కాంగ్రెస్ నేతృత్వంలోని రేవంత్ సర్కార్ తీరుతెన్నులు చూస్తుంటే ఉమ్మడి ఏపీ పాలన గుర్తుకువస్తున్నది. నాడు ఉమ్మడి పాలకులు ఒక్క ప్రాజెక్టును నిర్మించకుండా కరవుకు కారణమైతే, నేడు నీళ్లున్నా ఇవ్వకుండా రేవంత్ కరవును ఆహ్వానిస్తున్నారు. కాంగ్రెస్ సర్కార్ పగ్గాలు చేపట్టిన మూడు నెలలకే మళ్లీ నాటి పరిస్థితులు కనిపిస్తుండటంతో భవిష్యత్తును తల్చుకుంటూ కర్షకులు కకావికలమవుతున్నారు.
యాసంగి పంట చేతికి వచ్చే పరిస్థితి కనిపిస్తలేదు. వచ్చీపోయే కరెం టు రైతన్నలను వెక్కిరిస్తున్నది. దీంతో మార్చిలోనే రాష్ట్రవ్యాప్తంగా కరువు ఛాయలు కనిపిస్తున్నాయి. రైతుబంధు మొత్తం వేయడానికే రేవంత్రెడ్డి సర్కార్ ఆపసోపాలు పడుతున్నది. కేసీఆర్ సర్కార్పై అభాండాలు వేయాలనే ఏకైక లక్ష్యంతో రైతన్నలను అరిగోస పెడుతున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. అందులో భాగంగానే కాళేశ్వరం ప్రాజెక్టులో నీళ్లున్నా విడుదల చేయడం లేదు. ఫలితంగా రాష్ట్రంలో నీళ్ల పంచాయితీలు మొదలవుతున్నాయి. ఇటీవల సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలోని వింజపల్లిలో అన్నాదమ్ముళ్ల మధ్య సాగునీరు తగవు పెట్టింది. ఈ గొడవలో తమ్ముడు మరణించడం విచారకరం. పంటలను కాపాడుకునేందుకు రైతులు ఎంతకైనా తెగిస్తున్నారనడానికి ఈ ఘటనే నిదర్శనం.
చేతికొచ్చిన పంటలను కాపాడుకునేందుకు రైతులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. గంగమ్మను ఒడిసిపట్టేందుకు 600 ఫీట్ల వరకు బోర్లు వేస్తున్నారు. గత పదేండ్లుగా ఎవుసం సాఫీగా సాగిన తర్వాత ఒక్కసారిగా చుట్టుముట్టిన కష్టాలతో రైతులు సతమతమవుతున్నారు. నిత్యం పొలాల వద్దే ఉంటూ వరుస తడులతో నీళ్లు పారిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా పారిస్తున్నప్పటికీ ప్రయోజనం ఉండటం లేదు. ప్రస్తుతం వరి చేనులన్నీ పొట్ట దశలో ఉన్నాయి. ఈ దశలో వరికి పుష్కలంగా నీళ్లుండాలి. ఎంత నీరుంటే అంతగా పంట దిగుబడి వస్తుంది.
మొన్నటివరకు మూతపడ్డ మెకానిక్ షాపులు కాంగ్రెస్ హయాంలో మళ్లీ కళకళలాడుతున్నాయి. ఏ షాపు చూసినా రద్దీగానే కనిపిస్తున్నది. ఒక్కో మెకానిక్ రోజుకు సరాసరిగా ఎంత లేదన్నా 10-15 మోటర్లు రిపేరు చేస్తున్నారు. గత పదేండ్లుగా చీకటిలో మగ్గిపోయిన తమ జీవితాల్లో రేవంత్ సర్కార్ వెలుగులు నింపిందని మెకానిక్లు సంబురపడుతుండ టం కాంగ్రెస్ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం. అనతికాలంలోనే రైతు వ్యతిరేక ప్రభుత్వంగా రేవంత్ సర్కార్పై ముద్రపడింది. ఎన్నికల వేళ ఇచ్చిన హమీల్లో ఏ ఒక్కటి కూడా అమలు చేయకపోవడంతో రైతులు కన్నెర్ర జేస్తున్నారు. బ్యాంకర్లు పంట రుణాలను రెన్యువల్ చేసుకోవాలని ఒత్తిడి చేస్తున్నారు. కొంతమంది రైతులకు నోటీసులు కూడా జారీ చేస్తున్నారు. రూ.2 లక్షల రుణమాఫీ హామీ ఏమైందని ఎక్కడికక్కడ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులను అన్నదాతలు నిలదీస్తున్నారు. త్వరలో పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉన్నందున ఎన్నికల కోడ్ పేరు చెప్పి రైతుల నోట్లో మట్టి కొట్టాలని రేవంత్ సర్కార్ చూస్తున్నదనే వాదన కూడా వినిపిస్తున్నది. ఇటు పంట పెట్టుబడి అందక, అటు బ్యాంకర్ల ఒత్తిడితో కర్షకులు సతమతమవుతున్నారు. కష్టాల వేళ భరోసా ఇవ్వాల్సిన ప్రభుత్వం కనీసం పట్టించుకోకపోవడంతో రైతులు భయాందోళనలో ఉన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు సంక్షేమానికి పెద్దపీట వేసింది. కాళేశ్వరం జలాలతో బీడు భూముల్లో బంగారం పండింది. కేసీఆర్ పాతాళంలో ఉన్న గంగమ్మను 618 మీటర్ల ఎత్తులో ఉన్న కొండపోచమ్మ రిజర్వాయర్కు తీసుకువచ్చి నెర్రెలు బారిన భూమి దూప తీర్చారు. పల్లెలన్నీ పచ్చగా కళకళలాడినయి. అందరికీ చేతినిండా పని దొరికేది. మన చేలల్లో పనులు చేసేందుకు పక్క రాష్ర్టాల నుంచి కూలీలు వలసలు వచ్చారు. కానీ, నేడు మన రాష్ట్రం నుంచే ఇతర రాష్ర్టాలకు కూలీలు వలసలు వెళ్తున్నారు. నలుగురికీ అన్నం పెట్టిన మన రైతన్న వలస పక్షిగా మారడం విషాదకరం.