తండ్రి ఆదేశం గానీ, అభిమతం గానీ ప్రకటితం కాకుండానే ఆయన మనసెరిగి, తండ్రి శంతనుడు వలచిన దాశరాజు కూతురు సత్యవతితో వివాహం జరిపించి, ఒకరకంగా శ్రీరాముడు, పరశురాముల కన్నా ‘పితృభక్తి’లో అగ్రగణ్యుడై నిలిచా డు భీష్ముడు. రాజ్యాధికారానికీ, రాజ్య భోగాలకు దూరంగా, కర్మపట్ల నిర్లిప్తం గా, నిరాసక్తంగా, మూర్తీభవించిన కర్తవ్యదీక్షామతిగా జీవిస్తూ.. ఎంతటి వీరుడో అంతటి వేదాంతిగా నిలిచాడు. రాజకార్య ధురంధరత్వంతోపాటు, అచంచల విష్ణుభక్తి తత్పరతతో చరితార్థుడు అయినవాడు భీష్ముడు.
అతని పితృభక్తికి సంతోషించి తండ్రి శంతనుడే భీష్ముడికి స్వచ్ఛంద మరణాన్ని వరంగా ఇచ్చాడు. భగవద్గీత సాక్షాత్తు శ్రీకృష్ణుడు బోధిస్తే, గీత తర్వాత అంతటి దిగా భావించే విష్ణు సహస్రనామాలను బోధించిన మహనీయుడు భీష్ముడు. అందుకు హేతువు శ్రీకృష్ణ పరమాత్మ అవతార తత్తాన్ని మూలమట్టంగా అర్థం చేసుకున్న వారిలో అగ్రగణ్యుడు భీష్ముడు.
ధర్మం పాండవుల వైపు ఉందని తెలిసి హృదయాన్ని వారికే ఇచ్చినా, శరీరాన్ని మాత్రం దుర్యోధనునికి, కురు సింహాసనానికి విధేయుడై తత్సేవకే వినిమయం చేశాడు. ఏది ధర్మమో నిర్దంద్వంగా ప్రకటిస్తూనే, ఆచరణలో యుద్ధంలో శక్తివంచన లేకుండా, అహంకార మమకారాలకు తావివ్వక, కర్తవ్యం నిర్వహిం చాడు. భారత యుద్ధంలో పదిరోజులు యుద్ధం చేసిన భీష్ముడికి ‘కురువంశ వినాశనం’ విరక్తినే కలిగించింది. అందుకే పాండవులు తనను జయించలేక మరణ రహస్యాన్ని కోరినప్పుడు, సంతోషంగా ఆ అవకాశం కోసమే చూస్తున్నా ననీ, తనకింక జీవించాలని లేదనీ, ‘శిఖండి’ కారణంగానే మరణించగలనని చెబుతాడు. పూర్వజన్మలో ప్రభాసునిగా పొందిన కర్మఫలానికి, ఈ జన్మలో స్వయంవరంలో గెలిచిన కన్యలను తాను పెళ్లాడక, పైగా ఆ కన్యలను తమ్ముడికి కట్టబెట్టాలనుకోవడం, ఆ అధర్మంలో మరో అధర్మంగా అంబను దిక్కులేని దానిని చేయడం.. ఇలాంటి వాటికి ప్రతిఫలంగానే.. నిజానికి స్వచ్ఛంద మరణ వరాన్ని శాపంగా భరించాడు.
భారత యుద్ధంలో పదిరోజుల తర్వాత పితృదేవతా నక్షత్రమైన అశ్వినీ నక్షత్రం నాడు పడిపోయాడు భీష్ముడు. ఉత్తరాయణం వచ్చేవరకూ వేచి ఉన్నాడు. మహాభారత కాలంలో మాఘ శుక్ల సప్తమి (రథసప్తమి) నాడు రథం ఉత్తరం వైపు తిరిగే రోజు ఉత్తరాయణ పుణ్యకాలంగా సూర్యుడి గతిమార్పు తెలుస్తుంది. మరునాడు అష్టమి రోజు భీష్ముడు అంపశయ్య మీద ప్రాణ త్యాగం చేశాడు. మాఘ శుక్ల సప్తమి నుంచి ఏకాదశి వరకు ఉన్న ఐదు రోజులూ ‘భీష్మ పంచకం’. ఉత్తరాయణం వరకు ప్రాణాలను నిలుపుకొన్న భీష్ముడు, స్వచ్ఛం దంగా మాఘ శుక్ల సప్తమి నుంచి ఐదు రోజులలో రోజుకొక ప్రాణాన్ని విడిచా డని చెబుతారు. కార్తీక అమావాస్య నాడు భారత యుద్ధం ప్రారంభమైందనీ, అంపశయ్యపై భీష్ముడు యాభై ఎనిమిది రోజులు ఉన్నట్టు భారతంలో స్పష్టంగా పేర్కొని ఉంది. మాఘ శుక్ల అష్టమిని భీష్మ నిర్యాణ దినంగా ‘పద్మపురాణం’ పేర్కొంది. భీష్మాష్టమి రోజు భీష్ముడికి తర్పణం విడువాలని చెబుతారు. అలా తిలాంజలి సమర్పించేవారికి సంతాన ప్రాప్తి కలుగుతుందని విశ్వాసం.
భీష్మాష్టమి నాడు సూర్యోదయానికి ముందుగా నిద్రలేచి, పూజామందిరాన్ని, ఇంటిని శుభ్రం చేసుకోవాలి. గుమ్మానికి తోరణాలు, పూజాగృహానికి ముగ్గులు సంతరించి అలంకరించుకోవాలి. అభ్యంగన స్నానం చేసి, తెలుపు రంగు వస్ర్తాల ను ధరించి రోజంతా ఉపవాసం ఉండి రాత్రి జాగారం చేయాలి. విష్ణుమూర్తి పటాన్ని పసుపు కుంకుమలు, తామరపూలు, తులసి దళాలు, జాజిమాలలతో అలంకరించాలి. నైవేద్యానికి పాయసం, తీపి పదార్థాలు, ఆకుపచ్చ పండ్లు అమర్చుకోవాలి. విష్ణు అష్టోత్తరం, నారాయణ కవచం, నారాయణ హృదయం, విష్ణు సహస్రనామాలు, విష్ణు పురాణం పఠించాలి. కనీసం 108 సార్లు ‘ఓం నమో నారాయణాయ’ అనే మంత్రాన్ని జపం చేయాలి. భీష్మాష్టమి సందర్భం గా దేవాలయాల్లో విష్ణు అష్టోత్తరం, సత్యనారాయణ వ్రతం, లక్ష తులసి పూజ వంటివి నిర్వహించడం, పేదలకు అన్నదానం చేయడం, గోవులకు గ్రాసం ఇవ్వడం అత్యంత శుభ ఫలితాలను ఇస్తాయని భావిస్తారు. భీష్ముడు సంపూర్ణ మానవుడు. కర్తవ్య పరాయణత, తాత్తికత, భక్తి ముప్పేటగా మూర్తీభవించిన మహనీయతకు భీష్ముడు ప్రతీక.
– సుధామ
98492 97958