శాంతియుత వాతావరణంలో బతుకుతున్న రాష్ట్ర ప్రజలను మత, కుల గజ్జి కొలిమిలోకి లాగాలనే కుట్రలు జోరందుకున్నాయి. అధికారమే పరమావధిగా ప్రజలను వేరే చేసేందుకు విభజన రాజకీయాలకు పాల్పడుతున్నారు. ఎలాగైనా సరే అధికార పీఠాన్ని అధిరోహించాలని శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే తన కులమైన ‘రెడ్డి’ కులం గొప్పతనం గురించి టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి తన నిజ స్వరూపాన్ని బయటపెట్టుకున్నాడు. తన ‘కుల గజ్జి’ అభిజాత్యాన్ని ప్రదర్శించుకున్నాడు. తెలంగాణ బడుగులకు చరిత్రలో ఎన్నడూ దక్కని రీతిలో పదవులు దక్కుతుంటే కండ్లల్ల నిప్పులు పోసుకుంటున్నాడు.
పార్టీలు గెలువాలన్నా.. రాజకీయం చేయాలన్నా.. రెడ్లకు బాధ్యతలు, అవకాశం ఇవ్వండి.. రెడ్ల చేతుల్లో మీ పార్టీని పెట్టండి’ అంటూ రేవంత్ చేసిన వ్యాఖ్యలు ఆయనలో ఉన్న కుల అహంకారాన్ని తెలియజేస్తున్నాయి. రెడ్లు మాత్రమే ఉన్నతులు, వారికే పోరాడే పటిమ ఉంటుంది. వారికే పరిపాలించే తెలివితేటలుంటాయి. మిగతా కులాల వారు దద్దమ్మలు, చేతగానివారని రేవంత్ తన మనసులో మాట బయటపెట్టాడు. ఇతర కులాలకు అన్నం పెట్టేది రెడ్లు మాత్రమే. మిగతా వారందరూ పరాన్నజీవులే. రెడ్లు తప్ప వేరే కులం వాళ్లు పదవులు పొందినా, ఉన్నత స్థానాలకు పోయినా భరించలేమన్న అర్థాలు రేవంత్ మాటల్లో ప్రతిధ్వనిస్తున్నాయి.
కాంగ్రెస్ జాతీయ పార్టీ. కులమతాలకతీతంగా అన్నివర్గాలకూ ప్రాతినిధ్యం వహించాల్సిన పార్టీ. కానీ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఆ పార్టీ విధానాలకు భిన్నంగా వ్యవహరిస్తున్నాడు. తన కులం గురించి గొప్పలు చెప్పుకోవ డం, ఇతర కులాలను కించపరచటం అత్యంత దారుణం. నాయకులకూ కులం ఉంటుంది. కానీ.. వారు అన్ని కులా లు, వర్గాలవారికీ ప్రాతినిధ్యం వహించాలి. అంతేగానీ.. ‘రెడ్ల మోచేతి నీళ్లు తాగుతూనే ఉండాలి, మిగతా వర్గాల ప్రజలు రెడ్లకు బానిసలు’ అని మనసా వాచా కర్మణా భావిస్తున్న రేవంత్రెడ్డి మనస్తత్వాన్ని ఏమనుకోవాలి? ఎలా అర్థం చేసుకోవాలి? ఇలాంటి కుల పిచ్చి ఉన్న వ్యక్తి 51 శాతం మంది బీసీలు, 16 శాతం మంది ఎస్సీలు, 10 శాతం మంది ఎస్టీలున్న రాష్ర్టానికి టీపీసీసీ అధ్యక్షుడిగా ప్రాతినిధ్యం వహించేందుకు ఎలా అర్హుడవుతాడు? కాం గ్రెస్ ప్రవచిస్తున్న ‘సామాజిక న్యాయం’ ప్రచారానికి ఎలా వారధి అవుతాడు? ఒక కులం వారే ఆధిపత్యం చెలాయించాలన్నదే కాంగ్రెస్ ‘సామాజిక న్యాయ’ సూత్రమా?
అసలు తెలంగాణలో ఉన్నది కాంగ్రెస్ పార్టీనా? లేక రెడ్డి కాంగ్రెస్సా? దీనిపై కాంగ్రెస్ అధినాయకత్వం ప్రజలకు ఒక స్పష్టత ఇవ్వాలి. రేవంత్ వ్యాఖ్యల ద్వారా మరో విషయం కూడా అర్థమవుతున్నది. కాంగ్రెస్ అంటేనే రెడ్లని, మిగతా వారంటే పార్టీకీ లెక్కే లేదని, వారిని పార్టీ నాయకులుగా, కార్యకర్తలుగా గుర్తించే ప్రసక్తే లేదనే విషయం బోధపడుతున్నది. మరి అలాంటప్పుడు.. ఆ పార్టీలోని ఇతర కులాల నేతల పరిస్థితి ఏమిటి? వారు ఎప్పుడూ రెడ్డి నాయకత్వానికి ‘బాంచన్ కాల్మొక్తా’ అని అనాల్సిందేనా? వారికి పార్టీలో ఉన్నత పదవులు లభించవా? లేక.. చేపట్టకూడదా? అర్హతలున్నా.. అణిగిమణిగి, నోరుమూసుకుని రెడ్డి నాయకుల అడుగులకు మడుగులొత్తాల్సిందేనా? రేవంత్ పరోక్షంగా అంత స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా ఆ పార్టీలో ఇతర పార్టీల నేతలు ఎలా ఉం డగలుగుతున్నారు?
