ఇప్పటికే ఉత్పత్తి ప్రారంభించిన ఆర్ఎఫ్సీఎల్ ‘ప్రారంభోత్సవానికి’ ప్రధాని మోదీ వస్తున్నారు! కానీ ఈ ఫ్యాక్టరీ వల్ల కలుగుతున్న కాలుష్యాన్ని కేంద్రం ఇప్పటివరకు నివారించలేదు. ఉద్యోగ నియామకాల్లో స్థానికులకు ప్రాధాన్యం ఇవ్వలేదు. నిర్వాసితులకు సరైన పరిహారం అందించలేదు. వీటి గురించి ప్రజలు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పాకే ప్రారంభిస్తే బాగుంటుంది.
దేశంలో ఎరువుల కొరత తీవ్రమవుతున్న నేపథ్యంలో గతంలో మూసేసిన రామగుండం ఫర్టిలైజర్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ను(ఆర్ఎఫ్సీఎల్) కేంద్రం తిరిగి ప్రారంభించింది. వాస్తవానికి ప్రధాని మోదీ 2016 ఆగస్టు 7న సాంకేతిక పద్ధతిలో ఈ ఫ్యాక్టరీని ప్రారంభించారు. రూ.6,175 కోట్ల పెట్టుబడితో ఫ్యాక్టరీ పునః ప్రారంభం జరిగింది. ఇందులో రూ.5 వేల కోట్లను అప్పుల ద్వారా సమీకరించారు. రోజుకు 2,200 మెట్రిక్ టన్నుల అమ్మోనియా, 3,850 మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి లక్ష్యంగా ప్రకటించారు. 2018 ఆగస్టు 18న ‘షేర్ సబ్స్క్రిప్షన్ కమ్ షేర్ హోల్డర్స్ అగ్రిమెంట్’ జరిగింది. ఈ ఫ్యాక్టరీలో నేషనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్కు 26 శాతం, ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్కు 26 శాతం, గెయిల్కు 14.3 శాతం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి 11 శాతం వాటాలు ఉన్నాయి.
ఇప్పుడు పునరుద్ధరణతో ఉత్పత్తి ప్రారంభించిన ఆర్ఎఫ్సీఎల్ నిర్మాణం వల్ల వీర్లపల్లి, లక్ష్మీపురం, ఎల్కలపల్లి, అడ్డగుంట గ్రామాల ప్రజలు కాలుష్యానికి గురి కావడంతోపాటు నిర్వాసితులయ్యారు. కొందరు ఉద్యోగులు విధి నిర్వహణలో జరిగిన ప్రమాదాల్లో చనిపోయారు. 1990 సెప్టెంబర్ 9న మిథనాల్ లీకేజీతో మంటలు లేచి 13 మంది కార్మికులు చనిపోయారు. అప్పుడు ఈ కర్మాగారాన్ని అర్ధాంతరంగా మూసి వేయడంతో కార్మికులు ఉపాధి కోల్పోయారు. పునః ప్రారంభించిన తర్వాత ఏటా తెలంగాణ చుట్టు పక్కల రాష్ర్టాలకు వేలాది టన్నుల ఎరువులను ఈ ఫ్యాక్టరీ సరఫరా చేస్తున్నది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఆర్ఎఫ్సీఎల్ రూ.759.76 కోట్ల నష్టాన్ని చవి చూసింది. కానీ 2022 -23 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో అనూహ్యంగా రూ.67 కోట్ల లాభాలను ఆర్జించింది.
అయితే 2015 మార్చి 11న జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో ఆర్ఎఫ్సీఎల్ ముఖ్య కార్యనిర్వహణాధికారి రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధంగా కింది స్థాయి ఉద్యోగుల నియామకాలపై ప్రజల అభ్యర్థనలను బుట్టదాఖలు చేశారు. జాతీయ స్థాయి ఉద్యోగ నియామక ప్రక్రియకు పూనుకొని నిర్వాసితులకు, స్థానికులకు అన్యాయం చేశారు. ఇండస్ట్రియల్, ఇంజినీరింగ్ విభాగాల్లో వందలాది మంది ఉద్యోగుల అవసరం ఉన్నప్పటికీ కనీసం కాంట్రాక్ట్టు కార్మికులగానైనా స్థానికులను నియమించుకోలేదు. కాంట్రాక్టు కార్మికుల నియామకాల్లో కూడా దళారులు డబ్బులు దండుకోవడంతో ఇద్దరు ఉద్యోగులు ఆత్మహత్యలకు యత్నించి కొన ఊపిరితో బయట పడ్డారు. ఆర్ఎఫ్సీఎల్లో ఇప్పటికే రెండుసార్లు అమ్మోనియా వాయువు లీక్ కావడం వల్ల ముగ్గురు చనిపోయారు. పరిసర ప్రాంత ప్రజలు వాయు కాలుష్యంతో బాధ పడుతున్నారు. ఈ ఫ్యాక్టరీ విడుదల చేస్తున్న పారిశ్రామిక వ్యర్థాలు, మురుగు నీరు గోదావరిలో కలిసి నదిలోని నీళ్లు కలుషితమవుతున్నా దాన్ని నివారించేందుకు ఫ్యాక్టరీ యాజమాన్యం, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఈ ఫ్యాక్టరీ వివిధ పన్నుల రూపంలో కేంద్రానికి రూ.14,362 కోట్లు చెల్లించింది. వివిధ ప్రాంతాల్లోని బొగ్గు గనుల్లో భూ గర్భ పరిశోధనలకు రూ.66 కోట్లు కేటాయించింది.
నవంబర్ 12న ఆర్ఎఫ్సీఎల్ను జాతికి అంకితం చేయడానికి ప్రధాని మోదీ రామగుండం వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఫ్యాక్టరీకి సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని వామపక్షాలు కోరుతున్నాయి. లేకపోతే ప్రధాని పర్యటనను అడ్డుకుంటామని తెలుపుతున్నాయి. ప్రజాస్వామ్య పద్ధతిలో తెలిపే నిరసనను ప్రధాని గౌరవించాలి. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీకి సంబంధించిన సమస్యలను వెంటనే పరిష్కరించాలి.
(వ్యాసకర్త: కేంద్ర కార్యదర్శి, సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్/ఏఐటీయూసీ)
-మేరుగు రాజయ్య
94414 40791