విముక్త తెలంగాణ మరోసారి మూల మలుపులో నిలిచింది. పునర్నిర్మాణ ప్రక్రియ ఊపందుకున్న నేపథ్యంలో జరుగుతున్న కీలక ఎన్నికలివి. మూడో శాసనసభకు ఎవరిని పంపాలో, ఎవరిని ఇంటికి పంపాలో ఓటరు తీర్పు చెప్పే ప్రజాస్వామ్య పర్వదినం నేడు. అభివృద్ధిలో అంగలు వేస్తున్న యువరాష్ట్రం పరిపాలన పగ్గాలు ఎవరి చేతికివ్వాలో నిర్ణయించే ముహూర్తం రానే వచ్చింది. ఈ రోజు తీర్పుతో తెలంగాణ భవితవ్యం ముడిపడి ఉంది. మరో ఐదేండ్లపాటు మన ప్రస్థానం ఎటువైపు, ఎలా సాగాలో తేల్చుకునే తరుణమిది. తెలంగాణకు మిత్రులెవరో, శత్రువులెవరో సూటిగా, ధాటిగా చెప్పుకోవాల్సి ఉంది. ఊగిసలాటకు లోనుకాకుండా, మాయోపాయాల ప్రచార పటాటోపాలను నిగ్గుదేల్చాల్సి ఉంది. బరిగీసి కొట్లాడి సాధించుకున్న తెలంగాణను ‘మేం ఇచ్చామనే’ దురహంకార పూరితమైన ధోరణిని ఎండగట్టాల్సిన అవసరముందని వేరే చెప్పాల్సిన పనిలేదు. ఎవరు ఏమిటో ప్రజలకు తెలుసు. కానీ గందరగోళపర్చి ఓటును లాగేసుకోవాలనే కుట్రలు జోరుగానే సాగడం మనం చూస్తున్నాం. అమలు చేయలేని హామీలతో ఊరించేవాళ్లు, పసలేని విమర్శలతో పబ్బం గడుపుకోవాలని చూసేవాళ్లు పొంచి చూస్తున్నారు. తొణకకుండా, బెణకకుండా, ఓటుచేజారకుండా చూసుకోవాల్సి ఉంది. మంచిని గెలిపించాల్సి ఉంది.
రాష్ర్టాన్ని సాధించి, దేశంలోనే సమున్నతంగా నిలబెట్టిన బీఆర్ఎస్ ఓ వైపు, ఉద్యమాన్ని ఆగం చేసినవాళ్లు, పచ్చబడ్డ తెలంగాణపై పట్టు కోసం అర్రులు చాస్తున్నవాళ్లు మరోవైపు నిలిచారు. చేసిన పనిని చూసి, అభివృద్ధిని చూసి ఓటేయమని ముఖ్యమంత్రి కేసీఆర్ మనవి చేశారు. విపక్షాల విష ప్రచారాలు నమ్మొద్దని హితవు చెప్పారు. మోసపోతే గోస పడుతమని పదేపదే గుర్తుచేశారు. ఇది ఆయనలోని ఆత్మవిశ్వాసానికి అద్దం పడుతున్నది. తెలంగాణ కోసం కొట్లాడిన తెగువ, ప్రగతిపథంలో నడిపించిన పరిపాలనా సామర్థ్యం చరిత్ర మరువని సత్యం. అవార్డులు, రివార్డులతో సాగిన అద్వితీయ పాలన దేశానికే దారిదీపమైంది. సకలజనుల సంక్షేమం, సర్వతోముఖాభివృద్ధి రెండు కండ్లుగా సాగిన పరిపాలన ఫలాలు మన కండ్లముందే ఉన్నాయి. ఈ ప్రగతి ప్రస్థానాన్ని గెలిపించాల్సి ఉంది.
అవతలివాళ్లు కేవలం ప్రభుత్వాన్ని దింపడం అనే నకారాత్మక ప్రచారంతో ముందుకువచ్చారు. కూల్చేస్తాం, పేల్చేస్తామంటూ వీరంగాలు వేశారు. ప్రగతి రథచక్రాలను వెనుకకు తిప్పుతామనే తిరోగమనవాదం వారి వేదమైంది. బురదజల్లుడు, బూటకపు ప్రచారాలతో హోరెత్తించా రు. వీళ్లలో ఎవరు ఎక్కడ ఉండాలో ఓటర్లు నేడు చెప్పబోతున్నారు. పా ర్టీలు కాదు, ప్రజలు గెలిచే ఎన్నికలు కావాలని సీఎం కేసీఆర్ ఎప్పుడూ అంటుంటారు. ఒకరకంగా ఇవి అలాంటి ఎన్నికలే. ఓటరు ప్రలోభాలకు గురికాకుండా, పక్కదారి పట్టకుండా అన్నీ ఆలోచించుకొని తీర్పు చెప్పాల్సి ఉంది. తెలంగాణను మరోసారి గెలిపించాల్సి ఉంది.