 29న ఎస్సీ వర్గీకరణను సమర్థిస్తూ పార్లమెంట్లో చట్ట సవరణ చేయాలని శాసనసభలో ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. అప్పటి నుంచి వర్గీకరణ పట్ల తన సానుకూలతను ప్రదర్శిస్తూనే ఉన్నది.
ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం ఎస్సీ వర్గీకరణ పట్ల సంపూర్ణ అవగాహన కలిగి ఉన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పాటుచేసిన క్యాబినెట్ సబ్ కమిటీ రిజర్వేషన్లను జనాభా ప్రాతిపదికన అమలుచేయాలని, అప్పుడే అందరికీ సమన్యాయం జరుగుతుందని అభిప్రాయపడింది. అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణపై ఏకగ్రీవ తీర్మానం తర్వాత సీఎం కేసీఆర్, నాటి ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి 2016, మే 10న ప్రధాని మోదీని కలిసి ఎస్సీ వర్గీకరణపై పార్లమెంట్లో చట్టం చేయాలని, ఉషా మెహ్రా కమిషన్ సిఫారసులను అమలుచేయాలని కోరారు. అయినా ఫలితం శూన్యం. వర్గీకరణ సమస్యను త్వరగా పరిష్కరించాలని తెలంగాణ ప్రభుత్వం అనేకసార్లు కేంద్రానికి లేఖలు రాసింది. కానీ వాటిని కేంద్రం బుట్టదాఖలు చేసింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణకు సంబంధించి అఖిలపక్షంతో ప్రధానిని కలవడానికి సమయం కావాలని అనేకసార్లు విన్నవించుకున్నా అవకాశం ఇవ్వలేదు.
ఎస్సీ వర్గీకరణ పట్ల చిత్తశుద్ధితో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎక్కడ మంచి పేరు వస్తుందోనన్న భావనతో మాదిగ సమాజానికి బీజేపీ సర్కారు ద్రోహం చేస్తున్నది. వర్గీకరణ చేస్తామని బీజేపీ గల్లీ నాయకులు.. చేయబోమని బీజేపీ ఢిల్లీ నాయకులు గందరగోళం సృష్టిస్తున్నారు. దీన్నిబట్టి ఎస్సీ వర్గీకరణ పట్ల బీజేపీ చిత్తశుద్ధి ఏపాటిదో అవగతమవుతున్నది. ఇటీవల జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు ఎస్సీ వర్గీకరణ అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. యావత్ మాదిగ సమాజం ఢిల్లీ వేదికగా ఆందోళనలు చేస్తున్నది. అయినా కేంద్రంలోని బీజేపీ సర్కార్ స్పందించకపోవడం శోచనీ యం. కేంద్రం మాదిగల పట్ల తమ వైఖరిని మార్చుకొని ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలి. లేకపోతే మాదిగల ముందు దోషిగా నిలబడక తప్పదు.
(వ్యాసకర్త: సామాజిక విశ్లేషకులు)
డాక్టర్ బొల్లికొండ వీరేందర్: 98665 35807