(నేడు, రేపు అంతర్జాతీయ బయో ఆసియా సదస్సు)
భారత్ అభివృద్ధి చెందుతున్న దేశం. ఫార్మా, జీవశాస్ర్తాలకు (Life Sciences) అనువైన హైదరాబాద్లో ‘బయో ఆసియా సదస్సు’ నిర్వహించడం గర్వకారణం. ఇది ఎన్నో విధాలుగా సామాజిక, ఆర్థిక, శాస్త్ర, సాంకేతికరంగాల అభివృద్ధికి మార్గదర్శకంగా నిలుస్తుంది.
రాష్ట్రం ఏర్పడిన తర్వాత హైదరాబాద్ రూపురేఖలు మారిపోయాయి. ఐటీ పరిశ్రమలే కాదు, ఎలక్ట్రానిక్స్, రవాణా, మౌలికవసతుల ఏర్పాటు ద్వారా వేల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి. నీతి ఆయోగ్ విడుదల చేసే ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’లో మన రాష్ట్రం 3వ స్థానంలో నిలవటం విశేషం. 2014 నుంచి నేటిదాక సుమారు రూ.7.5 లక్షల కోట్ల విలువ గల ఎగుమతులు మన హైదరాబాద్ నగరం నుంచి జరిగాయి. మన రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తి (SGDP) రూ.9 లక్షల కోట్లు దాటడానికి ప్రభుత్వ అనుకూల విధానాలే కారణం.
దేశంలో పరిశోధనరంగం చాలా వెనుకబడి ఉన్నది. జీవ, వైద్య, ఫార్మారంగాలు కొన్ని నగరాలకే పరిమితమైనాయి. టీకాలు, వైద్య పరికరాల తయారీ పరిశ్రమ, కోల్డ్ చైన్ టెక్నాలజీ, జీవశాస్త్ర పేటెంట్ హక్కులు వంటి రంగాల్లో అనేక సమస్యలున్నాయి. ఇలాంటి వాటి పరిష్కారానికి ‘బయో ఆసియా సదస్సు’ ఒక వేదిక.
రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమల అభివృద్ధి కోసం అనేక విధానాలను రూపొందించింది. టీఎస్ఐపాస్, RICH (Research and Innovation Circle of Hyde rabad) ద్వారా అనేక పరిశ్రమలకు ప్రోత్సాహకాలిచ్చింది. ఐటీ, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, సోలార్ ఎనర్జీ వంటి రంగాల్లో దేశానికే మోడల్. 1999లో జీనోమ్ వ్యాలీ ప్రారంభమైనప్పటికీ, తెలంగాణ వచ్చిన తర్వాతే అనేక పరిశ్రమలకు అందులో చోటు కల్పించారు. గత ఏడేండ్లలో ఫార్మారంగంలో సుమారు రూ.10 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ‘#pharma invest Telangana ’ పోర్టల్ ద్వారా అనేక భారీ పరిశ్రమలు హైదరాబాద్లోని జీనోమ్ వ్యాలీలో ప్రారంభమయ్యాయి. నోవాటిస్, ఫెర్రింగ్, గ్లాస్కో స్మిత్క్లిన్ వంటి సంస్థలు పెట్టుబడులు పెట్టాయి. రంగారెడ్డి జిల్లాలోని ఫార్మాసిటీలో సుమారు 19 వేల ఎకరాలను ఫార్మా రం గానికి రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఈ క్రమంలోనే ‘ life sciences policy ’ని సైతం రూపొందించింది. సుల్తాన్పూర్లో వైద్యపరికరాల పరిశ్రమ పార్క్లో అనేక అంతర్జాతీయ సంస్థలు ఇప్పటికే కార్యకలాపాలు సాగిస్తున్నాయి.
మందుల తయారీకి కావాల్సిన ముడిసరుకు మన దగ్గర తయారుచేయడానికి పలు సంస్థలు ముందుకొస్తున్నాయి. దీంతో మందుల తయారీరంగం అద్భుతమైన పురోగతి సాధిస్తున్నది. ఈ క్రమంలోనే మందుల తయా రీ, పరిశోధన సంస్థను హైదరాబాద్లో నెలకొల్పాలని ప్రభుత్వం కృషిచేస్తున్నది. నగరానికి చెందిన భారత్ బయోటెక్, హెటిరో, డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్, బయోలాజికల్ ఈ లిమిటెడ్, ఎంఎస్ఎన్ లాబొరేటరీస్ వంటి సంస్థలు టీకాలను ఉత్పత్తి చేసి, ప్రపంచ దేశాలకు ఎగుమతులు చేశాయంటే వైద్యరంగంలో హైదరాబాద్ ప్రాధాన్యాన్ని అర్థం చేసుకోవచ్చు. రాజేంద్రనగర్లోని వ్యవసాయ పరిశోధన క్షేత్రంలో వ్యవసాయాధారిత పం టలపై ఆవిష్కరణలు చేస్తారు. పంటల వైవిధ్యీకరణ దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం పంటలపై పరిశోధనలకు ఊతం ఇస్తున్నది. ‘అంతర్జాతీయ విత్తన సదస్సు’ హైదరాబాద్ లో జరగడం వ్యవసాయానికి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యాన్ని సూచించేదే.
రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమలకు అందిస్తున్న తోడ్పాటు ‘బయో ఆసియా సదస్సు’. ఈ సదస్సు ద్వారా మంచి ఫలితాలు సాధిస్తుంది. ఫార్మారంగం అద్భుతమైన ప్రగతిలో ఉన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వా నికి సహకరించాల్సిన అవసరం ఉన్నది.