రేవంత్రెడ్డి తన వ్యాఖ్యల ద్వారా బీసీ, ఎస్సీ నాయకుల సేవలను అవమానించారు. ఎగతాళి చేశారు. ఇప్పుడే కాదు, గతంలో జరిగిన ‘రెడ్డి గర్జన’ సభలో ఇలాంటి దురహంకారపూరిత వ్యాఖ్యలే చేశారు. ‘రెడ్లకు సీఎం పదవి లేదు. గవర్నర్ పదవి లేదు. కేంద్రమంత్రి పదవి లేదు. తెలంగాణలో మనం ముఖ్యమంత్రి కాకుంటే ఎలా? ఇం త ఘోరమా? మనం రాజ్యాధికారం చేపట్టాలి. మనవి రాజ్యం ఏలే కుటుంబాలు’ అంటూ తన కుల ఉన్మాదాన్ని ప్రదర్శించుకున్నారు.
కాంగ్రెస్ అధిష్ఠానానికి కల్లబొల్లి మాటలు చెప్పి టీపీసీసీ అధ్యక్ష పదవిని చేపట్టిన రేవంత్రెడ్డి, తన పదవిని కాపాడుకునే పనిలో పడ్డారు. తన కుర్చీని కాపాడుకునేందుకు ‘కుల’ రాజకీయాలకు తెరమీదికి తెస్తున్నారు. టీపీసీసీ చీఫ్ పదవిలో ఉన్న వ్యక్తి మాటలను ఆషామాషీగా తీసుకోకూడదు. ఆ మాటల వెనుక కుట్ర దాగి ఉన్నదనే విషయం కాంగ్రెస్ రాజకీయాలను చూస్తే స్పష్టమవుతుంది. ప్రజాస్వామ్యంలో ప్రజల ద్వారా ఎన్నికైన ప్రభుత్వాన్ని కులం ప్రాతిపదికన నిందించడం ఎంతవరకు సమంజసమో తెలంగాణ సబ్బండ వర్ణాలకు రేవంత్ రెడ్డి వివరణ ఇవ్వాలి. రెడ్డి కులస్థులు మాత్రమే ముఖ్యమైన పదవుల్లో ఉండాలనే మీ దురాశ వెనుక.. ఇతర కులాల వారికి అవకాశాలు రావద్దనే కుట్ర ఉన్నదనే విషయాన్ని సకల జనులు గమనిస్తున్నారు. పదవులు పొందడమే రెడ్ల హక్కు అన్నట్లుగా మాట్లాడుతున్న వ్యాఖ్యలకు వ్యతిరేకంగా తెలంగాణ సమాజం ఏకం కాదా? తెలంగాణలో రెడ్లు తప్ప ఇంకెవ్వ రు లేరా? ముఖ్యమంత్రి కేసీఆర్ రెడ్డి కులస్థులతో పాటు ఇతర కులస్థులకు సమాన స్థాయిలో పదవులు ఇచ్చారు. రాష్ట్రంలో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలకు గతం లో ఎన్నడూ లేనివిధంగా ముఖ్యమైన పదవులు దక్కా యి. కానీ.. అవి కూడా కేవలం రెడ్లకే దక్కాలని కోరుకోవడం ఎంతవరకు సమంజసం?
కేసీఆర్ బడుగు వర్గాలకు రాజకీయ ప్రాధాన్యం ఇవ్వడాన్ని చూసి ఓర్వలేకనే రేవంత్రెడ్డి అవాకులు, చెవాకులు పేలుతున్నారు. బడుగుల నోటికాడి బుక్క గుంజుకోలేకపోతిమనే బాధ వారి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నది. ‘బడుగులు ఎమ్మెల్యేలుగా ఉంటే భరించలేం. వారు ఎంపీలైతే ఓర్చుకోలేం. వారిని మంత్రి పదవుల్లో ఉండనీయం. రాజ్యాధికారం రెడ్లదే ఉండాలి. బీసీలు, ఇతర వర్గాలకు అసలు ప్రాతినిధ్యమే ఉండొద్దు’ అని రేవంత్రెడ్డి అనుకుంటున్నారేమో. ఇదెక్కడి న్యాయం? నిజానికి సామాన్య రెడ్డి కులస్థులు కేసీఆర్ను అభిమానిస్తున్నారు.
గతంలో ఎన్నడూ లేనివిధంగా అగ్రవర్ణాలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయి. అగ్రవర్ణాలకు ఓవర్సీస్ స్కాలర్షిప్లు అందుతున్నాయి. కుల విబేధం లేకుండా అందరికీ రుణమాఫీ జరిగింది. రెడ్లతో సహా అందరికీ ‘రైతు బం ధు’ అందుతున్నది. వ్యవసాయ సబ్సిడీలు అన్ని కులాలకు వర్తిస్తున్నాయి. అలాంటప్పుడు ‘రాజకీయ రెడ్ల’ కోసం సామాన్య రెడ్లు బలికావాలా? కేవలం ముఖ్యమంత్రి సీటుపై కన్నేసిన దొంగలే ఈ నాటకాలాడుతున్నారని ప్రజలకు తెలుసు. అయినా.. కులోన్మాదం, మతోన్మాదం పేరుతో ఎంత రచ్చచేసినా ఆ మాయలో తెలంగాణ ప్రజలు పడిపోరు. ఇది చరిత్ర చెప్పిన వాస్తవం. పీసీసీ అధ్యక్ష పదవి లో ఉన్న రేవంత్రెడ్డికి ఈ విషయం తెలువక పోవడం హాస్యాస్పదం.
(వ్యాసకర్త: గొల్ల కుర్మహక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు)
గోసుల శ్రీనివాస్ యాదవ్
98498 16817