2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను ఏడు ప్రాధాన్య అంశాలతో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ బడ్జెట్లో కరోనా తర్వాత దేశం ఎదుర్కొంటున్న అత్యంత ప్రధాన సమస్యలైన ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వకపోవడం శోచనీయం.
ప్రపంచవ్యాప్తంగా ఏర్పడుతున్న ఆర్థిక మందగమన పరిస్థితుల్లో వేలాదిమంది ప్రజలు ఉద్యోగాలు, ఉపాధిని కోల్పోతున్నారు. ఈ తరుణంలో బడ్జెట్లో ఉపాధి, ఉద్యోగాల కల్పనకు చర్చలు చేపట్టకపోవడం ఈ రంగాల పట్ల కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని తెలియజేస్తున్నది. 2006 నుంచి దేశవ్యాప్తంగా అమలవుతున్న ‘మహాత్మాగాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయిమెంట్ గ్యారెంటీ ప్రోగ్రాం’కు గత మూడు బడ్జెట్లలో వరుసగా నిధులు కోతపెట్టడం వల్ల ఈ పథక లక్ష్యం నీరు గారిపోయే ప్రమాదం ఏర్పడింది. 113.7 మిలియన్ కుటుంబాలకు ఉపాధి కల్పిస్తున్న ఈ పథకానికి 2021-22 బడ్జెట్లో రూ.98 వేల కోట్లు కేటాయిస్తే, ఈ బడ్జెట్లో ఉపాధి హామీ పథకానికి 21.6 శాతం నిధులను తగ్గించారు. ఈ పథకాన్ని పూర్తిస్థాయిలో అమలుచేసి గ్రామీణ ప్రాంతాల్లో నైపుణ్యం లేనివారికి వంద రోజుల పనిదినాలు కల్పించడానికి రూ.2.73 లక్షల కోట్లు అవసరమవుతాయి. కానీ, ఈ బడ్జెట్లో ఉపాధి హామీ పథకానికి కేవలం రూ.60 వేల కోట్లు కేటాయించడం విడ్డూరం.
కేంద్ర ప్రభుత్వ తీరును పరిశీలిస్తున్న ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధికి హామీ ఇక దొరకదేమోననే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. నిధుల లేమితో ఈ పథకం అమలుపై నీలినీడలు కమ్ముకుంటున్నాయనేది వాస్తవం. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ ప్రకారం.. భారతదేశంలో నిరుద్యోగం 8.3గా ఉన్నది. దీనిలో గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగం 9 శాతం కంటే ఎక్కువగా ఉన్నదని సర్వే సంస్థ తన నివేదికలో వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఉపాధి హామీ పథకానికి నిధులు తగ్గించటంతో దేశంలో నిరుద్యోగం మరింత పెరిగే అవకాశం ఉన్నది.
2021-22 బడ్జెట్ ప్రవేశపెడుతున్న సమయంలో ఎన్నికలు జరగనున్న కేరళ, తమిళనాడు, పశ్చిమబెంగాల్, అసోం రాష్ర్టాలకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించినట్లుగానే, 9 రాష్టాలకు జరుగుతున్న శాసనసభ ఎన్నికలు, 2024లో జరిగే లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రైతులు, మహిళలు వేతన జీవులు, గిరిజనులపై కేంద్ర ప్రభుత్వం తాజా బడ్జెట్లో వరాల జల్లు కురిపించినట్లుగా కనిపిస్తున్నది. నాగాలాండ్, మేఘాలయ, త్రిపుర, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో గిరిజనుల ప్రాబల్యం ఎక్కువ కాబట్టి ఆ రాష్ర్టాల శాసనసభ ఎన్నికల్లో గెలుపు కోసం గిరిజన సంక్షేమం కోసం తాజా బడ్జెట్లో పెద్దపీట వేశారనే చెప్పాలి.
కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ, దాని అనుబంధ రంగాలకు ఈ బడ్జెట్లో 5 శాతం నిధులను తగ్గించటం ఎంతవరకు సమంజసం? వేతనజీవులకు వ్యక్తిగత ఆదాయ పన్ను పరిమితిని పెంచినప్పటికీ ఎలాంటి మినహాయింపులు ఇవ్వకపోవడంతో పెద్దగా ప్రయోజనం లేకుండాపోయింది. రైల్వేలకు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణానికి నిధులు కేటాయించిన విధంగానే విద్య, ఆరోగ్య రంగాలకు మరిన్ని నిధులు కేటాయిస్తే బాగుండేది. 2023-24 ఆర్థిక సంవత్సరం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్లో తెలంగాణ రాష్ర్టానికి నిరాశ ఎదురైందనే చెప్పాలి. కనీసం విభజన చట్టంలో పొందుపరిచిన హామీల ప్రస్తావన కూడా లేకపోవడం శోచనీయం. రైల్వే ప్రాజెక్టులు, నీటి పారుదల ప్రాజెక్టులకు నిధుల ప్రస్తావన లేదు. జాతీయ హోదా ప్రస్తావన, జాతీయ విద్యాసంస్థల కేటాయింపు లేకుండా మరొకసారి కేంద్ర బడ్జెట్ నిరాశపరిచిందనే చెప్పాలి. రూ.45 లక్షల కోట్ల బడ్జెట్లో కేటాయింపులు ఘనంగానే ఉన్నాయి. కానీ, కేటాయింపులు పూర్తిస్థాయిలో ఖర్చుచేసి లక్ష్యాలు సాధించినప్పుడే ‘విజన్ ఫర్ అమృత్ కాల్’కు సార్థకత చేకూరుతుంది.
-డాక్టర్ తిరునహరి శేషు
93903 95366